అమ్మకాల ఒత్తిడి, నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలబాట పట్టాయి. నిఫ్టీ రెండు వారాల కనిష్టానికి దిగొచ్చింది. తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న నిఫ్టీ చివరకు 11000 పాయింట్ల సెంటిమెంట్ మార్క్ దిగువన క్లోజైంది. అన్ని రంగాల సూచీలూ నష్టాల్లోనే ముగిశాయి. రియాల్టీ, పీఎస్యూ బ్యాంక్స్, మెటల్ రంగ షేర్లు కుప్పకూలాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపధ్యంలో ఫ్లాట్గా మొదలైన సూచీలు ఆ తర్వాత స్థిరంగా కొనసాగాయి. అయితే మిడ్ సెషన్ తర్వాతి నుంచి అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. ఒక దశలో నిఫ్టీ 10906 పాయింట్ల కనిష్టానికి దిగొచ్చింది. చివరకు 98 పాయింట్ల నష్టంతో 10919 దగ్గర క్లోజైంది. సెన్సెక్స్ 267 పాయింట్లు కోల్పోయి 37060 వద్ద స్థిరపడింది. బ్యాంక్ నిఫ్టీ 264 పాయింట్ల లాస్తో 27719 దగ్గర ముగిసింది.
ఉదయం ఇలా ప్రారంభం...
స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం గం.9.40 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 70 పాయింట్లు నష్టపోయి 37,257 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 28 పాయింట్స్ నష్టపోయి 10,988 వద్ద ట్రేడ్ అయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.54 వద్ద కొనసాగింది. మధ్యాహ్నం గం.12.00 సమయంలో సెన్సెక్స్ 183.23 (0.49%) నష్టపోయినప్పటికీ ఆ తర్వాత అరగంటకు కాస్త కోలుకుంది. గం.12.30 సమయంలో 82.59 (0.22%) నష్టంతో 37,254.88 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 33.45 (0.30%) నష్టంతో 10,982.50 వద్ద ట్రేడ్ అయింది.
ఐచర్ మోటార్స్, హీరో మోటో కార్ప్, ఇన్ఫోసిస్, ఎం అడ్ ఎం, మారుతీ సుజుకీ, టీసీఎస్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. యస్ బ్యాంకు, టాటా మోటార్స్, హిండాల్కో, వేదాంత, బీపీసీఎల్, ఏషియన్ పేయింట్స్, బ్రిటానియా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఐటీ మినహా దాదాపు మిగతా రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.