బంగారంలో బుల్ రన్... ఇప్పుడు పెట్టుబడి పెట్టవచ్చా?
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా జోరుగా పెరుగుతున్నాయి. చాలా మంది ఇప్పటికే బంగారం కొని ఉంటే మంచి లాభం వచ్చి ఉండేదని భావిస్తున్నారు. బంగారం కొనుగోలు చేయక పోయినా బంగారం ఈటీఎఫ్ లు కొనుగోలు చేసినా మంచి ధర వచ్చి ఉండేదిగా అని ఆలోచిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేస్తే ఎలా ఉంటుంది, రానున్న కాలంలో ధరలు మరింతగా పెరుగుతాయా లేక తగ్గుతాయా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ నెల ప్రారంభం నుంచి చూస్తేనే బంగారం ధర దాదాపు 8 శాతం వరకు పెరిగిపోయింది. ఇక జనవరి నుంచి చూస్తే ధర ఏకంగా 18 శాతం వరకు వృద్ధి చెందింది. అంటే మాములు విషయం కాదు. ఒకవేళ జనవరిలో బంగారం కొనుగోలు చేసి ఉన్నా ఇప్పటికే మంచి రిటర్న్ వచ్చి ఉండేదన్న మాట.
ప్రపంచ వ్యాప్తంగా కొనేస్తున్నారు..
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం నేపథ్యంలో రానున్న కాలంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో మాంద్యం రావడానికి అవకాశం ఉండవచ్చని ఇన్వెస్టర్లు తెగ భయపడిపోతున్నారు. పలు దేశాల్లో రాజకీయ పరిస్థితులు కూడా ఏమి బాగోలేవు. అమెరికాకు చెందిన కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టి ప్రపంచ మార్కెట్లో ధరలు రివ్వున ఎగురుతున్నాయి. ఇదే స్థాయిలో భారత మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. రానున్న కాలంలో బంగారం ధర మరింతగా పెరగడానికి అవకాశం ఉందని పలు ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి.
కేంద్ర బ్యాంకులు కూడా కొంటున్నాయి...
సాధారణ వినియోగదారులు కాకుండా ఇన్వెస్టర్, పలు దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. అందుకే బంగారం ధరలు మరింతగా పెరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అన్ని రకాల డిమాండ్లు పెరగడం వల్లనే ధరలు మరింత పైకి దూసుకు పోతున్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో కేంద్ర బ్యాంకులు 374 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. అన్ని బ్యాంకుల విదేశీ మారక నిల్వల్లో బంగారం కూడా కీలకంగా ఉంటున్నది.
* జూన్ చివరి నాటికీ భారత రిజర్వ్ బ్యాంకు వద్ద 40,000 కోట్ల డాలర్ల విలువైన బంగారం ఉంది.
* రిటర్న్ విషయానికి వస్తే.. గత 20 ఏళ్ల కాలంలో బంగారం విలువ 6.5 రేట్లు పెరిగింది. ఇదే కాలంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచి సెన్సెక్స్ 10 రెట్లు వృద్ధి చెందింది.
* ఏటా బంగారంలో పెట్టుబడి డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా సగటున 15 శాతం పెరుగుతోంది.
గోల్డ్ ఈటీఎఫ్ ల హవా...
* బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో గోల్డ్ ఎక్సఛాంగీ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) లకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది.
* గత ఏప్రిల్ నుంచి చూస్తే గోల్డ్ ఈటీఎఫ్ ల ధరలు ఎన్ ఎస్ ఈ లో 16-18 శాతం పెరిగాయి.
* గత మూడు నెలల్లో హెచ్ డీ ఎఫ్ సి గోల్డ్ ఈటీఎఫ్ 20.45 శాతం, యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ 20.55 శాతం పెరిగాయి. యాక్సిస్, బిర్లా సన్ లైఫ్ , ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, రిలయన్స్, కోటక్ లకు చెందిన గోల్డ్ ఈటీఎఫ్ లు కూడా పెరిగాయి.