మోడీ గట్టెక్కించేనా?: ఆటోమొబైల్ డీలర్లకు బ్యాంకుల 'బూస్టింగ్'!
ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ఆటో సేల్స్ 19 ఏళ్ల కనిష్టానికి దిగజారిపోయాయి. గతంలో ఈ రంగంలోని కొన్ని విక్రయాలు తగ్గినా, మరికొన్ని విక్రయాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆటో పరిశ్రమలో అన్నింటి సేల్స్ దారుణంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో అందరిచూపు దృష్టి నరేంద్ర మోడీ ప్రభుత్వం వైపు ఉంది. ఆటో పరిశ్రమను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏం చేస్తుందనే ఆసక్తి నెలకొని ఉంది.
ఈ నేపథ్యంలో ఆటో పరిశ్రమకు దీర్ఘకాలిక పరిష్కారంతో పాటు వెంటనే తాత్కాలిక ఉపశమనం కలిగే చర్యలు చేపట్టవచ్చునని తెలుస్తోంది. ఆటో రంగంలో తిరోగమనాన్ని అరికట్టేందుకు, మోటారు వాహనాల సేల్స్ పెంచేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం.. స్టేట్ ఓన్డ్ బ్యాంకులకు పలు సూచనలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
జమ్ము కాశ్మీర్లో ఆస్తులు కొనాలనుకుంటే ఇది చదవండి?
క్రెడిట్ కండిషన్లను సులభతరం చేయడంతో పాటు ఆటోమొబైల్స్ డీలర్షిప్స్కు రీపేమెంట్ పరిమితులను కూడా సులభతరం చేయాలని బ్యాంకులకు ప్రభుత్వం సూచించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బ్యాంకులు ఆటో పరిశ్రమను ఆదుకుంటాయా చూడాల్సి ఉంది.
ఇదిలా ఉండగా, బైక్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ నాలుగు రోజుల పాటు తన ప్లాంటును మూసివేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్లాంట్ క్లోజ్ చేస్తామని తెలిపింది. మార్కెట్ పరిస్థితులు, వార్షిక సెలవుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పింది. ఇప్పటికే పలు కార్ల సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్న సమయంలో హీరో ప్రకటన వచ్చింది.
ద్విచక్ర వాహన రంగంలో ప్లాంట్ మూసేసిన తొలి కంపెనీ హీరో. ఈ మూసివేత మార్కెట్ పరిస్థితులను అంచనా వేయడానికి, ఉత్పత్తి ప్రణాళికను తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని హీరో మోటో కార్ప్ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా తమ ఉత్పత్తి కేంద్రాలను మూడు రోజులు మూసివేస్తున్నామని, ఆగస్ట్ 15, రక్షాబంధన్, వారంతంతో పాటు మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.