PPAపై సరికొత్త వాదన, ఏపీలో కరెంట్ ఛార్జీలు పెరుగుతాయా?
అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను (PPA) సమీక్షించాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, జపాన్ హెచ్చరించినా పీపీఏలపై ముందుకు సాగేందుకే ప్రభుత్వం మొగ్గు చూపింది. అదే సమయంలో వరుస షాక్ల నేపథ్యంలో ప్రభుత్వం తీరులో మార్పు వచ్చిందని అంటున్నారు. కేవలం అక్రమాలు జరిగిన ప్రాజెక్టులను మాత్రమే సమీక్షిస్తామని, అన్నింటిని కాదని ఓ అధికారి ప్రముఖ ఇంగ్లీష్ ఛానల్కు వెల్లడించారు. దీని ప్రకారం...
జగన్ దెబ్బ: నెలలో 25% మార్కెట్ వ్యాల్యూ కోల్పోయిన కంపెనీ!!
అన్నీ కాదు.. అవి మాత్రమే
గత ప్రభుత్వం హయాంలో జరిగిన అన్ని పీపీఏలను రద్దు చేయాలనేది ముఖ్యమంత్రి (జగన్) ఉద్దేశ్యం కాదని, కొన్ని విండ్ ప్రాజెక్టుల్లో అక్రమాల పైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, అవి బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా జరగలేదని, కేవలం వాటిని మాత్రమే సమీక్షించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించిందని చెప్పారు.
భూముల ధరలపై అనుమానం
అలాగే, కొన్ని ప్రాజెక్టులకు భూముల కేటాయింపు, ధరల నిర్ణయం కూడా అనుమానాస్పదంగా ఉందని, అవి పారదర్శకంగా కనిపించలేదని సదరు అధికారి వెల్లడించారట. పారదర్శకత లేకుండా కేటాయించిన భూములను కూడా సమీక్షిస్తున్నామని చెప్పారు. పారదర్శకత లేని వాటిని క్యాన్సిల్ చేస్తామని, పారదర్శక విధానంపై పెట్టుబడిదారులకు నమ్మకం కలిగిస్తామని చెప్పారు.
హెచ్చరికలు.. అభ్యర్థన
పీపీఏలను సమీక్షించేందుకు జగన్ ప్రభుత్వం ఓ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. సీఎం జగన్కు కేంద్రమంత్రి ఆర్కే సింగ్ లేఖ కూడా రాశారు. ఇలాంటి పరిణామాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన కలిగిస్తాయని, వీటిని వెనక్కి తీసుకోవాలని సూచించారు. జపాన్ అంబాసిడర్ కూడా కాంట్రాక్ట్స్ పవిత్రతను దెబ్బతీయవద్దని, ఇది వ్యాపార అనుకూల వాతావరణాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు. దీనిపై సదరు అధికారి స్పందిస్తూ... తాము అంబాసిడర్ ఆందోళనలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. మరోవైపు, డెవలపర్స్ ఈ అంశంపై హైకోర్టు గడప తొక్కారు. ఈ ప్రొసీడింగ్స్ పైన ఆగస్ట్ 22వ తేదీ వరకు ఉన్నత న్యాయస్థానం స్టే ఆర్డర్ ఇచ్చి, పీపీఏలకు ఊరటనిచ్చింది.
ఛార్జీలు పెంచుకుంటాం...
ఇదిలా ఉండగా, అప్పులను తగ్గించుకునేందుకు విద్యుత్ ఛార్జీలను పెంచక తప్పదని ఏపీలో డిస్కంలో స్పష్టం చేశాయి. ఇప్పటికే ఉన్న రూ.20వేల కోట్ల అప్పులతో పాటు గత మూడేళ్లలో మరో రూ.7,948 కోట్ల అప్పులు పేరుకుపోయాయని ఈ వ్యత్యాసాన్నితగ్గించుకోవాలంటే అదనంగా ఛార్జీలు వసూలు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ఏపీఈఆర్సీని పంపిణీ సంస్థలు కోరాయి.
టారిఫ్ పెంచి అప్పుల భారం తగ్గాలని...
2020-21లో టారిఫ్ పెంచి అప్పుల భారం తగ్గించాలనేది డిస్కంల డిమాండ్. ఇదివరకు అయిదేళ్ల పాటు ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. పెంచలేదు. ప్రభుత్వం నుంచి వస్తున్న సబ్సిడీ ద్వారా కొంత మొత్తం పోగా, మిగతా మొత్తాన్ని భర్తీ చేసుకునేందుకు ఛార్జీల పెంపుకు అవకాశమివ్వాలని కోరుతున్నాయి. దీనిపై ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఛార్జీల పెంపుకు ప్రభుత్వం అనుమతించాలి. విద్యుత్ ఛార్జీలను ఇంటి వినియోగం, బిజినెస్, ఇండస్ట్రీ, కంపెనీలు, వ్యవసాయం.. ఇలా ఐదు కేటగిరీల్లో వసూలు చేస్తున్నారు.