అలర్ట్: ATM కొత్త రూల్స్, మనీ విత్ డ్రా రోజుకు ఒక్కసారే!!
న్యూఢిల్లీ: ఇటీవల డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. ఏటీఎంలపై ఆధారపడటం గతంలో కంటే తగ్గింది. అయినప్పటికీ డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎంకు వెళ్లనిదే గడవదు. ఏటీఎం కార్డు జేబులో ఉంటే చాలు.. ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే, ఇక నుంచి నిత్యం ఎప్పుడు పడితే అప్పుడు, ఎన్నిసార్లైనా డ్రా చేసుకునే వెసులుబాటు లభించకపోవచ్చు. 12 గంటల వ్యవధిలో ఒకేసారి విత్ డ్రా చేసుకునే కొత్త నిబంధన అమలులోకి రావొచ్చు.
ఒక్కరోజులో 2.41 లక్షల కోట్లు పెరిగిన సంపద, కారణాలివే...
ఓసారి డబ్బు తీస్తే 12 గంటల దాకా కుదరదు...
ఏటీఎం నుంచి ఒక్కోసారి మనకు కావాల్సిన మొత్తం తీసుకోవడానికి వీలుపడదు. అలాంటి పరిస్థితుల్లో రెండుసార్లు డ్రా చేస్తుంటాం. కానీ త్వరలో అలాంటి అవకాశం ఉండకపోవచ్చు. ఓసారి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేశారంటే ఆ తర్వాత 6 లేదా 12 గంటల వరకు మళ్లీ డ్రా చేసుకునేందుకు సాధ్యం కాకపోవచ్చు. ప్రతి రెండు లావాదేవీలకు 6 గంటల నుంచి 12 గంటల మధ్య సమయం ఉండేలా నిబంధన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఎందుకిలా...?
ఏటీఎం విత్ డ్రాలలో మోసాలు బాగా పెరిగాయి. ఈ మోసాలను నియంత్రించేందుకు కొత్త ప్రతిపాదనలు తీసుకు వస్తున్నారు. ఇటీవల 18 బ్యాంకుల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాల పరిష్కారానికి ప్రతిపాదనలు వచ్చాయి. ఏటీఎంలలో ఒక కార్డ్ నుంచి ఒకసారి నగదును తీసుకున్న తర్వాత ఆ కార్డ్ నుంచి 6 గం. నుంచి 12 గం. వరకు మరో ట్రాన్సాక్షన్ లేకుండా పరిమితి విధించాలని ఢిల్లీ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) ప్రతిపాదించింది.
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు...
బ్యాంకు మోసాలు చాలా వరకు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున జరుగుతుంటాయని OBC ఎండీ, సీఈవో ముఖేష్ కుమార్ చెప్పారు. ఏటీఎం మోసాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశంలో 980 ఏటీఎం ఫ్రాడ్స్ జరిగాయి. ఇందులో మహారాష్ట్రలో 233, ఢిల్లీలో 179 ఉన్నాయి.
అలా డబ్బులు కాజేస్తున్నారు....
ఏటీఎం సెంటర్లలో డబ్బులు విత్ డ్రా చేసే వ్యక్తులను మాటల్లో పెట్టి ఏటీఎం కార్డ్స్ను క్లోనింగ్ చేస్తున్నారు. అలా డబ్బులు కాజేస్తున్నారు. ఏటీఎం మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ కొత్త ప్రతిపాదనలు తెరపైకి తెచ్చారు. బ్యాంకర్ల సమావేశంలో ఏటీఎంలో మనీ విత్ డ్రా ట్రాన్సాక్షన్స్ మధ్య సమయం ఎలా ఉండాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. రెండు ట్రాన్సాక్షన్స్ మధ్య 6 గంటల నుంచి 12 గంటల మధ్య పరిమితి ఉండాలనేప్రతిపాదనకు ఒకే చెబితే విత్ డ్రా విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఏటీఎం నుంచి రోజుకు ఎంత అమౌంట్ తీసుకోవాలనే లిమిట్ ఉంది. దానిని ఒకేసారి తీసుకునే వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉండవచ్చు.
హెల్మెట్ లేకుండా ఏటీఎంలోకి....
ఏటీఎం సెంటర్లో కమ్యూనికేషన్ ఫీచర్స్తో ఏటీఎంలకు సెంట్రలైజ్డ్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు. ఇలా చేయడం వల్ల ఎవరైనా హెల్మెట్ పెట్టుకొని ఏటీఎం సెంటర్లోకి వెళ్తే హెల్మెట్ తొలగించండి అనే వాయిస్ వస్తుంది. ఈ విధానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. 300 OBC ఏటీఎం సెంటర్లలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
మరికొన్ని...
ఎస్బీఐ తన కస్టమర్ల విత్ డ్రా లిమిట్ను రూ.20వేలకు తగ్గించింది. డెబిట్ కార్డు మోసాల నుంచి బయటపడేందుకు యోనో యాప్ తీసుకు వచ్చింది. రూ.10వేలకు మించి విత్ డ్రా చేసేవారికి OTP కచ్చితం ఎంటర్ చేయాలనే నిబంధనను కెనరా బ్యాంకు తీసుకు వచ్చింది.