ఈ నెలాఖరునే వీరి అకౌంట్లోకి రూ.10,000!! జగన్ గుడ్న్యూస్
తాను అధికారంలోకి వస్తే నవరత్నాలు అమలు చేస్తానని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. తాజాగా, ఆటో/ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ.10,000 ఇచ్చే స్కీంని త్వరలో ప్రారంభించనున్నారు. ఇందుకోసం ప్రాథమికంగా రూ.400 కోట్లు కేటాయించారు. అవసరాన్ని బట్టి ఈ మొత్తాన్ని పెంచుతారు.
ప్రీమియం మోత, ట్రాఫిక్ ఉల్లంఘనలతో మోటార్ ఇన్సురెన్స్ లింక్!
రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
గ్రామస్థాయిలో ఎండీవో, జిల్లా స్థాయిలో మున్సిపల్ కమిషన్ ద్వారా ఈ పథకాన్ని నిర్వహిస్తారు. రేపటి నుంచి (సెప్టెంబర్ 10, మంగళవారం) లబ్ధిదారుల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక ఇంట్లో తండ్రి లేదా మేజర్ అయిన కుమారుడికి లేదా కూతురుకు సొంత క్యాబ్ లేదా ఆటో ఉంటే తండ్రితో పాటు పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. 4 లక్షలమందికి పైగా ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు.
నాలుగో వారంలో నేరుగా లబ్ధిదారులకు..
ఆటో/ట్యాక్సీ డ్రైవర్లకు ఈ సాయాన్ని ఈ నెల నాలుగో వారంలో నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు అనుగుణంగా ప్రభుత్వం రవాణా శాఖకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నెల 4వ తేదీన ఆటో/ట్యాక్సీ డ్రైవర్లకు రూ.10వేలు/ఏడాదికి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అర్హులైన వారిని గుర్తించేందుకు రవాణా శాఖ కసరత్తు పూర్తి చేసింది. రేపటి నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.
6.63 లక్షల ఆటోలు/ట్యాక్సీలు...
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అవి ఆయా జిల్లాలకు వెళ్తాయి. అనంతరం వెరిఫికేషన్ కోసం గ్రామ, వార్డు వాలంటీర్లకు వాటిని పంపిస్తారు. వెరిఫికేషన్ అనంతరం సొంతగా ఆటో/ట్యాక్సీ ఉండి వాటిని నడుపుకునే వారికి ఈ సాయం వర్తింపచేస్తారు. 2019 మార్చి నాటికి ఏపీలో 6.63 లక్షల ఆటోలు/ట్యాక్సీలు ఉన్నట్లు అంచనా. ఇందులో సొంతంగా నడుపుకుంటున్నవి 3.97 లక్షలకు పైగా ఉన్నాయి.
రూ.10,000 నేరుగా అకౌంట్లో...
ఈ నెల నాలుగో వారంలో స్క్రూటిని చేసి గ్రామాల్లో ఎంపీడీవోలు, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం రూ.10,000 నగదును బ్యాంకుల్లో వారి ఖాతాలో వేస్తారు. అందుకు తగిన రసీదులను, లబ్ధిదారులకు గ్రామా లేదా వార్డు వాలంటీర్ అందిస్తారు.
ఈ భారం మోస్తానని జగన్...
ఆటో/ట్యాక్సీ డ్రైవర్లు ఫిట్నెస్, బీమా, మరమ్మతులకు ఖర్చు ఏటా అటు ఇటుగా రూ.10,000 వరకు ఖర్చు చేస్తున్నారు. వారికి ఇది భారంగా మారింది. తాము అధికారంలోకి వస్తే ఇలాంటి వాటి కోసం అవుతున్న ఆ మొత్తం ఖర్చు రూ.10వేలు తాము ఇస్తామని జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కరికి సాయం అందించేందుకు సిద్ధమయ్యారు.
భార్య, భర్త ఓ యూనిట్
భార్య, భర్తను ఒక యూనిట్గా తీసుకున్నారు. కొడుకు లేదా కూతురు అదే వృత్తిలో ఉంటే వారిని మరో యూనిట్గా తీసుకుంటారు. కేవలం వారు మేజర్లు అయి ఆటో నడుపుకుంటే చాలు. మరో యూనిట్గా పరిగణించి రూ.10వేలు ఇస్తారు. ప్రాథమికంగా 4 లక్షల మంది డ్రైవర్లకు సాయం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆటో/ట్యాక్సీ డ్రైవర్ల సంఖ్య పెరిగినా సాయం వర్తింప చేయాలని ప్రభుత్వం చెబుతోంది.
ఆటో/ట్యాక్సీల లెక్కపై కసరత్తు
అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసేందుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఆటోలు, ట్యాక్సీలు నడుపుతున్న వారిని గుర్తించాల్సి ఉంది. రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ అయిన ఆటోలు ఎన్ని? నడుస్తున్నవి ఎన్ని? యజమానుల స్థితిగతులు ఏమిటి? అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. ట్రావెల్ ఏజెన్సీల పరిధిలోని కార్లు మినహా వ్యక్తిగతంగా నడుపుతున్న వారు ఎంతమంది? ఎన్ని ట్యాక్సీలు ఉన్నాయి? అనే లెక్కలు ఆరా తీస్తున్నారు.