ధోనీ గ్యారేజీలోకి రూ.1.12 కోట్ల విలువైన అత్యాధునిక కారు
రాంచీ: భారత క్రికెటర్ మహింద్ర సింగ్ ధోనీకి బైక్స్, కార్లు, జీపులు అంటే ఎంతో ఇష్టం. మార్కెట్లోకి వచ్చిన వెరైటీ కార్లను కొనుగోలు చేస్తుంటాడు. కార్ల కలెక్షన్ అతనికి ఇష్టం. ఇప్పుడు ధోనీ కారు కలెక్షన్ జాబితాలో భారత తొలి జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్ఆర్టీ ఎస్యూవీ కూడా చేరిపోయింది. ధోనీ ప్రస్తుతం క్రికెట్ నుంచి సెలవు తీసుకొని భారత ఆర్మీతో కలిసి విధులు నిర్వహిస్తున్నారు. పారా మిలిటరీ దళాలతో కలిసి ధోనీ కాశ్మీర్ లోయలో విధులు నిర్వహిస్తున్నారు. ధోనీ ట్రెయినింగ్ నుంచి వచ్చే సమయానికి అతని సతీమణి సాక్షి అతని కోసం ఈ ప్రత్యేక కారును సిద్ధంగా ఉంచింది.
సాక్షి ధోనీ పోస్ట్
మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి సింగ్ ఈ మేరకు ఈ కారు ఫోటోను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. "Welcome home #redbeast! Your toy is finally here @mahi7781, really missing you!" అని పోస్ట్ చేశారు. నీకు ఇష్టమైన కారు వచ్చేసిందని, నిన్ను మిస్ అవుతున్నానని ధోనీని ఉద్దేశించి పోస్ట్ పెట్టారు.
ధర రూ.1.12 కోట్లు
కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న ధోనీ జీప్ గ్రాండ్ చెరోకీ ఎస్యూవీని బుక్ చేసుకున్నాడు. భారత్లోనే అత్యంత ఖరీదైన, ఏకైక కారు ధోనీ గ్యారేజీలో రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా సాక్షి ధోనీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ కారు ధర రూ.1.12 కోట్లు (ఎక్స్-షోరూమ్ ధర). ధోనీ సైనిక విధులు ఆగస్ట్ 15వ తేదీతో ముగియనున్నాయి.
అమెరికాలో లాంచ్
గ్రాండ్ చెరోకీ ఎస్ఆర్టీ 2017లో అమెరికాలో లాంచ్ చేశారు. 6.2 లీటర్ సూపర్ ఛార్జ్డ్ వీ8 హెచ్ఈఎంఐ ఇంజిన్ కలిగి ఉంది. 3.62 సెకండ్ల వ్యవధిలో వంద కిలో మీటర్ల వేగం అందుకునే ఎస్యూవీలలో ఇది ఒకటి.
ధోనీ గ్యారేజ్
ధోనీకి స్పోర్ట్స్ బైక్స్, కార్లు చాలా ఇష్టం. ఇప్పటికీ అతని వద్ద ఫెరారీ 599 జీఓటీ, హమ్మర్ హెచ్2, ది జీఎంసీ సీఎర్రా కార్లు ఉన్నాయి. కవాసకీ నింజా హెచ్2, కాన్ఫిడర్ హెల్ కాట్, బీఎస్ఏ వంటి బైక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జీప్ గ్రాండ్ చెరోకీ వచ్చి చేరింది. కొత్త కారు ధోనీ కోసం ఎదురు చూస్తోంది. గత పద్నాలుగేళ్లుగా ధోనీ తనకు ఇష్టమైన బైక్స్, కార్లు సేకరిస్తున్నారు. వీటి కోసం సొంతగా గ్యారేజీ ఏర్పాటు చేసుకున్నాడు.