హైదరాబాద్లో ఇళ్లు-ఆఫీస్ దొరకక ఇబ్బంది పడుతున్నారా?: నో బ్రోకర్తో ఉచితం
హైదరాబాద్: ఇటీవలి కాలంలో హైదరాబాద్ వంటి నగరాల్లో ఇళ్లు, కార్యాలయాలు దొరకాలంటే కచ్చితంగా బ్రోకర్ అవసరం ఏర్పడింది. ఆ బ్రోకర్లు తొలుత కొంత అడ్వాన్స్ తీసుకుంటారు. ఆ తర్వాత ఇల్లు లేదా కార్యాలయం చూపించాక నెల రెంట్ లేదా అద్దెలో కొంత శాతాన్ని ఫీజుగా తీసుకుంటారు. బ్రోకర్లు లేకుండా ఇళ్లు లేదా కార్యాలయాలు దొరకని పరిస్థితిని చూస్తున్నాం. అయితే అలాంటి వారి కోసం ఓ శుభవార్త. బ్రోకర్ అవసరం లేకుండానే ఇళ్లు, ఆఫీస్లను అద్దెకు తీసుకోవచ్చు.
ఆ నగరాల తర్వాత హైదరాబాదులో నో బ్రోకర్..
బెంగళూరుకు చెందిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ పోర్టల్ NoBroker.com ఇప్పుడు హైదరాబాదులో అడుగు పెట్టింది. బుధవారం నాడు ఎలాంటి బ్రోకరేజీ లేని రియల్ ఎస్టేట్, సంబంధిత సేవలను ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ కంపెనీ ముంబై, బెంగళూరు, పుణే, చెన్నై, గుర్గావ్ నగరాల్లో సేవలు అందిస్తోంది. ఇప్పుడు భాగ్యనగరంలోను సేవలు ప్రారంభించింది. రెసిడెన్షియల్తో పాటు కమర్షియల్ ప్రాపర్టీల అద్దె, కొనుగోలు, అమ్మకం వంటి సేవలు అందిస్తోంది. ఎలాంటి బ్రోకరేజీ చార్జీ లేకుండా ఈ సేవలు అందిస్తోంది. ఇది కస్టమర్లను ఆకర్షించే విధంగా ఉంది.
ఉచిత సహకారం.. ఆ తర్వాత స్వల్ప ఛార్జ్
దీని సహకారంతో బ్రోకర్ అవసరం లేకుండానే ఇళ్లు, ఆఫీస్లు అద్దెకు తీసుకోవచ్చు. హైదరాబాదులో సేవలు ప్రారంభించిన సందర్భంగా కంపెనీ కో ఫౌండర్ సౌరభ్ గార్గ్ మాట్లాడుతూ భాగ్యనగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీకి సంబంధించి అద్దె, కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి సేవలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో మార్కెట్లోకి ప్రవేశించినట్లు చెప్పారు. కస్టమర్లకు ఉచిత సేవలు అందిస్తున్నామని, తొమ్మిది ప్రాజెక్టుల తర్వాత స్వల్పంగా ఛార్జీలు విధిస్తామని గార్గ్ చెప్పారు.
పూర్తి లావాదేవీలు అయ్యే వరకు సహకారం
మధ్యవర్తిత్వం ద్వారా క్రయవిక్రయాలు, అద్దె లావాదేవీ పూర్తయ్యేందుకు సహకరిస్తామని, ఇందుకు గాను తాము ఎలాంటి బ్రోకరేజీ ఫీజును వసూలు చేయడం లేదని సంస్థ వ్యవస్థాపకులు అఖిల్ గుప్తా వెల్లడించారు. రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ గణనీయమైన వృద్ధి సాధిస్తోందన్నారు. అందుకే ఇక్కడ విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
యజమానులు ఉచితంగా నమోదు చేసుకోవచ్చు
ఇళ్లు, కార్యాలయాల యజమానులు ఉచితంగా నమోదు చేసుకోవచ్చుని, కొనుగోలుదారులు లేదా అద్దెకు తీసుకోవాలనుకునేవారు తొమ్మిది ఇళ్ళు లేదా కార్యాలయాల వరకు (అంటే తొమ్మిది మంది యజమాలను సంప్రదించే వరకు ఉచితం) ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదన్నారు. ఆ తర్వాత రూ.1,000 ఛార్జ్ చేస్తామన్నారు. దీంతో మరో 25 మందిని సంప్రదించవచ్చు.
ప్రయోగాత్మకంగా నెల క్రితమే ప్రారంభం
ఈ సేవలను హైదరాబాదులో ప్రయోగాత్మకంగా నెల రోజుల క్రితమే ప్రారంభించామని చెప్పారు. 15,000 మంది యజమానులు, 33,000 మంది వినియోగదారులు నమోదు చేసుకున్నారన్నారు. గత అయిదేళ్ల కాలంలో మూడు దశల్లో రూ.500 కోట్ల పెట్టుబడులను సమీకరించామన్నారు. రెండు మూడేళ్లలో దేశంలోని 20 ప్రధాన నగరాల్లో సేవల్ని ప్రారంభిస్తామన్నారు.
విశాఖకూ No broker
తాము విస్తరించబోయే నగరాల్లో విశాఖపట్నం కూడా ఉంటుందని తెలిపారు. ఐటీ హబ్గా వెలుగొందుతున్న హైదరాబాదుకు యువ నిపుణులు వస్తుంటారని, వసతి కోసం ఎదురు చూస్తుంటారని, ఇలాంటి వారు బ్రోకర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించి ఇళ్లు లేదా కార్యాలయాలు వెతుక్కోవల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అలాంటి ఇబ్బందులు లేకుండా తాము సేవలు అందిస్తామన్నారు.