కిడ్నీ జబ్బును 14 నిముషాల్లో గుర్తించే యాప్ ... ఈ గూగూల్ యాప్ తో ఎంత ప్రయోజనమంటే ?
ప్రపంచంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా బ్రిటన్లో కిడ్నీ సమస్యలతో ఏటా ఏకంగా లక్షమంది మరణిస్తున్నారు. ఇక కిడ్నీ సమస్యను వెంటనే గుర్తించేందుకు , ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఒక యాప్ ని తయారుచేసింది గూగుల్ కంపెనీ. 14 నిమిషాల్లోనే కిడ్నీ జబ్బు ఉన్న వ్యక్తిని గుర్తించి చెప్పే ఈ మొబైల్ యాప్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.
కిడ్నీ జబ్బు గుర్తించే యాప్ వల్ల రోగికి తగ్గనున్న 2 లక్షల ఖర్చు
గూగుల్ కంపెనీ తయారుచేసిన ఈ యాప్ సత్ఫలితాలను ఇస్తుంది . స్ట్రీమ్స్ అనే పేరుతో అని పిలిచే యాప్ ని గూగుల్స్ డీప్ మైండ్ గానూ అభివర్ణిస్తున్నారు. ఈ యాప్ ద్వారా కిడ్నీ వ్యాధి ఉన్న రోగిని ఇట్టే గుర్తించవచ్చని, దాదాపు ప్రతి రోగికి రెండు లక్షల రూపాయలు ఖర్చు తగ్గుతుందని నేచర్ డిజిటల్ మెడిసిన్ పత్రిక తాజా సంచికలో వెల్లడించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక విజ్ఞాన పద్ధతుల ద్వారా రోగుల్లో 87.6 శాతం ఎమర్జెన్సీ కేసులను గుర్తించగలుగుతుంటే గూగుల్ యాప్ ద్వారా 96.7 ఎమర్జెన్సీ కేసులను గుర్తించ గలుగుతున్నారని ఈ పత్రిక వివరించింది.
గూగుల్ స్ట్రీమ్స్ యాప్ పని చేస్తుంది ఇలా ..
ఈ యాప్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఆసుపత్రిలో ఉండే ఐటీ టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక రోగికి సంబంధించిన మొత్తం డేటాను ఈ యాప్ సేకరిస్తుంది. పల్స్ రేట్, హార్ట్ బీట్, బ్లడ్ టెస్ట్ వివరాలు సేకరించి ఒకే చోట నమోదు చేస్తుంది. ఇక దీని ద్వారా రోగి రక్తంలో క్రియాటినిన్ ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే కిడ్నీకి సంబంధించిన సమస్యగా గుర్తించి వెంటనే వైద్యుడిని అలర్ట్ చేస్తుంది. ఒక సందేశాన్ని పంపిస్తుంది.
అయితే ఈ యాప్ ప్రస్తుతం బ్రిటన్ లో చాలా ఉపయోగకరంగా ఉంటుందని అక్కడ కిడ్నీజబ్బుల సంఖ్య విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కనీసం కొంత మంది రోగుల నైనా కాపాడటానికి ఈ యాప్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు బ్రిటన్ వైద్య వర్గాలు.
బ్రిటన్ లో ఎక్కువగా కిడ్నీ జబ్బులు .. యాప్ చాలా ఉపయుక్తంగా ఉందన్న వైద్య వర్గాలు
బ్రిటన్ లో ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల్లో ప్రతి ఐదుగురుల్లో ఒకరు కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న వారేనని, సకాలంలో వారి సమస్యను గుర్తించక పోవడం వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నారని లండన్లోని రాయల్ ఫ్రీ ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణులు చెప్తున్నారు. సకాలంలో గుర్తించినట్లయితే డయాలసిస్ లేదా కిడ్నీ ఆపరేషన్ల వరకు వెళ్లకుండా రోగులను రక్షించే అవకాశం ఉంటుందని వారంటున్నారు. సకాలంలో వైద్యులు జబ్బును గుర్తిస్తే మరణిస్తున్న ప్రతి ముగ్గురు రోగుల్లో ఒక్కరిని రక్షించవచ్చని అంటున్నారు. అయితే తాజాగా ఈ ‘స్ట్రీమ్స్' యాప్ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బ్రిటన్లో కిడ్నీ జబ్బులను గుర్తించేందుకు ఈ యాప్ చాలా బాగా పనిచేస్తుందని రాయల్ ఫ్రీ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ క్రిస్ స్ట్రీతర్ పేర్కొన్నారు.