విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భళా... క్యూ1లో 16 బిలియన్ డాలర్ల రాక
భారత్ లో ఆర్థిక మందగమనం తీవ్రతరం అవుతున్న తరుణం లో ప్రభుత్వానికి కొంత ఊరట లభించింది. ఈ ఆర్థిక సంవత్సరం తోలి త్రిమాషికంలో భారత్లోకి వచ్చిన విదేశి ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ఢీఐ) భారీగా పెరిగాయి. ఇవి ఏకంగా 16.3 బిలియన్ డాలర్ల (సుమారు రూ 1,14,100 కోట్లు) కు ఎగబాకాయి. గతేడాది ఇదే సమయంలో ఇండియా లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 12.7 బిలియన్ డాలర్లు (దాదాపు రూ 88,900 కోట్లు ) గా ఉన్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకలో 28% వృద్ధి నమోదు అయింది. ఆటోమొబైల్ సహా దాదాపు అన్ని రంగాలు మందగమనం వైపు వెళుతున్న సమయంలో విదేశి ప్రత్యక్ష పెట్టుబడులు పెరగటం వల్ల మన దేశ విదేశీ మారక నిల్వల పెరుగుదలకు ఉపకరిస్తాయి. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో ఈ విషయాన్నీ వెల్లడించింది. మన దేశం లో భారీగా పెట్టుబడులు పెట్టిన దేశాల్లో సింగపూర్ తోలి స్థానంలో నిలిచింది. ఆ దేశం నుంచి భారత్ లో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 5.3 బిలియన్ డాలర్లు (సుమారు రూ 37,100 కోట్లు) కావడం విశేషం. రెండో స్థానంలో మారిషస్ దేశం నిలిచింది. అక్కడి నుంచి మన దేశ కంపెనీల్లోకి 4.6 బిలియన్ డాలర్ల (32,200 కోట్లు ) పెట్టుబడులు సమకూరాయి.
LICలో పెట్టుబడి నిర్ణయం సరైనదేనా?
టెలి కమ్యూనికేషన్స్ టాప్...
ఇండియా లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో సింహ భాగాన్ని ఆకర్షించిన రంగం ... టెలి కమ్యూనికేషన్స్. ఈ రంగంలోకి ఏకంగా 4.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ 29,400 కోట్లు ) పెట్టుబడులుగా అందాయి. 2.8 బిలియన్ డాలర్ల (దాదాపు రూ 19,600 కోట్లు) పెట్టుబడులతో సేవల రంగం రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వరుసగా.. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, బిజినెస్ అవుట్ సోర్సింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, కొరియర్, టెక్నాలజీ టెస్టింగ్ అండ్ ఎనాలిసిస్ రంగాలు ఉన్నాయి.
సింహ భాగం ఢిల్లీ దే ...
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిండంలో ఢిల్లీ సహా నేషనల్ కాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్ ) ముందు ఉన్నాయి. ఎన్సీఆర్ లో కొంత ఉత్తర ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు భాగంగా ఉంటాయి. ఈ ప్రాంతాల్లోని కంపెనీల్లోకి 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ 35,000 కోట్లు ) పెట్టుబడులు సమకూరాయి. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర, దాద్రా, నాగర్ హవేలీ, థమన్ అండ్ డియూ ప్రాంతాలు నిలిచాయి.
3
ఇకపై సింగపూరే కింగ్...
గత 20 ఏళ్లుగా భారత్ లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాక లో మారిషస్ దేశం ముందు వరుసలో ఉండేది. పన్నుల స్వర్గధామం కాబట్టి మారిషస్ ఈ విషయంలో ముందు ఉండేది. కానీ ప్రస్తుతం భారత్ - మారిషస్ మధ్య పన్నులకు సంబంధించిన ఒప్పందాల వల్ల ఇక మీదట ఆ దేశం నుంచి ఎక్కువ మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రావని నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపై సింగపూర్ కేంద్రంగానే భారత్ లోకి పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాయని వారు అంచనా వేస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి 2019 వరకు మారిషస్ నుంచి ఇండియా కు 139 బిలియన్ డాలర్ల (సుమారు రూ 9,73,000 కోట్లు ) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సమకూరాయి. ఇదే సమయానికి సింగపూర్ నుంచి 88.3 బిలియన్ డాలర్ల (దాదాపు రూ 6,18,100 కోట్లు ) పెట్టుబడులు వచ్చాయి.
మరింత పెరిగే అవకాశం...
భారత ప్రభుత్వం ఇటీవల తీసుకొన్న నిర్ణయాలతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సింగల్ బ్రాండ్ రిటైల్ నిబంధనలు సడలించడం, ఫిసికల్ స్టోర్ లేకుండా నేరుగా ఆన్లైన్ లో విక్రయాలు చేసుకొనే అవకాశం, వాణిజ్య బొగ్గు మైనింగ్ లో 100% ఎఫ్ఢీఐ అనుమతి, ఇన్సూరెన్స్ ఇంటర్మీడియరీ లోకి 100% పెట్టుబడుల అనుమతి, డిజిటల్ న్యూస్ అండ్ కంటెంట్ లోకి 26% ఎఫ్ఢీఐ అనుమతి వంటి ప్రభుత్వ విధానాలు దేశం లోకి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించగలవని భావిస్తున్నారు. అదే జరిగితే, దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమన ప్రభావం తగ్గటంతో పాటు, యువత కు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.