స్వల్ప లాభాల్లో మార్కెట్లు, జోరుగా ప్రారంభమై చివరి గంటలో..
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో మన మార్కెట్లు కూడా లాభాల బాట పట్టాయి. రిలయన్స్, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్ సహా పలు షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. భారీ లాభాలతో మొదలైన సెన్సెక్స్ ఓ దశలో 300 దాటింది. చివరకు 52.16 (0.14%) లాభంతో 37,402.49 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 6.10 (0.055%) లాభంతో 11,053.90 వద్ద ముగిసింది.
ఉదయం నుంచి జోరుగా కనిపించిన మార్కెట్లు క్లోజింగ్కు ముందు సేల్స్కు మొగ్గు చూపడంతో సూచిలు ఒత్తిడికి లోనయ్యాయి. దీంతో లాభాలు చాలా తగ్గిపోయాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 71.45గా ట్రేడ్ అయింది. సన్ ఫార్మా, టెక్ మహింద్రా, భారతీ ఇన్ఫ్రాటెల్, యాక్సిస్ బ్యాంకు, విప్రో లాభపడగా, యస్ బ్యాంకు, ఇండియా బుల్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గెయిల్ నష్టపోయాయి.
ఉదయం ప్రారంభం ఇలా..
స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమైంది. ఉదయం గం.9.40 నిమిషాలకు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 141 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. నిఫ్టీ 43 పాయింట్లు ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ 71.11 వద్ద ఉంది. ఆ తర్వాత పదిన్నర గంటల సమయంలో సెన్సెక్స్ 314.30 (0.84 శాతం) పెరిగి 37,663.88 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 81.10 (0.76) పాయింట్లు పెరిగి 11,135.25 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
భారతీ ఎయిర్ టెల్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, ఇండియా బుల్స్ హౌసింగ్, టైటాన్, యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్రా, హీరో మోటా కార్ప్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యస్ బ్యాంకు, ఓఎన్జీసీ, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, జీ ఎంటర్టైన్మెంట్, ఏషియన్ పేయింట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.