కార్డ్-లెస్ దిశగా... SBI డెబిట్ కార్డులకు చెల్లుచీటి!
ముంబై: ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) డెబిట్ కార్డులను తొలగించే ఆలోచన చేస్తోంది. డెబిట్, క్రెడిట్ కార్డులను తొలగించి, వాటి స్థానంలో డిజిటల్ చెల్లింపు విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. దేశంలోని ఐదో వంతు జనాభాకు ఎస్బీఐలో అకౌంట్ ఉంది. ఇందులో ఎక్కువమంది డెబిట్ కార్డులపై ఆధారపడుతున్నారు. ప్రజలను డిజిటల్ వైపు మళ్లించాలని చూస్తోంది.
2011 తర్వాత అతిపెద్ద మాంద్యం భయం, బంగారంవైపు పరుగు
ప్లాస్టిక్ కార్డుల తొలగింపు టార్గెట్
బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి ప్లాస్టిక్ కార్డుల్ని తొలగించాలన్నది తమ యోచన అని, ఇది సాధ్యం చేయగలమని భావిస్తున్నామని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్లాస్టిక్ కార్డులను తొలగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో అత్యధిక మందికి బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ఎస్బీఐ డెబిట్ కార్డులు తొలగించాలని ఆలోచించడం గమనార్హం.
93 కోట్ల క్రెడిట్, డెబిట్ కార్డులు
డెబిట్ కార్డులను తొలగించాలనేది తమ లక్ష్యమని, దానిని నెరవేర్చగలమని తాను బలంగా విశ్వసిస్తున్నానని రజనీష్ కుమార్ చెప్పారు. ఆయన సోమవారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో దాదాపు 90 కోట్లకు పైగా డెబిట్, 3 కోట్లకు పైగా క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయని చెప్పారు.
కార్డ్-లెస్ కంట్రీ దిశగా... యోనో యాప్
ఎస్బీఐ యోనో వంటి డిజిటల్ యాప్ను తీసుకు వచ్చిందని, ఇది దేశాన్ని డెబిట్ కార్డ్-లెస్ కంట్రీగా మార్చేందుకు అడుగు అన్నారు. యోనో ద్వారా డెబిట్ కార్డులను తగ్గించగలమని అభిప్రాయపడ్డారు. యోనో యాప్ సాయంతో ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించవచ్చని, కార్డు లేకుండా షాప్లలో చెల్లింపులు చేయవచ్చునన్నారు.
ఏడాదిన్నరలో పది లక్షల యోనో కేంద్రాలు
ప్రస్తుతం 68వేల యోనో కేంద్రాలు ఉన్నాయని, మరో 18 నెలల్లో వాటిని 1 మిలియన్లకు (పది లక్షలు) చేర్చుతామని రజనీష్ కుమార్ చెప్పారు. అప్పుడు కార్డ్-లెస్ ట్రాన్సాక్షన్స్ మరింత వేగంగా పెరుగుతాయని, కార్డు అవసరం కూడా రాకపోవచ్చునని చెప్పారు.
యోనో యాప్ ద్వారా రుణం
యోనో యాప్ ద్వారా కొన్ని ప్రోడక్ట్స్ను కూడా కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. యోనో ద్వారా లోన్ తీసుకొని కొన్ని ఉత్పత్తుల్ని కొనుగోలు చేయవచ్చునని చెప్పారు. కాబట్టి క్రెడిట్ కార్డు అప్పుడు కేవలం ప్రత్యామ్నాయంగానే మిగిలిపోతుందని చెప్పారు. రానున్న అయిదేళ్లలో కార్డ్స్ అవసరం పరిమితం అవుతుందని చెప్పారు. వర్చువల్ కూపన్స్ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. చెల్లింపుల కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న QR కోడ్ విధానం కూడా ఖరీదైనదే అన్నారు.