ఏటీఎం ట్రాన్సాక్షన్స్పై ఆర్బీఐ కీలక ఆదేశాలు
ముంబై: ఏటీఎం లావాదేవీల అంశానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఉచిత ఏటీఎం లావాదేవీలపై ఆర్బీఐ స్పష్టతను ఇచ్చింది. టెక్నికల్ సమస్యల కారణంగా విఫలమైన లావాదేవీలతో పాటు బ్యాలెన్స్ ఎంక్వయిరీ, చెక్ బుక్ విజ్ఞప్తి వంటి నగదుయేతర ట్రాన్సాక్షన్స్ను నెల నెల అందించే ఐదు ఉచిత లావాదేవీల్లో భాగం చేయవద్దని సూచించింది.
ట్యాక్స్ చెల్లింపులు, నిధుల ట్రాన్సాక్షన్స్ను కూడా లెక్కించవద్దని సూచించింది. ఈ మేరకు కస్టమర్ల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆర్బీఐ స్పందించింది. ఏటీఎంల్లో మనీ లేకపోవడం వల్ల లేదా టెక్నికల్ సమస్యల కారణంగా ఇబ్బందులు తలెత్తి ట్రాన్సాక్షన్ రద్దయితే బ్యాంకులు అందించే ఐదు ఉచిత ట్రాన్సాక్షన్లలో లెక్కిస్తున్నాయని ఫిర్యాదులు అందాయి.
అయితే, ఇలాంటి సేవలు పూర్తిగా ఉచితం అని, ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్ కిందకు తీసుకోవద్దని సూచించింది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పట్టణ సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లతో సహా అన్ని బిజినెస్ బ్యాంక్స్కు ఈ ఆదేశాలు చేసింది.