మోడీ 100 రోజుల పాలన: ఇన్వెస్టర్ల రూ.14 లక్షల కోట్ల సంపద మటుమాయం!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ 2014లో ప్రధానిగా గెలిచిన సమయంలోను, 2019లో తిరిగి అధికారంలోకి వచ్చిన సమయంలోను మార్కెట్లు జోరు మీద కనిపించాయి. మోడీ తొలి టర్మ్లో మార్కెట్లు రికార్డ్ హైకి చేరుకున్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మార్కెట్లు ఉత్తేజంగానే ఉన్నాయి. అయితే వివిధ కారణాల వల్ల ఆ తర్వాత మార్కెట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు, అంతర్జాతీయస్థాయిలో మార్కెట్ మందగమన భయాలు, రూపాయి పడిపోవడం, ఆటో సేల్స్ పడిపోవడం వంటి వివిధ కారణాల వల్ల మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకుంటున్నాయి. నరేంద్ర మోడీ తన 100 రోజుల పాలనను పూర్తి చేసుకున్నారు. ఈ వంద రోజుల్లో దలాల్ స్ట్రీట్లో ఇన్వెస్టర్లు కోల్పోయిన సంపద అక్షరాలా రూ.14 లక్షల కోట్లు.
స్విస్ బ్యాంక్ నుంచి తొలి జాబితా, దాచిన సంపద బట్టబయలు!
రూ.14 లక్షల కోట్లు తుడిచి పెట్టుకుపోయాయి
నరేంద్ర మోడీ తన రెండో టర్మ్లోను వివిధ రంగాల్లో అధిక మార్కులు సాధించి ఉండవచ్చు. కానీ మార్కెట్ మాత్రం నీరుగారిపోయింది. ఈ వంద రోజుల్లో ఈక్విటీ మార్కెట్ నుంచి ఇన్వెస్టర్ల సంపద 14 లక్షల కోట్లు తుడిచి పెట్టుకుపోయింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎప్పటికప్పుడు అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటూ మార్కెట్కు ఊతమిచ్చే చర్యలు చేపట్టారు. ఆర్థిక మందగమనం నుంచి కోలుకోవడానికి కాస్త సమయం తీసుకుంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
రూ.140 లక్షల కోట్లుగా...
నరేంద్ర మోడీ మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు బీఎస్ఈలోని కేవలం 14 శాతం స్టాక్స్ మాత్రమే లాభాలను చవి చూశాయి. బీఎస్ఈలోని 2,664 యాక్టివ్ ట్రేడెడ్ స్టాక్స్లోని 2,290 స్టాక్స్ 96 శాతం వ్యాల్యూను కోల్పోయాయి. 422 స్టాక్స్ 40 శాతం పతనమయ్యాయి. 1,371 స్టాక్స్ 20 శాతం పడిపోయాయి. 1,872 స్టాక్స్ 10 శాతం నష్టపోయాయి. మోడీ అధికారంలోకి వచ్చిన ఈ వంద రోజుల్లో బీఎస్ఈ లిస్టెడ్ స్టాక్స్ సంయుక్త మార్కెట్ విలువ రూ.14.15 లక్షల కోట్లు కోల్పోయి రూ.140 లక్షల కోట్లుగా ఉంది.
లాభపడిన కొన్ని స్టాక్స్...
- HDFC ఏఎంసీ షేర్ మే 30న 1757 ఉండగా సెప్టెంబర్ 6వ తారీఖు నాటికి 48 శాతం పెరిగి రూ.2610 వద్ద ఉంది.
- రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఏఎం షేర్ మే 30న రూ.220.95 శాతం ఉండగా సెప్టెంబర్ 6వ తేదీ నాటికి 28 శాతం పెరిగి 282.90 వద్ద ఉంది.
అపోలో హాస్పిటల్స్ షేర్లు 24 శాతం, జైడూస్ వెల్ నెస్ షేర్లు 25.72 శాతం, అబ్బొట్టా ఇండియా షేర్లు 24 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ షేర్లు 22 శాతం, డాక్టర్ లాల్ పాత్లాబ్స్ షేర్లు 22 శాతం, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ షేర్లు 21.83 శాతం, బర్జర్ పేయింట్స్ ఇండియా షేర్లు 21.30 శాతం, ట్రెంట్ షేర్లు 21.30 శాతం పెరిగాయి.
వంద రోజుల్లో బాగా పని చేసింది...
మోడీ ప్రభుత్వం రాజకీయ, సామాజిక రంగాలలో ఈ వంద రోజుల్లో బాగా పని చేసిందని, ఆర్థిక రంగంలోనూ కొన్ని కీలక చర్యలు తీసుకుందని, అయితే వృద్ధిని పునరుద్ధరించడానికి ఈ చర్యలు సరిపోతాయా లేదా అనే చర్చ ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పరిశోధన విభాగాధిపతి దీపక్ అన్నారు. ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఓపిక పట్టాలని అభిప్రాయపడ్డారు. ఎఫ్పీఐలపై సర్ఛార్జ్ వల్ల పెట్టుబడులపై ప్రభావం చూపిందని, దీంతో ప్రభుత్వం వాటిని ఆ తర్వాత వెనక్కి తీసుకుంది. అలాగే అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా రూపాయి బలహీనపడింది. ఈ ప్రభావం మార్కెట్లపై పడింది.
బీఎస్ఈలో బాగా దెబ్బతిన్న కంపెనీలు..
మోడీ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లో బీఎస్ఈలో లిస్టైన కంపెనీల్లో భారీగా నష్టపోయిన కంపెనీల్లో జెట్ ఎయిర్వేస్ కూడా ఉంది. టాప్లో హెచ్ఎస్ఐఎల్ ఉంది. ఈ కంపెనీ షేర్లు 83.71 శాతం పడిపోయాయి. కాఫీ డే ఎంటర్ప్రైజెస్ షేర్లు 75.96 శాతం పడిపోయాయి. జెట్ ఎయిర్వేస్ షేర్లు 74.28 శాతం పడిపోయాయి. రిలయన్స్ కాపిటల్ షేర్లు 72.96, ఇండియాబుల్స్ ఇంటెగ్రేటెడ్ సర్వీసెస్ షేర్లు 82.08 శాతం, సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ షేర్లు 65.21 శాతం, జైన్ ఇరిగేషన్ సిస్టమ్ షేర్లు 64.85 శాతం, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 63.48 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్ షేర్లు 62.94 శాతం, వొడాఫోన్ ఐడియా షేర్ 61.05 శాతం పడిపోయాయి.