రిటర్న్లు ఎలా ఉన్నా ఇన్వెస్టర్ల ప్రాధాన్యం వాటికే...
దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం మూలంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్న్ లను పొందలేకపోతున్నారు. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై రిటర్న్ లు తగ్గుతున్నాయి. అయినప్పటికీ దీర్ఘకాలిక దృక్పథంతో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న ఇన్వెస్టర్ల సంఖ్య మాత్రం పెరుగుతోందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
పీపీఎఫ్ లలో అధిక రిటర్న్
* గత ఐదేళ్ల కాలంలో చూస్తే మ్యూచువల్ ఫండ్స్ కన్నా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పెట్టుబడులు రిటర్న్ లను అందించాయి.
* సాధారణంగా పీపీఎఫ్ లపై వడ్డీ రేటును ప్రతి మూడునెలలు ఒకసారి సమీక్షిస్తూ ఉంటారు. 2014-2019 మధ్యకాలంలో పీపీఎఫ్ పై సగటు వడ్డీ రేటు 8.21 శాతంగా ఉంది.
* ఇదే కాలంలో (ఆగస్ట్ 30 వరకు) లార్జ్ క్యాప్, మల్టి క్యాప్, ఈఎల్ఎస్ఎస్ (టాక్స్ సేవింగ్) ఫండ్స్ పై రిటర్న్ వరుసగా 7.79 శాతం, 8.57 శాతం, 8. 53 శాతం తగ్గింది.
* అయితే మల్టి క్యాప్, ఈ ఎల్ ఎస్ ఎస్ ఫండ్స్ లో పన్నుకు ముందు రెతుర్నలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఈక్విటీ ఫండ్స్ పై రూ. లక్ష కన్నా ఎక్కువగా రాబడి వస్తే 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పీపీఎఫ్ లపై మాత్రం పన్ను ఉండదు. కాబట్టి ఎక్కువ ప్రయోజనం ఉండదు.
* మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ విభాగంలో వరుసగా 9.51 శాతం, 9.30 శాతంగా ఉంది.
ఆస్తులు జోరుగా పెరుగుతున్నాయ్...
* ఫండ్స్ నిధులు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయుఎం) 2014 జులై లో రూ.2.5 లక్షల కోట్లు గా ఉన్నాయి. 2019 జులై నాటికీ రూ. 6.84 కోట్లకు పెరిగాయి. ఐదేళ్ల కాలంలో మూడు రేట్లు పెరిగాయి. అంతకు ముందు ఐదేళ్ల కాలంలో (2009 నుంచి 2014) 1.5 రెట్లు పెరిగాయి.
* ఈక్విటీ ఫండ్స్ లో ఎక్కువగా ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఏడాది జూన్ నాటికీ ఉన్న ఏయుఎంలో వాటా 90 శాతంగా ఉండటం విశేషం.
* దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి మందగించడం మూలంగా దాని ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడుతోంది. మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఫలితంగా మ్యూచువల్ ఫండ్స్ రాబడులు ప్రభావితం అవుతున్నాయి. అయినప్పటికీ వీటిలో పెట్టుబడి సులభంగా ఉండటం వల్ల ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు.
పెట్టుబడులకు మంచి అవకాశం
* ఇన్వెస్టర్లు ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితిలోనైనా తమకున్న పెట్టుబడి అవకాశాలను వదులుకోవద్దని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
* వృద్ధి రేటు తక్కువగా ఉన్న సమయంలో అందివచ్చే అవకాశాన్ని వదులుకోకుండా తక్కువ ధరల్లో పెట్టుబడులు పెట్టాలని, కొంత కాలం వేచిచూసి పరిస్థితులు మెరుగు పడగానే వాల్యూయేషన్లు పెరిగితే లాభాలను స్వీకరించాలని చెబుతున్నారు.
* గతంలోనూ వృద్ధి రేటు తగ్గిన సందర్భాలున్నాయని, ఇలాంటి సందర్భంలో పెట్టుబడులు పెట్టి మంచి లాభాలను ఆర్జించిన ఇన్వెస్టర్లు ఉన్నారని మార్కెట్ పండితులు చెబుతున్నారు.