భారీ నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు, 200 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
ముంబై: శుక్రవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి కాస్త కోలుకున్నాయి. స్వల్ప లాభాలతో మార్కెట్లు క్లోజ్ అయ్యాయి.సెన్సెక్స్ 38.80 పాయింట్ల లాభంతో 37,350.33 వద్ద క్లోజైంది. నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 11,047 వద్ద క్లోజ్ అయింది. ప్రభుత్వం ట్యాక్స్ ఉపసంహరణలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో మార్కెట్లు శుక్రవారం మొత్తం ఊగిసలాటలో కనిపించి, చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి.
పవర్ గ్రిడ్, మారుతీ సుజుకీ, యస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. టీసీఎస్, వేదాంత, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాలతో ముగిశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. అపోలో ఆసుపత్రి షేర్లు ఏడు శాతం లాభపడ్డాయి. దీంతో 52 వారాల గరిష్ఠానికి చేరుకొన్నాయి.
ఉదయం మార్కెట్..
మార్కెట్లు శుక్రవారం నాడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 234 పాయింట్లు కోల్పోయి 37,076 వద్ద, నిఫ్టీ 74 పాయింట్ల నష్టంతో 10,955 వద్ద ట్రేడ్ అయింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.71.36గా ఉంది. యస్ బ్యాంక్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, సన్ ఫార్మాలు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. హీరో మోటో కార్ప్, మారుతీ సుజుకీ, వేదాంతా, టాటా స్టీల్, టాటా మోటార్స్ తదితర కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం ఏకంగా 325 పాయింట్లు దిగజారి 36,986 వద్ద కూడా ట్రేడ్ అయింది. ఆ తర్వాత కాస్త కోలుకుంది. ఉదయం పది గంటల సమయంలో 184 పాయింట్లు (0.48 శాతం) నష్టపోయి 37,127 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 59 పాయింట్లు (0.52 శాతం) కోల్పోయి 10,970 వద్ద ట్రేడ్ అయింది.