దిగ్గజ కంపెనీల ఆస్తుల కంటే అప్పులెక్కువ, రూ.13 లక్షల కోట్ల రుణాలపై ఆందోళన
విజయ్ మాల్యా, నీరవ్ మోడీ వంటి వారు ఇక్కడి బ్యాంకుల వద్ద వేలాది కోట్లు అప్పులు చేసి బ్రిటన్లో తలదాచుకుంటున్నారు. వారి నుంచి మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం మోడీ ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేస్తోంది. ఈ విషయాన్ని పక్కన పెడితే, ఇటీవల స్టాక్ మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు వివిధ పెద్ద కంపెనీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. దీంతో మరో పెద్ద ప్రమాదం పొంచి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం, ఆటో సేల్స్ తగ్గడం , రూపాయి బలహీనపడటం, బంగారం ధర పెరుగుతుండటం వంటి వివిధ కారణాల వల్లమార్కెట్లో ప్రతికూలతలు చోటు చేసుకుంటున్నాయి. కార్పోరేట్ సంస్థలు నష్టాలను మూటగట్టుకుంటున్నాయి.
ఈ ట్యాక్స్ అదనం: జియో గిగాఫైబర్ గురించి పూర్తిగా తెలుసుకోండి
195 కంపెనీల ఎం-క్యాప్ కంటే రుణాలు ఎక్కువ
ప్రస్తుత మార్కెట్ పరిణామాల నేపథ్యంలో 195 నాన్-ఫైనాన్షియల్, నాన్ గవర్నమెంట్ సంస్థల రుణాలు.. మార్కెట్ క్యాపిటలైజేషన్ (M-cap)ను మించిపోయాయి. గడిచిన అయిదేళ్లలో ఈ పరిస్థితి ఇదే మొదటిసారి. 2018 చివరి నాటికి ఇలాంటి సంస్థలు 99గా ఉండగా, 2019 మార్చి నాటికి 147కు చేరుకున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సంఖ్య ఇప్పుడు 195కు చేరుకుందట. వివిధ బ్యాంకులు తమ రుణాల్లో ఎక్కువగా ఈ సంస్థలకే ఇచ్చాయి.
రూ.13 లక్షల కోట్లు.. బ్యాంకులకు ఆందోళన..
ఇప్పుడు ఎం-క్యాప్ కంటే రుణాలు ఎక్కువగా ఉన్న సంస్థలకు బ్యాంకులు ఇచ్చిన అప్పులు రూ.13 లక్షల కోట్ల వరకు ఉంటుందట. ప్రస్తుతం ఒత్తిడిలో ఉన్న కంపెనీలకే ఎక్కువగా రుణాలు ఇవ్వడం బ్యాంకులకు ఆందోళన కలిగించే అంశమే. 2018 మార్చి నాటికి అయిదేళ్లలో ఈ సంస్థలకు ఇచ్చిన రుణాలు రూ.8.8 ట్రిలియన్ల ఉండగా, 47.5 శాతం పెరిగి 11 ట్రిలియన్లకు చేరుకున్నాయి.
అన్నీ పెద్ద కంపెనీలే...
ఇందులో వివిధ రంగాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. వొడాఫోన్ ఐడియా (15.1%), టాటా మోటార్స్ (32.7%), టాటా పవర్స్ (30.4%), టాటా స్టీల్ (38.5%), GMR ఇన్ఫ్రాస్ట్రక్చర్ (37.7%), IRB ఇన్ప్రాస్ట్రక్చర్ (17.5%), సద్భావ్ ఇంజినీరింగ్ (18.1%) అదానీ పవర్ (48.1%), జిందాల్ స్టీల్ (30%), రట్టన్ ఇండియా పవర్ (2.7%) తదితర సంస్థలు ఉన్నాయి. ఇవి ఆగస్ట్ 23, 2019న ముగిసిన ఎం-క్యాప్, FY19 రుణాల లెక్కలు.
రుణ మార్గాలు క్లోజ్...
రుణాలకు ఎం-క్యాప్కు మధ్య ఉన్న ఈ అంతరం సంస్థల్ని ఆర్థిక కష్టాల్లో పడేస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. సరికొత్తగా మార్కెట్ క్యాపిటల్ను సమీకరించడం కూడా కష్టమవుతోందట. వీటి ప్రస్తుత క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగానే మళ్లీ నిధుల్ని సమకూర్చుకొనే శక్తి ఉంటుంది. ఆర్థిక సామర్థ్యాలు దెబ్బతినడంతో వీటికి నగదు అవసరాలు పెరిగిపోతాయి. మార్కెట్ వ్యాల్యూ తగ్గిపోవడంతో ఆర్థిక అవసరాల్ని తీర్చే మార్గాలు కూడా మూసుకుపోతాయి.
వివిధ రంగాల కంపెనీలు...
బీఎస్ఈలో లిస్టైన కంపెనీల్లోని 742 సంస్థల శాంపిల్స్ను తీసుకున్నారు. ప్రభుత్వరంగ, రుణరహిత సంస్థలను పక్కన పెట్టారు. FMCG, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీలను (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో వంటి టెక్ సంస్థలు) పరిగణలోకి తీసుకున్నారు.
2014 నుంచి ఎలా ఉందంటే...
2014-15 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ కంటే అప్పులు ఎక్కువగా ఉన్న కంపెనీలు 175 వరకు ఉన్నాయి. ఆ తర్వాత వీటి సంఖ్య క్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. 2016లో 160, 2017లో 110, 2018లో 99, 2019 మార్చి నాటికి 147 ఉండగా, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇప్పుడు 195కు చేరుకున్నాయి.