వాహన విడిభాగాలపై 18 శాతం జీఎస్టీపై త్వరలో గుడ్న్యూస్
అన్ని వాహన విడిభాగాలపై 18 శాతం జీఎస్టీ ఉండాలని ACMA అధ్యక్షులు రామ్ వెంకటరమణి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ట్రాన్స్మిషన్, ఇంజిన్ వంటి హైవ్యాల్యూ కాంపోనెంట్స్ పైన జీఎస్టీ 28 శాతంగా ఉంది. బ్రేక్స్, మఫ్లర్స్, వీల్స్ వంటి వాటి పైన 18 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో అన్నింటి పైన ఏకరీతిన 18 శాతం మాత్రమే విధించాలని కోరారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన వార్థిక సమావేశంలో వారు మాట్లాడారు.
కార్డు లేకుండానే: స్కాన్ చేసి ATM నుంచి డబ్బు విత్డ్రా చేయవచ్చు
డిమాండ్ పెంచేందుకు చర్యలు
దేశవ్యాప్తంగా వాహన తయారీదార్లు డిమాండ్ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారని, విడిభాగాల రంగం మొత్తానికి పద్దెనిమిది శాతం జీఎస్టీ చేసి ఆటో రంగానికి ఊతమివ్వాలని విజ్ఞప్తి చేసారు. ప్రస్తుతం అరవై శాతం వాహన విడిభాగాలపై 18 శాతం జీఎస్టీ ఉందని, మిగతా 40 శాతం విడిభాగాలపై 28 శాతం జీఎస్టీ అమలు చేస్తున్నారని చెప్పారు.
18 శాతం జీఎస్టీ ఉంటే
అన్ని వాహనాల విడిభాగాలపై 18 శాతం జీఎస్టీ ఉంటే వర్కింగ్ కేపిటల్ రుణాలను దీర్ఘకాలిక ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉపయోగించుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. వాహన విడిభాగాల రంగంలో ప్రస్తుతం 50 లక్షలమంది వరకు ఉపాధి పొందుతున్నారు. దేశ జీడీపీలో 2.3 శాతం వాటా పరిశ్రమ కలిగి ఉందన్నారు.
బీటుబీ వ్యాపారం
ప్రధానంగా తాము బీటుబీ వ్యాపారంలో ఉన్నామని, కాబట్టి జీఎస్టీ 18 శాతానికి తగ్గించినా ఖజానాపై పెద్దగా ప్రభావం పడదని చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం భారీ మందగమనాన్ని ఎదుర్కొంటోందని, దీని నుంచి బయటపడేందుకు ఆటోమొబైల్స్ పైన జీఎస్టీ రేట్లు తగ్గించాలని కోరారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఫైనాన్స్ అండ్ కార్పోరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ... సెప్టెంబర్ 20 జీఎస్టీ సమావేశం జరుగుతుందని, ఇప్పటికే ఆటో రేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించాలని నిర్ణయించినట్లుగా చెప్పారు.