స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు తగ్గుతున్నాయి... ఎందుకు?
ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోనే కనిపిస్తోంది. చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు స్మార్ట్ ఫోన్ల ను వినియోగించే పరిస్థితి నెలకొంది. స్మార్ట్ ఫోన్లను తయారు చేసే కంపెనీల సంఖ్య పెరగడం, ధరలు తగ్గడం వల్ల ఎక్కువ మంది ఈ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. వినోదం కోరుకునే వారు పెరుగుతున్న కారణంగా ఫోన్లకు గిరాకి ఏర్పడుతుంది. మొబైల్ డేటా కూడా చాలా తక్కువ ధరల్లోనే లభిస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది జూన్ తో ముగిసిన రెండో త్రైమాసికంలో మాత్రం దేశీయ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ఈ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 3.3 కోట్ల వరకు ఉన్నట్టు పరిశోధన సంస్థ కానలిస్ వెల్లడించింది. గత ఏడాది జూన్ త్రైమాసికంలో 3.31 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి.
షామీ నెంబర్ వన్
* భారత మార్కెట్లో చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల కంపెనీ షామీ సత్తా చాటుకుంటోంది.
* వరుసగా గత ఎనిమిది త్రైమాసికాలుగా ఈ కంపెనీ మార్కెట్ లీడర్ గా ఉంది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 31 శాతం (1.03 కోట్ల ఫోన్లు ) ఉండగా.. దక్షిణ కొరియాకు చెందిన సాంసంగ్ 73 లక్షల ఫోన్లను విక్రయించగా ఈ కంపెనీ మార్కెట్ వాటా 22 శాతంగా ఉంది.
* వివో వాటా (58 లక్షలు), ఒప్పో వాటా 9 శాతం (30 లక్షలు), రియల్ మీ 8 శాతం (27 లక్షలు) వాటాను కలిగి ఉన్నాయి.
* మొత్తం స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో అగ్రస్థాయిలో ఉన్న ఐదు కంపెనీల వాటాయే 88 శాతం వరకు ఉంది. అంతకు ముందు ఏడాది జూన్ త్రైమాసికంలో వీటి వాటా 80 శాతంగా ఉంది.
అంచనాలకన్నా తక్కువ వృద్ధి
* దేశీయ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలకు సంబంధించి కంపెనీలు ఆశిస్తున్నా స్థాయిలో వృద్ధి నమోదు కావడం లేదు. ఫీచర్ ఫోన్లను వాడుతున్న వారిలో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్లకు వేగవంతంగా మారిపోవడం లేదు. అయితే కొంత మంది మరింత మెరుగైన ఫోన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనివల్లనే ఫోన్ల మార్కెట్లో వృద్ధి నమోదు అవుతోంది. రూ. 15,000 నుంచి రూ. 20,000 మధ్య శ్రేణిలో ఫోన్లను కొనుగోలు చేసే వారు పెరుగుతున్నారు.
* ప్రస్తుతం 4జీ మొబైల్ ఫోన్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో 5 జి సేవలు అందుబాటులోకి రావచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.
* ఈ నేపథ్యంలో కొంతమంది కస్టమర్లు 5 జి ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.
దేశీయ కంపెనీలకు గట్టి పోటీ
* ప్రస్తుతం దేశీయ స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో చైనా కంపెనీల హవా సాగుతోంది.
* వీటిలో వివో, ఒప్పో, హానర్, హువే, షామీ, వన్ ప్లస్, లెనోవో,రియల్ మీ ఉన్నాయి.
* మార్కెట్లో వీటి అమ్మకాలే ఎక్కువగా జరుగుతున్నాయి.
* ఆన్ లైన్ తో పాటు రిటైల్ స్టోర్ల ద్వారా అమ్మకాలను పెంచుకోవడానికి ఈ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి.
* దేశీయంగా మొబైల్ ఫోన్లను చైనా కంపెనీలు తయారు చేయడం తక్కువ ధరలోనే ఈ కంపెనీలు ఫోన్లను అందించగలుగు తున్నాయి.
* చైనా తదితర కంపెనీల మూలంగా దేశీయ మొబైల్ ఫోన్ల కంపెనీలైన ఐ బాల్, ఇంటెక్స్, కార్బన్ మొబైల్స్, లావా, సెల్ కాన్ వంటి కంపెనీలు గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి.