అమరావతి కలకలం: జగన్ రాజధానిని మార్చే సాహసం ఎందుకు చేయరు?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అమరావతి నిర్మాణం భారమని, సాధారణ ప్రాంతాల్లో నిర్మాణాలకు రూ.లక్ష ఖర్చు చేస్తే, అమరావతిలో రూ.2 లక్షలు అవుతోందని, పైగా, ఇక్కడి కట్టడాలు సురక్షితం కాదని కమిటీలు చెబుతున్నాయని, వరద వస్తే ముంపు ముప్పు పొంచి ఉందని, వరద నుంచి కాపాడేందుకు పంపింగ్తో మళ్లింపు చేపట్టాలని, అందుకు మరింత ఖర్చు అవుతుందని, ఈ నేపథ్యంలో అన్నీ ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజల వినతులు, ప్రజాప్రతినిధుల ఆలోచనలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని కీలక ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
చైనాలో 20లక్షల ఉద్యోగాలు పోతాయ్, నేనే కారణం!: ట్రంప్ ప్రకటన
పల్లపు ప్రాంతంలో రాజధాని ఎందుకు?
ఏపీ రాజధాని అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు ప్రవేశించిందని, అంతగా సురక్షితం కాని పల్లపు ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేయడం ఎందుకో కేంద్రం కూపీ లాగుతోందని, ప్రజలు నిలదీస్తున్నారని, వీటికి సమాధానం చెప్పలేక చంద్రబాబు ఇంటిని వరద నీటిలో ముంచారనే దుష్పర్చారం మొదలు పెట్టారని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు.
అందుకే అమరావతిని ఎంచుకున్నాం
రాజధాని అమరావతిని మార్చే కుట్రలో భాగంగా ప్రజలను వరద నీటిలో ముంచారని, నీరు ఉన్నచోట నాగరికత అభివృద్ధి చెందుతుందని, అందుకే కృష్ణానది ఒడ్డున అమరావతిని నిర్మించాలని తలపెట్టామని, పెద్ద నగరాలు నదుల పక్కనే ఉండటం వల్ల అభివృద్ధి చెందాయని చంద్రబాబు అన్నారు. ప్రస్తుత వరదలు సహజంగా వచ్చినవి కావని, ఎగువ రాష్ట్రాలలో వర్షాలు కురిశాయని, అప్పుడు ప్రాజెక్టుల్లోని కొంత నీటిని ముందే విడుదల చేసి ఉంటే వరద నీరు వచ్చేది కాదని, తాను ఉంటున్న ఇంటిని ముంచేందుకు నీళ్లను ఆపివేసి ఒకేసారి వదిలారని, ఇది కృత్రిమ వరద సృష్టి అని ఆరోపించారు. తన ఇంటిని ముంచాలని వైసీపీ లక్ష్యంగా చేసుకుంటే, రైతులు మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది?
కృష్ణా నదికి వరదలు వచ్చాయి. దీంతో అమరావతి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ప్రవేశించింది. ఆ తర్వాత బొత్స రాజధానిపై వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజధానిని దొనకొండకు మారుస్తారనే ప్రచారం సాగింది. అమరావతిపై అనుమానాలు కమ్ముకున్నాయి. అమరావతిలో అక్రమాలు జరిగాయని, అలాగే లోతట్టు ప్రాంతం కాబట్టి రాజధానికి అనుకూలం కాదని వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే రాజధాని వ్యవహారాలపై సమగ్ర విచారణ చేయిస్తామని జగన్ ప్రకటించారు.
చకచకా పరిణామాలు...
ఏప్రిల్ 1వ తేదీ నాటికి ప్రారంభం కాని పనులు, 25 శాతం కంటే తక్కువ మాత్రమే జరిగిన పనులను నిలిపేశారు. పైగా రాజధానికి కేంద్రం నుంచి రూ.1000 కోట్లు అవసరం లేదాని, విచారణ పూర్తయ్యాక శాస్త్రీయంగా ఎంత అడగాలో అంత అడుగుతామని ప్రధానికి జగన్ వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత అమరావతి రుణం నుంచి ప్రపంచ బ్యాంకు తప్పుకుంది. ఇతర ఏపీ అభివృద్ధి పనులకు మాత్రం సహకరిస్తామని తెలిపింది. ఏఐబీబీ కూడా రుణ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. రాజధానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు కూడా చెల్లించలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిపై ప్రభుత్వ వైఖరి భిన్నంగా కనిపిస్తోందని అంటున్నారు. అమరావతిలో భూముల ధరలు కూడా పడిపోయాయి. అమరావతిలో పలు పనులు ఆగిపోయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
రాజధాని మార్చాలనే ముంపు ప్రాంతమంటూ కుట్రలా?
అమరావతి లోతట్టు, ముంపు ప్రాంతమని వైసీపీ నేతలు చేస్తున్న వాదనపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసా ఖర్చు లేకుండా రాజధాని నిర్మాణానికి రైతులు తమంతట తామే ముందుకు వచ్చి 33 వేల ఎకరాల భూమి ఇచ్చారని, రాజధాని నిర్మాణంలో అన్ని మౌలిక సదుపాయాలుపోగా ఎనిమిది వేల ఎకరాలు మిగులుతుందని, వాటిని అమ్ముకున్నా ఖర్చు లేకుండా రాజధానిని పూర్తి చేయొచ్చన్నారు. రాజధానిని మార్చాలనే కుట్రతోనే ఇప్పుడు ముంపు ప్రాంతమని చర్చ లేపుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఖర్చు ఎక్కువంటూ రాజధాని నిర్మాణం నిలిపేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇన్ఫోసిస్కు చెందిన పీఏ పాయ్ జగన్ చర్యలను ప్రభుత్వ ఉగ్రవాదంగా అభివర్ణించారన్నారు. ఇలా వ్యవహరిస్తే పెట్టుబడులు రావని, ఉపాధి అవకాశాలు పెరగవని, అవినీతిపరుడే అవినీతిని నిర్మూలిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
అమరావతి ప్రాధాన్యత కాదా?
ప్రపంచ బ్యాంకు, ఏఐఐబీ రుణం నుంచి తప్పుకోవడానికి గత ప్రభుత్వం కారణమని వైసీపీ ఆరోపిస్తే, వైసీపీ అనాలోచితంగా చేసిన ఆరోపణలు, చేసిన ఫిర్యాదుల ఫలితమని తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించింది. గత రెండు మూడు నెలలుగా తన వివిధ హామీలపై మాట్లాడిన జగన్, అమరావతి పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. 2019-20 బడ్జెట్లో అమరావతికి కేవలం రూ.500 కోట్లు కేటాయించారు. తద్వారా అమరావతి తమకు ప్రాధాన్యత కాదని చెప్పకనే చెప్పారు.
మాట తప్పుతున్నారా... రాజధానిపై జగన్ ఏం చెప్పారు?
రాజధానిని అమరావతి నుంచి మారుస్తారనే బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి రాకముందే.. అమరావతిలో భారీ కుంభకోణం జరిగిందని జగన్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. అదే సమయంలో రాజధానిని మారుస్తారా అనే చర్చ ఎన్నికలకు ముందే జరిగింది. ఈ అనుమానాలను జగన్ అప్పుడే నివృత్తి చేశారు. అమరావతి నుంచి రాజధానిని మార్చేది లేదని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు బొత్స వ్యాఖ్యలు అనుమానాలకు తావిస్తున్నాయి. వైసీపీ వర్గాలు కూడా రాజధానిని మార్చే ఉద్దేశ్యం జగన్కు లేదని చెప్పాయి. అమరావతి ప్రాంతంలోనే జగన్ తన కొత్త ఇంటిని నిర్మించుకున్నారని గుర్తు చేశారు.
రాజధానిని మార్చకపోవచ్చు...
రాజధానిని మారుస్తారనే ఊహాగానాలు వస్తున్నప్పటికీ.. అలా చేయకపోవచ్చునని నిపుణులు అంటున్నారు. ఇది చంద్రబాబు ఆలోచన కాబట్టి మారుస్తారనే వాదనలు సరికాదని చెబుతున్నారు. అమరావతికి జగన్ అధిక ప్రాధాన్యత ఇవ్వలేకపోవచ్చునని, కానీ మార్చుతారనే ప్రచారం మాత్రం నమ్మశక్యం కానిదని చెబుతున్నారు. పైగా, రైతులు స్వచ్చంధంగా లేదా ప్రభుత్వం ఒత్తిడితో 33వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు. భూములు ఇచ్చినందుకు గాను రైతులు రాబడి ఆశిస్తున్నారు. అలాగే, ఇప్పటికే పలు కంపెనీలు వచ్చాయి.. వస్తున్నాయి.
చంద్రబాబు ఆశలకు భిన్నంగా...
రాజధానికి అవసరమైన బేసిక్ బిల్డింగ్స్, రోడ్లు ఎలాంటి అర్భాటం లేకుండా జగన్ పూర్తి చేస్తారని చెబుతున్నారు. అలాగే, నాలుగేళ్లుగా రాజధానిని అమరావతిగానే చెబుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులకు, అందరికీ అమరావతినే ఏపీ రాజధానిగా తెలిసిపోయిందని, ఈ పరిస్థితుల్లో రాజధానిని మార్చడం కుదరదని అంటున్నారు. అయితే చంద్రబాబు కోరుకున్నట్లుగా ప్రపంచస్థాయి రాజధానిగా మాత్రం చేయకపోవచ్చునని అంటున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణపై దృష్టి సారిస్తారని, తద్వారా బాబు కలలు గన్న అమరావతి ప్రాధాన్యత తగ్గిస్తారని చెబుతున్నారు.
అమరావతి కేంద్రం.. ప్రజల ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్కు అమరావతి కేంద్రంగా ఉందని, కాబట్టి మార్చడం సులభం కాదని చెబుతున్నారు. అలాగే, రాజధాని ప్రాంత జిల్లాల్లో సీట్లు అన్నీ దాదాపు వైసీపీకే వచ్చాయి. ఈ జిల్లాల ప్రజలు కూడా రాజధాని వచ్చిందనే సంతోషంలో ఉన్నారు. ఇప్పుడు మార్చే పరిస్థితి వస్తే తీర ప్రాంత ప్రజల ఆగ్రహం చవిచూడవలసి వస్తుందని చెబుతున్నారు.
జగన్ ప్లాన్ ఇలా...
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను అమరావతి పరిధిలోకి తీసుకు రావడం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరింప చేస్తారని అంటున్నారు. అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగా మాత్రమే జగన్ చూసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు అంచనాల మేరకు ప్రపంచస్థాయి రాజధానికి రూ.1.5 ట్రిలియన్లు అవసరం. కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చింది. జగన్ కూడా చంద్రబాబు ఆశించిన మేర అమరావతికి ఖర్చు చేయకపోవచ్చునని అంటున్నారు.
ఎన్నికలకు ముందు ఈ పనులు...
ఎన్నికలకు ముందు వరకు అమరావతిలో రూ.38,000 కోట్ల విలువైన వర్క్స్ నడుస్తున్నాయి. రూ.12,000 కోట్ల విలువైన పనులు టెండర్, ప్లానింగ్ దశలో ఉన్నాయి. రోడ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఎమ్మెల్యేలకు, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులకు... ఇళ్ల నిర్మాణం, డిపార్టుమెంట్ హెడ్స్కు బిల్డింగ్ నిర్మాణం, శాశ్వత హైకోర్టు వంటి పనులు సాగుతున్నాయి.
వివిధ దేశాల నుంచి పెట్టుబడుల ఆకర్షణ
27 టౌన్ షిప్స్, 9 థీమ్ సిటీలతో అమరావతి నిర్మాణాన్ని 217 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో ప్రపంచస్థాయి రాజధానిగా ప్లాన్ చేశారు. సింగపూర్ ప్రభుత్వం రాజధాని కోసం ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చింది. ఇది కేవలం పరిపాలనా రాజధానిగా మాత్రమే కాకుండా ఆర్థిక, ఉద్యోగ కల్పన, పర్యాటక కేంద్రంగా విరాజిల్లేలా ప్లాన్ చేసింది. అమరావతి ఇప్పటికే ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, సింగపూర్, బ్రిటన్ వంటి దేశాల పెట్టుబడులను ఆకర్షించింది. ఈ నేపథ్యంలో రాజధాని మార్పు అంతా అవాస్తవం కావొచ్చునని అంటున్నారు. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి...