క్రానికల్పై దాడుల్లో కట్టలే కట్టలు..! బయట పడ్డ 5,000 కోట్ల డీమానిటైజ్డ్ కరెన్సీ..!!
న్యూఢిల్లీ/హైదరాబాద్ : దక్కన్ క్రానికల్ గ్రూప్ చైర్మన్ టీ వెంకట్రామ్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. కాలం చెల్లిన నోట్ల కట్టలతో ఆయన కార్యాలయాలు కళకళలాడుతున్న అంశాన్ని అదికారులు పసిగట్టారు. దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నివాసాలపై నిర్వహించిన దాడు ల్లో 5 లక్షల కోట్ల రూపాయల విలువ గల డీమానిటైజేషన్కు ముందు నాటి కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది.
కోట్లాది రూపాయల రుణాల ఎగవేత, దానితో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో దక్కన్ క్రానికల్ కార్యాలయాలు, అధినేత నివాసాలపై ఈడీ భారీ ఎత్తున దాడులు నిర్వహిస్తోంది. సికింద్రాబాద్లోని సంస్థ ప్రధాన కార్యాలయ భవనం, హైదరాబాద్ బంజారాహిల్స్లోని గ్రూప్ చైర్మన్ టీ వెంకట్రామ్ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ టీ వినాయక్ రెడ్డి నివాసాలపై దాడులు నిర్వహించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో మనీలాండరింగ్కు సంబంధించిన కొన్ని ఆధారాలు, రెండు లగ్జరీ కార్లు, 5 లక్షల రూపాయల విలువైన డీమానిటైజేషన్ ముందు కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అయితే నిధులు దారి మళ్లించారని ధ్రువీకరించుకునేందుకు డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నట్టు తెలిపారు.
బ్యాంకు రుణాల ఎగవేత కేసులో 2015-16లో సీబీఐ చార్జిషీటు ఆధారంగా ఈడీ దక్కన్ క్రానికల్ గ్రూప్ పైన, దాని ఎగ్జిక్యూటివ్ల పైన పీఎంఎల్ఏ కేసు దాఖలు చేసింది. ఆ సంస్థ కెనరా బ్యాంకు, ఆంధ్రా బ్యాంకు సహా పలు బ్యాంకులను మోసం చేసిన మొత్తం 2323 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. బ్యాంకు రుణాల ఎగవేతలో మోసపూరిత కుట్రలకు పాల్పడ్డారంటూ 2013లోనే సీబీఐ ఒక క్రిమినల్ కేసు దాఖలు చేసింది.
ఆ తర్వాత 2017లో ఈడీ రూ.263 కోట్ల విలువ గల ఆస్తులు స్వాధీనం చేసుకుంది. సంస్థ స్థితిగతులు ఎంతో బాగున్నాయంటూ నకిలీ ఆధారాలు చూపించి బ్యాంకులన్నింటి నుంచి తీసుకున్న రుణాల్లో మొత్తం 8000 కోట్ల రూపాయలు బకాయి పడిందని అంచనా. బ్యాంకుల కన్ను గప్పి ఆ నిధులను గ్రూప్లోని ఇతర కంపెనీలు ఒడిస్సీ ఇండియా లిమిటెడ్, దక్కన్ చార్జర్స్ స్పోర్టింగ్ వెంచర్స్ లిమిటెడ్, ఫ్లయింగ్టన్ ఫ్రైటర్స్ లిమిటెడ్, సీగర్ సొల్యూషన్స్ లిమిటెడ్ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారని, ఫలితంగా బ్యాంకులకు భారీ నష్టం వాటిల్లేందుకు, మొండి బకాయిలు పెరిగేందుకు దోహదపడిందని ఆరోపణలున్నాయి. ఈ కేసులో మరింత దర్యాప్తు జరుగుతున్నట్టు ఈడీ తెలిపింది.