గుడ్న్యూస్: కార్డ్స్పై ఈ-మాండేట్కు అనుమతి, కానీ రూ.2000 మాత్రమే
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బుధవారం నాడు గుడ్ న్యూస్ చెప్పింది. క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ ద్వారా తరుచూ చేసే రికరింగ్ ట్రాన్సాక్షన్స్ (మర్చంట్ పేమెంట్స్) పైన ఈ-మాండేట్ ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ ట్రాన్సాక్షన్ గరిష్ట పరిమితిని రూ.2,000కు పరిమితం చేసింది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై ఈ-మాండేట్ ఉపయోగించడం కోసం ఇండస్ట్రీ నుంచి ఆర్బీఐకి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దీంతో వర్తకులు, వ్యాపార సంస్థలు క్రెడిట్,డెబిట్ కార్డులు, వాలెట్స్ వంటి వాటి ద్వారా తరుచూ చేసే చెల్లింపులు ఈ-మాండేట్ విధానానికి అనుమతివ్వడం వారికి ప్రయోజనకరం.
అకౌంట్లోకి డబ్బు ట్రాన్సుఫర్కు మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందే!
ఈ-మాండేట్కు అనుమతి
రికరింగ్ ట్రాన్సాక్షన్స్ కోసం (మర్చంట్ పేమెంట్స్) ఈ-మాండేట్కు అనుమతించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ తన సర్క్యులర్లో తెలిపింది. మారుతున్న చెల్లింపుల అవసరాలు, కార్డు ట్రాన్సాక్షన్ సెఫ్టీ అండ్ సెక్యూరిటీని సమతుల్యం చేసుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అనుమతులు ఇచ్చినట్లు తెలిపింది.
ఇదీ ఈ-మాండేట్
సాధారణంగా తరుచూ చేసే ట్రాన్సాక్షన్స్కు ఈ-మాండేట్ సులువైన చెల్లింపు ప్రక్రియ. ఎల్ఐసీ లేదా ఇతర బిల్లులు తొలిసారి ఆన్లైన్లో చెల్లించే సమయంలో ఈ-మాండేట్ను సెలక్ట్చేసుకుంటే ప్రతిసారి బిల్లు ఎప్పుడు కట్టాలనేది చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మర్చంట్లకు, వినియోగదారులకు లాభదాయకం.
ఛార్జీల్లేవు...
ఈ-మాండేట్ లిమిట్ను ఒక్కో ట్రాన్సాక్షన్కు గరిష్టంగా రూ.2000 అనుమతి ఇచ్చింది. ఇలాంటి ట్రాన్సాక్షన్స్కు కార్డ్ హోల్డర్ నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. అన్ని రకాల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ (PPIs)లకు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయి.
ప్రస్తుత విధానం ప్రకారం కార్డుల ద్వారా చిన్న మొత్తాలు చెల్లించినా కూడా ప్రత్యేకంగా వన్ టైమ్ పాస్ వర్డ్ వంటివి ఉపయోగించవలసి వస్తోంది. దీంతో ట్రాన్సాక్షన్స్కు ఎక్కువ సమయం తీసుకుంటోంది. తాజా వెసులుబాటుతో తరుచూ చెల్లించే చిన్నమొత్తాల చెల్లింపు సులభం అవుతుంది.
రికరింగ్ పేమెంట్స్కు మాత్రమే...
ఇది కేవలం రికరింగ్ పేమెంట్స్ అంటే పునరావృతం అయ్యే చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది. ఒక్కసారి చేసే చెల్లింపులకు వర్తించదు. ఈ-మాండేట్ను కార్డు వినియోగదారుడు ఏ సమయంలో అయినా ఉపసంహరించుకోవచ్చునని ఆర్బీఐ తెలిపింది. ఈ సదుపాయాన్ని సమీక్షించిన అనంతరం ఇతర డిజిటల్ మోడ్లకు కూడా విస్తరింపచేసే ఆలోచన ఉన్నట్లు తెలిపింది.