ఏపీకి గుడ్న్యూస్, ప్యామిలీకి హెల్త్ కార్డు: రూ.1000 దాటితే ఫ్రీ వైద్యం!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైసీపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డులు ఇవ్వనుంది. అలాగే ఆరోగ్యశ్రీ స్కీం పరిధిలోకి 2000 సేవలను తీసుకు వస్తోంది. మంగళవారం సీఎం జగన్ వైద్య ఆరోగ్య శాఖపై సమీక్, నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ కార్డులు, కంటివెలుగు, ఆరోగ్యశ్రీ ఎక్స్టెన్షన్ వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని త్వరలో అమలులోకి తీసుకురావాలని భావిస్తున్నారు.
మనీ సేవింగ్: ఈ చెడు అలవాట్లను మార్చుకోండి!
డిసెంబర్ 21వ తేదీన హెల్త్ కార్డులు
రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఆరోగ్య కార్డులు జారీ చేస్తారు. ఈ ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ 21వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. ఎవరికైనా చికిత్సకు సంబంధించి ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలని నిర్ణయించారు. ఈ విధానాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఏడాదిలో మిగిలిన జిల్లాలకు వర్తింపజేస్తారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2000 సేవలను తీసుకు వస్తున్నారు. ప్రస్తుతం 1054 సేవలు ఆరోగ్యశ్రీ కింద ఉన్నాయి.
రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు
వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో దాని కిందకు వచ్చే జబ్బుల జాబితాను కూడా తయారు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. నవంబర్ మొదటి వారం నుంచి రాష్ట్రం వెలుపల హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లోని సుమారు 150 ఆసుపత్రుల్లో ఆరోగ్యం సేవలు అందుబాటులోకి తీసుకు వస్తారు.
ఆసుపత్రులకు గ్రేడింగ్
అనుబంధ ఆసుపత్రులకు సౌకర్యాల ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారు. అలాగే ఇతర రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు పొందే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు. అలాగే, ప్రధాన ఆసుపత్రులలో వైయస్సార్ క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. 108, 104 వెహికిల్స్ ప్రతి ఆరేళ్లకోసారి కొత్తవి కొనుగోలు చేయనున్నారు. కొత్త వాహనాలకు టెండర్లు పిలుస్తారు.
సౌకర్యాల ఆధారంగా ఆసుపత్రులకు కేటగిరీ
నెట్ వర్క్ ఆసుపత్రుల్లో నాణ్యత, ప్రమాణాలు పాటించే, సౌకర్యాలు ఉన్న ఆసుపత్రులకు A ప్లస్, లోపాలున్న ఆసుపత్రులను B కేటగిరీలో చేర్చి కొంతకాలం గడువు ఇస్తారు. మరోసారి తనిఖీ చేసినప్పుడు లోపాలు బయటపడితే వాటిని నెట్ వర్క్ జాబితా నుంచి తొలగిస్తారు. ఇక, ప్రమాణాలు, సౌకర్యాలు లేని ఆసుపత్రులను C కేటగిరీలో చేరుస్తారు. అర్హతలు కలిగిన ఆసుపత్రులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వాసుపత్రులు A ప్లస్ కేటగిరీలో ఉండేలా చేయాలి.