సూపర్ రిచ్ ట్యాక్స్ తొలగింపు ? భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ ఈ రోజే స్టాక్ మార్కెట్ భారీ లాభాలను నమోదు చేసింది. మూడు నెలల తర్వాత ముచ్చటగా ఎగిరి గంతేసి ఇన్వెస్టర్లలో టెన్షన్ తగ్గించింది. ప్రభుత్వం ఈ బడ్జెట్లో సూపర్ రిచ్పై విధించిన పన్ను విషయంలో వెనక్కి తగ్గబోతోందనే వార్తలు ఊరట కలిగించాయి. దీంతో మిడ్ సెషన్ తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు పరుగులు పెట్టాయి. 10900 దగ్గర ప్రారంభమైన నిఫ్టీ మొదట్లోనే నీరసించి 10850 దిగువకు పడిపోయింది. అయితే మళ్లీ అక్కడి నుంచి తేరుకుని 11 వేల మార్కును క్రాస్ చేసింది. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్ షేర్లు మార్కెట్లకు బలమైన మద్దతునిచ్చాయి. దీంతో చివరకు సెన్సెక్స్ 637 పాయింట్ల లాభంతో 37 వేల 327 దగ్గర, నిఫ్టీ 177 పాయింట్ల లాభంతో 11032 దగ్గర ముగిసింది. బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా లాభంతో 28 వేల 110 దగ్గర క్లోజైంది.
ఆశ్చర్యంగా మిడ్, క్యాప్ ఇండెక్స్లు మాత్రం ఒక్క శాతానికి మించి పెరిగింది లేదు. ఈ రోజు ట్రేడ్లో సెక్టోరల్ ఇండిసిస్ అయిన ఆటో, బ్యాంకింగ్, మీడియా, రియాల్టీ రంగ కౌంటర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అన్ని రంగాల సూచీలూ లాభాల్లోనే ముగిశాయి.
హెచ్ సి ఎల్ టెక్, టాటా మోటార్స్, జెఎస్డబ్ల్యు స్టీల్, రిలయన్స్, బిపిసిఎల్ షేర్లు టాప్ 5 గెయినర్స్గా మిగిలాయి. టాటా స్టీల్, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ లూజర్స్ జాబితాలో నిలిచాయి.
ఆఫెల్ ఇండియా బంపర్ లిస్టింగ్
ఈ కష్టకాలంలో కూడా 25 శాతం ప్రీమియంతో బంపర్ లిస్టింగ్ సాధించింది ఆఫెల్ ఇండియా ఐపీఓ. రూ.745 ఇష్యూ ధరతో వచ్చిన ఈ స్టాక్ రూ.958 వరకూ వెళ్లింది. మధ్యలో కొన్ని ఒడుదుడుకులు ఉన్నప్పటికీ 18 శాతం లాభంతో రూ.875 దగ్గర క్లోజైంది.
అరబిందోకు రిజల్ట్స్ కిక్
తమ త్రైమాసిక ఫలితాల ఆదాయంలో 28 శాతం, నికర లాభంలో 40 శాతం వృద్దిని నమోదు చేసినట్టు అరబిందో ప్రకటించింది. మార్జిన్లు కూడా 18.3 నుంచి 21.1 శాతానికి పెరిగాయి. ఈ నేపధ్యంలో స్టాక్ 8.5 శాతం పెరిగి రూ.598 దగ్గర క్లోజైంది.
మంచి రిజల్ట్స్ ఇచ్చినా...
అల్ట్రాటెక్ తన త్రైమాసిక ఫలితాల్లో నికర లాభాన్ని రెట్టింపు ఆర్జించింది. ఆదాయం 14.7 శాతం మెరుగై రూ.9794 కోట్లకు చేరింది. నికర లాభం 100.3 శాతం పెరిగి రూ.1198.7 కోట్లకు పెరిగింది. మార్జిన్లు కూడా 19 శాతం నుంచి 26 శాతానికి ఎగబాకాయి. అయినప్పటికీ స్టాక్ మాత్రం 3 శాతం నష్టంతో రూ.4232 దగ్గర క్లోజైంది.
టాటా స్టీల్ మూడేళ్ల కనిష్టానికి..
సంస్థ ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు తీవ్రంగా నిరుత్సాహపరిచాయి. నికరలాభం 65 శాతం తగ్గడం స్టాక్ను కుదేలయ్యాలా చేసింది. స్టాక్ 4 శాతం పడి రూ.367 దగ్గర క్లోజైంది.
అశోక్ లేల్యాండ్ బ్లాక్ డీల్
సుమారు 15 లక్షల షేర్లు ఒకే సారి బ్లాక్ డీల్ జరగడంతో అశోక్ లేల్యాండ్ స్టాక్ 4 శాతం పెరిగింది. 52 వారాల కనిష్టానికి పడిపోయి వరుస నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న స్టాక్ ఈ రోజు కాస్త తేరుకుంది. చివరకు రూ.63.55 దగ్గర క్లోజైంది.
ఎండ్యూరెన్స్కు గట్టి దెబ్బ
ఆటోయాన్సిలరీ కంపెనీ అయిన ఎండ్యూరెన్స్ టెక్కు గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితి నేపధ్యంలో విదేశీ ఆర్డర్లు తగ్గొచ్చనే భయాలతో పాటు బయటకి తెలియని అనేక ఇతర కారణాలతో స్టాక్ ఏకంగా ఈ రోజు 20 శాతం లోయర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. చివరకు రూ.743.05 దగ్గర క్లోజైంది.