గోల్డ్ ఈటీఎఫ్లకు భలే గిరాకీ.. జోరుగా పెరుగుతున్న పెట్టుబడులు
బంగారం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్ )కు గిరాకీ జోరుగా పెరుగుతోంది. స్టాక్ మార్కెట్లలో ఆనిచ్చిత పరిస్థితులు నెలకొనడం ఇందుకు దారితీస్తోంది. దీంతో గోల్డ్ ఈటీఎఫ్ ల నిర్వహణ లోని ఆస్తులు (ఏయూఎం) భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలం (ఏప్రిల్-జులై)లో గోల్డ్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు రూ . 5,079.22 కోట్లకు చేరుకున్నాయి. ఇదేకాలంలో దేశీయ స్టాక్ మార్కెట్ 3 శాతం మేర పడిపోయింది. మార్కెట్ల పతన భయాలతోనే ఇన్వెస్టర్లు పచ్చలోహంలో పెట్టుబడులు పెంచుకుంటున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది.
స్మార్ట్ టీవీల మార్కెట్లో మొబైల్ ఫోన్ కంపెనీల హవా...
ఏప్రిల్ నుంచి పెరుగుదల
* మార్న్ఇంగ్ స్టార్ గణాంకాల ప్రకారం గోల్డ్ ఈటీఎఫ్స్ నిర్వహణలో ఆస్తులు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పెరుగుతున్నాయి. ఇదే కాలంలో (ఏప్రిల్-జులై) బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచి సెన్సెక్స్ 1,191.79 పాయింట్లు తగ్గింది. జులై లో బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్ సెన్సెక్స్ మే నెలతో పోల్చితే దాదాపు 5 శాతం తగ్గింది.
* ఇంతకు ముందు బంగారం ధరలు తక్కువ స్థాయిలో ఉండటం వల్ల చాలా వరకు ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ లకు దూరంగా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ధరలు పెరుగుతున్న కారణంగా మళ్ళి వీటిపై వారి దృష్టిపడింది. అందుకే వీటిలో పెట్టుబడులు పెరుగుతున్నాయి.
* బంగారం అనేది ద్రవ్యోల్భణం పెరుగుదల ఉన్న సందర్భంలో హెడ్జింగ్ కు పనికి వస్తుంది. అంతే కాకుండా ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ఆదుకుంటుంది.
వాణిజ్య యుద్ధం ఎఫెక్ట్
* అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో బాండ్ రాబడులు తగ్గిపోయాయి. ఆర్థిక మాంద్యం భయాలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫిజికల్ బంగారానికి బదులుగా ఇప్పుడు చాలా మంది గోల్డ్ ఈటీఎఫ్ లను కొనుగోలు చేస్తుంటారు.
గోల్డ్ ఈటీఎఫ్స్ నిర్వహణలోని ఆస్తులు ఇలా ఉన్నాయి..
ఏప్రిల్ : రూ. 4,594.06 కోట్లు
మే : రూ. 4,606.69 కోట్లు
జూన్ : రూ. 4,931.16 కోట్లు
జులై : రూ. 5,079.22 కోట్లు
ఆర్ధిక ఆనిచ్చిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రానున్న కాలంలో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఫలితంగా గోల్డ్ ఏటీఎఫ్ లకు డిమాండ్ ఇంకా వృద్ధి చెందవచ్చని చెబుతున్నారు.