ఓలా, ఉబెర్ కొత్తగా రాలేదు: నిర్మలా సీతారామన్కు షాకిచ్చిన మారుతీ
గౌహతి: ఆటో సేల్స్ తగ్గిపోవడానికి మిలీనియల్స్.. ఓలా, ఉబెర్ క్యాబ్స్ను ఎంచుకోవడం కూడా ఓ కారణమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆటో సేల్స్ మందగమనానికి ఓలా, ఉబెర్ పేరు చెప్పడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. తాజాగా, మారుతీ సుజుకీ కూడా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో విభేదించింది.
BS6 ప్రమాణాలతో యాక్టివా 125 సీసీ, ప్రారంభ ధర రూ.67,490
ఓలా, ఉబెర్ క్యాబ్స్ కారణం కాదు...
మిలీనియల్స్ ఓలా, ఉబెర్ క్యాబ్స్ను ఎంచుకోవడం సేల్స్ మందగమనానికి కారణం కాకపోవచ్చునని, ఇది అంత బలమైన కారణం కాకపోవచ్చునని, దీనికి భిన్నంగా అసలు కారణాలు ఏమిటో తెలుసుకునేందుకు వివరణాత్మక అధ్యయనం అవసరమని మారుతి సుజుకీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
భారత యాజమాన్య విధానం ఇంకా మారలేదని, ప్రజలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నారని మారుతి సుజికీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శంశాంక్ శ్రీవాత్సవ పీటీఐ ఇంటర్వ్యూలో చెప్పారు.
నిర్మల ఏం చెప్పారంటే
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం చెన్నైలో మాట్లాడుతూ.. మిలీనియల్స్ ఆలోచనలో మార్పు వచ్చిందని, ఇప్పుడు నెలసరి వాయిదాలు చెల్లిస్తూ కార్లను కొనుగోలు చేయడానికి బదులు ఓలా, ఉబెర్ వంటి ట్యాక్సీ అగ్రిగేటర్లను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారని చెప్పారు. ఆటో మొబైల్ రంగం మందగమనానికి ఇది కూడా ఓ కారణమని ఆమె చెప్పారు.
'ఓలా, ఉబెర్ ప్యాక్టర్స్ ఆటో మందగమనానికి బలమైన కారణం కాకపోవచ్చు. అలాంటి నిర్ణయానికి రాకముందే దీనిపై (ఆటో సేల్స్ మందగమనం) అధ్యయనం చేయాలి' అని శ్రీవాత్సవ అన్నారు.
ఆరేడు ఏళ్ళుగా ఉబెర్, ఓలా..
ఓలా, ఉబెర్ క్యాబ్స్ ఆరేడు సంవత్సరాలుగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, కానీ ఇన్నేళ్లలో ఎప్పుడూ ఆటో సేల్స్ తగ్గలేదని, రైడ్ అగ్రిగేటర్లు వచ్చిన తర్వాత కూడా ఆటో పరిశ్రమ ఉత్తమ సేల్స్ను చూసిందని శ్రీవాత్సవ అన్నారు. కానీ గత కొన్ని నెలల్లోని ఆటో సేల్స్ భారీగా పడిపోతున్నాయన్నారు. కానీ ఇది కేవలం ఓలా, ఉబెర్ వల్ల మాత్రమే అనుకోవద్దని చెప్పారు.
అమెరికా మార్కెట్ ఉదాహరణ...
ఈ సందర్భంగా శ్రీవాత్సవ అమెరికా మార్కెట్ను ఉదహరించారు. అమెరికాలో ఉబెర్ కార్యకలాపాలు బాగా విస్తరించాయని, కానీ అదే సమయంలో ఆటో సేల్స్ కూడా భారీగా పెరిగాయని చెప్పారు. భారతదేశంలో కార్ల కొనుగోళ్లలో 46 శాతం మంది ఫస్ట్ టైమ్ బయ్యర్స్ అని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు ఆఫీసులకు వెళ్లేందుకు ఓలా, ఉబెర్ క్యాబ్స్ వినియోగిస్తుండవచ్చునని, కానీ ఇప్పటికీ వారాంతపు సెలవుల్లో బయటకు వెళ్లేందుకు ఓ వాహనాన్ని కొనుగోలు చేస్తారని శ్రీవాత్సవ అన్నారు.
ఓనర్షిప్ సరళి మారలేదు
భారతదేశంలో ఓనర్షిప్ సరళి ఇంకా మారలేదని శ్రీవాత్సవ అన్నారు. కొనుగోలు విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయా అనే దానిని ఎక్కువ కాలం చూడవలసి ఉంటుందని చెప్పారు. ఆటో మార్కెట్ తిరోగమనానికి పలు కారణాలు ఉండవచ్చునని చెప్పారు. లిక్విడిటీ క్రంచ్, రెగ్యులేటరీ అంశాల కారణంగా ఉత్పత్తుల వ్యయం పెరగడం, అత్యధిక ట్యాక్స్ వంటి పలు కారణాలు ఉండవచ్చునని చెప్పారు.
కేంద్రం చర్యలు సరిపోవు...
ఆటో మందగమన సమస్యల పరిష్కారం కోసం గత నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన చర్యలు ఏమాత్రం సరిపోవని శ్రీవాత్సవ అభిప్రాయపడ్డారు. అవి పరిశ్రమకు దీర్ఘకాలంలో ఉపయోగపడతాయని చెప్పారు. మారుతీ సుజుకీ ఇండియా వివిధ కొత్త వర్షన్లను విడుదల చేస్తోందని, రాబోయే పండుగ సీజన్లో కంపెనీ కొన్ని సానుకూల ఫలితాలను పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి అంతా తెలుసు..
ప్రభుత్వం నుంచి ఆశించిన మేర సహకారం గురించి శ్రీవాత్సవ మాట్లాడుతూ... ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితి చాలా క్లియర్గా తెలుసునని, ఆర్థిక వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని, ఆర్థిక రంగానికి, ఆటో పరిశ్రమకు ఏం చేయాలో అది ప్రభుత్వం చేస్తుందన్నారు. కాగా, మారుతీ సుజుకీ సేల్స్ ఆగస్ట్ నెలలో 34.3 శాతం తగ్గాయి. గత ఏడాది ఆగస్టులో 1,47,700 యూనిట్ల విక్రయం ఉండగా, ఈ ఏడాది 97,061కి పడిపోయింది.