FPI ఎఫెక్ట్, రూపాయికి బలం: రేపటి నుండి మార్కెట్ల దూకుడు, కానీ...
ఫారన్ పోర్ట్పోలియో ఇన్వెస్టుమెంట్స్ (FPI)లపై కేంద్ర ప్రభుత్వం సర్ఛార్జ్ తొలగించడం మార్కెట్లకు కొత్త ఉత్సాహం ఇస్తుందని, వృద్ధి ఉరకలెత్తుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. FPIలపై సర్ఛార్జ్ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. దీనిని అందరూ స్వాగతిస్తున్నారు. జూలై, ఆగస్ట్ నెలల్లో 3.4 బిలియన్ డాలర్ల (రూ.24,500 కోట్లు) FPIలు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు నిర్మల ప్రకటనతో వెనక్కి వచ్చే అవకాశముంది.
మాంద్యంలేదు, ఆటో సేల్స్ తగ్గడానికి ఉబెర్-ఓలా కారణమే!?
రూపాయి బలపడేందుకు దోహదం
FPIలు పెద్ద ఎత్తున వెనక్కి తీసుకోవడంతో ఆ ప్రభావం రూపాయి పైన కూడా పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు డాలర్ మారకంతో రూపాయి విలువ రూ.72కు పైగా పడిపోయింది. ఇప్పుడు FPIలపై సర్ ఛార్జీని ఉపయోగించుకోవడంతో భారతీయ మార్కెట్లకు పెద్ద సానుకూలత అని, FPI వెనక్కి తరలి వస్తాయని, అప్పుడు రూపాయి కూడా బలపడుతుందని చెబుతున్నారు.
భారత ఆర్థిక వ్యవస్థకు మంచి సెంటిమెంట్
మొత్తానికి సర్చార్జీని ఉపసంహరించుకోవడం భారత మార్కెట్లకు, భారత ఆర్థిక వ్యవస్థకు మంచి సెంటిమెంట్ అని కొటక్ సెక్యూరిటీస్ ఫండమెండల్ రీసెర్చ్ హెడ్ రష్మిక్ ఓజా అన్నారు. స్టార్టప్స్ను ఏంజిల్ ట్యాక్స్ నుంచి మినహాయించడం, ఆటో రంగానికి ఊతమివ్వడం, బ్యాంకులకు రూ.70,000 కోట్ల ఫండ్స్.. వంటివి వృద్ధి వేగాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయని అంటున్నారు.
వరుస ర్యాలీ జరగాలంటే... ఇది కావాలి.
కుంగిపోతున్న మార్కెట్లకు FPI సర్ ఛార్జ్ మినహాయింపు ఓ గొప్ప ఊరట అని, ఇప్పటి వరకు ఉపసంహరించుకున్న FPIలు రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఇక మార్కెట్లు కొత్త ఉత్సాహంతో దూసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీప్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటెజిస్ట్ వీకే విజయ్ కుమార్ అన్నారు. అయితే మంచి వృద్ధి, మందగమనాన్ని తిప్పికొట్టగలమనే విశ్వాసం ఉంటేనే నిరంతర ర్యాలీ ఉంటుందన్నారు. ఇందుకు మరిన్ని సంస్కరణలు అవసరమని చెప్పారు. ఆటో రంగంలోని సంక్షోభానికి ఫుల్ స్టాప్ చెప్పే ఉద్దేశ్యంలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలు వాహనాలు కొనుగోలు చేయవద్దనే నిబంధనను ఎత్తివేసింది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజును వాయిదా వేశారు.
సోమవారం భారీ ర్యాలీ...
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆటోమొబైల్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగపడతాయని ఎల్కేపీ సెక్యూరిటీస్ (ఆటో సెక్టార్) సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ అశ్విన్ పాటిల్ అన్నారు.ఇవి (ప్రభుత్వం ఉపశమనం) ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చేవని, కేంద్రం నిర్ణయం నేపథ్యంలో సోమవారం మార్కెట్లు భారీ ర్యాలీని కనబరుస్తాయని ఆశిస్తున్నామని ట్రేడింగ్ బెల్స్ సీఈవో అండ్ కోఫౌండర్ అమిత్ గుప్తా చెప్పారు. మరిన్ని సెషన్లలోను ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. గత వారం సెన్సెక్స్ 649.17 పాయింట్లు (1.74 శాతం) నష్టపోయింది. నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ ఉంటుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో చివరి గంటలో 228 పాయింట్లు ఎగబాకింది.
సర్ఛార్జ్ ఉండదు..
కాగా, FPI అటు ఈక్విటీ, ఇటు డెరివేటివ్స్ కేటగిరీలపై పొందే మూలధన లాభాలపై విధించిన సర్ఛార్జీని తొలగిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేయడం కోసం శుక్రవారం కేంద్ర ప్రభుత్వం పలు ప్రకటనలు చేసింది. అందులో భాగంగా బడ్జెట్లో విదేశీ, దేశీయ ఈక్విటీ మదుపర్లపై విధించిన సూపర్ రిచ్ పన్నును ఉపసంహరించుకుంటున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. శనివారం దీనిపై ఒక అధికారిక ప్రకటనలో స్పష్టతనిచ్చారు.
- డెరివేటివ్స్ (ఫ్యూచర్లు, ఆప్షన్లు)ను మూలధన ఆస్తిగా పరిగణించమని, డెరివేటివ్ బదిలీ ద్వారా వచ్చే ఆదాయాన్ని వ్యాపార ఆదాయంగా లెక్కిస్తామని కాబట్టి దానిపై దేశీయ మదుపర్లకు సాధారణ పన్ను రేటు వర్తిస్తుందని ప్రకటనలో తెలిపింది.
- FPIల విషయంలో మాత్రం డెరివేటివ్స్ను మూలధన ఆస్తిగా పరిగణించి వాటి బదిలీపై వచ్చే లాభాల్ని మూలధన లాభాలుగా పరిగణిస్తారని, కాబట్టి ఐటీ చట్ట నిబంధనల కింద స్పెషల్ ట్యాక్స్ రేట్ వర్తిస్తుందని తెలిపింది.
- మొత్తం మీద FPIలు చేసే డెరివేటివ్స్ బదిలీ ద్వారా వచ్చే లాభాలపై ప్రత్యేక పన్ను రేటు వర్తిస్తుంది. సర్ఛార్జీ వాటిపై వర్తించదని తెలిపింది. కానీ FPIలు కాకుండా ఇతరులకు అయితే డెరివేటివ్స్ బదిలీ ద్వారా వచ్చే వ్యాపార ఆదాయంపై సాధారణ పన్నుపై అదనపు సర్ఛార్జీని కట్టవలసి ఉంటుందని తెలిపింది.