భారీగా పెరిగిన బంగారం ధర, డిసెంబర్ నాటికి రూ.40,000: ఇప్పుడే కొనుగోలు చేయాలా, ఎందుకు?
ముంబై: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయంగా డిమాండ్ ఊపందుకోవడంతో ఈ ధర లైఫ్ టైమ్ గరిష్టానికి చేరుకుంది. బుధవారం ఒక్కరోజే వెయ్యి రూపాయలకు పైగా పెరిగి, కొనుగోలుదారులకు చుక్కలు చూపించింది. సమీప భవిష్యత్తులో బంగారం కొనుగోలు చేయలేని పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. అసలు బంగారం ధరలు పెరుగుతాయా, తగ్గుతాయ అని తెలియని పరిస్థితుల్లో ఎంతోమంది ఉన్నారు. ధరల పెరుగుదల అమాంతం పెరుగుతుండటంతో కొనలేకపోతున్నారు. అదే సమయంలో భవిష్యత్తులో ఇలాగే పెరుగుతుందా, ఇప్పుడే కొనుగోలు చేస్తే మంచిదా అనే దానిని కూడా తేల్చుకోలేకపోతున్నారు.
బంగారం ధరలు భారీగా ఎందుకు పెరుగుతున్నాయి?
ఒక్కరోజే రూ.1,100కు పైగా పెరిగిన బంగారం ధర
గత కొద్ది రోజులుగా కొనుగోలుదార్లకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బంగారం కొనాలని భావిస్తున్న వారు... వెంటనే అవసరం ఉన్నవారు కూడా... రేపు తగ్గుతుందేమో.. ఎల్లుండి వరకు వేచి చూద్దాం అనే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఈ ధరలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే బంగారం ధర రూ.1,000కి పైగా పెరిగింది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 1,113 పెరిగి రూ.38వేల మార్క్కు (రూ.37,920) చేరువైంది. ముంబైలో ఆల్ టైమ్ రికార్డ్ రూ.1,263 పెరిగి రూ.38,070కి చేరుకుంది.
బంగారం పెరుగుదలకు కారణాలు...
అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం రోజురోజుకు ముదురుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ వాణిజ్య యుద్ధం కారణంగా దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి. ఇలాంటి సమయంలో పసిడిపై ఇన్వెస్ట్ చేయడం మంచిదని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఫలితంగా బంగారం ఆకాశాన్ని అంటుతోంది. దీంతో పాటు దేశీయంగా కూడా డిమాండ్ ఊపందుకుంది. సామాన్యులు బంగారాన్ని కొనుగోలు చేయలేకపోయినప్పటికీ, భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందని ఎంతోమంది బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు.
రూ.38,000 మార్క్ తొలిసారి
బంగారం ధర ఆల్ టైమ్ రికార్డ్ హైకి చేరుకుంది. దేశీయ బులియన్ మార్కెట్లో దీని ధర రూ.38వేల నుంచి 39 వేలకు చేరువ కావడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు భారీగానే పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 1,507 డాలర్లు పలికింది. ఒక్కరోజులోనే ఔన్స్ బంగారం 35 డాలర్ల మేర పెరిగింది.
వెండిది అదే దారి...
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువగా ఉండటంతో వెండి ధర కూడా భారీగానే పెరిగింది. బుధవారం ఒక్కరోజు రూ.650 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.43,670 నుంచి రూ.45,000 మధ్య పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.39వేలకు చేరువలో బంగారం ధర
బుధవారం రాత్రి హైదరాబాదులో కూడా బంగారం ధర భారీగా పెరిగింది. 99.9% స్వచ్ఛత కలిగిన బంగారం తెలుగు రాష్ట్రాల్లో రూ.38,900కు పైగా ఉంది. అంటే దాదాపు బంగారం ధర రూ.39 వేలకు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్ల కారణంగానే భారీగా పెరుగుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా?
బంగారం ధర పెరుగుతోందని ఆందోళన చెందవద్దని, అంతర్జాతీయ మార్కెట్లు ఇందుకు కారణమని చెబుతున్నారు. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం కారణంగా అందరూ సేఫ్ సైడ్గా ప్రస్తుతం పసిడివైపు పరుగెడుతున్నారని చెబుతున్నారు. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ పడిపోతోందని ఇదీ కారణమే అంటున్నారు. వీటికి తోడు దేశీయ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా డిమాండ్, కస్టమ్ సుంకం 12.5 శాతం కలుస్తున్నాయి. కాబట్టి ప్రస్తుతం అవసరానికి అనుగుణంగా కొనుగోలు చేయాలని చెబుతున్నారు. వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పసిడి వైపు నుంచి తమ దృష్టి మరల్చితే డిమాండ్ తగ్గి ధరలు కాస్త అదుపులోకి రావొచ్చునని పలువురు భావిస్తున్నారు.
రూ.40,000 పెరిగే ఛాన్స్
బంగారం ధర ఈ ఏడాది చివరి నాటికి రూ.40,000 మార్క్ చేరుకోవచ్చునని అభిప్రాయపడుతున్నారు. డిసెంబర్ నాటికి మరికొంత పెరుగుతుందని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. అమెరికా - చైనా ట్రేడ్ వార్ ఇలాగే కొనసాగితే బంగారం ధర తగ్గకపోవచ్చునని చెబుతున్నారు. ఎంసీఎక్స్లో అక్టోబర్ నెల నాటికి బంగారం ధర రూ.38,000 నుంచి 39,000 మార్క్ చేరుకోవచ్చునని, అదే సమయంలో డాలర్తో రూపాయి మారకం విలువ 72కు దిగజారితే బంగారం ధర 10 గ్రాములకు రూ.40,000 చేరుకోవచ్చునని మనీలీసియస్ డైరెక్టర్ ప్రకాశ్ గుప్తా అన్నారు.
బుధవారం ఎక్కడ ఎంత ధర?
ఆల్ టైమ్ రికార్డ్ హైతో బంగారం దూసుకెళ్తోంది. ఆలిండియా సరఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీలో 99.9 శాతం స్వచ్చత కలిగిన బంగారం 10 గ్రాముల ధర రూ.37,920, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.37,750గా ఉంది. హైదరాబాదులో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.38,840, 22 క్యారెట్ల బంగారం ధర రూ.35,470గా ఉంది. 8 గ్రాముల సావరీన్ గోల్డ్ రూ.200 పెరిగి ప్రస్తుతం రూ.27,800కు చేరుకుంది.