ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 13 శాతం పెరిగిన బంగారం విక్రయాలు
ముంబై: ఆగస్ట్ 2 (శుక్రవారం) బంగారం ధరలు ఒక శాతం తగ్గాయి. చైనాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల ప్రభావం పసిడి పైన కూడా పడుతోంది. ఇదిలా ఉండగా, ఏప్రిల్ - జూన్ రెండో క్వార్టర్కు గాను బంగారం విక్రయాలు భారీగా పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సెల్ వెల్లడించింది. పదమూడు శాతం పెరిగి 213.2 టన్నుల పసిడి విక్రయాలు జరిగాయని పేర్కొంది.
ప్రతినెల ఆదాయం: పోస్టాఫీస్ మంత్లీ ఇన్కం గురించి తెలుసుకోండి
అక్షయ తృతీయ, శుభ ముహూర్తాలు వంటి వాటి కారణంగా భారీగా పెరిగినట్లు వెల్లడించింది. వరుసగా 2 నెలలు బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో డిమాండ్ పెరిగింది. వీటికి తోడు దుకాణదారులు పోటీపడి ఆఫర్లు ప్రకటించాయని ఇది కూడా కారణమని తెలిపింది. 2018 ఇదే క్వార్టర్లో 189.2 టన్నులుగా ఉండగా, ఇప్పుడు 24 టన్నుల విక్రయాలు పెరిగాయి.
విలువ పరంగా చూస్తే 17 శాతం అధికమై రూ.62,422 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇది రూ.53,260 కోట్లుగా ఉంది. పసిడి నాణేలు డిమాండ్ అయిదేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు తెలిపింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తారని భావించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని పెంచడంతో ముందస్తు కొనుగోళ్లు జరిపినట్లు తెలిపారు.
ఆభరణాల డిమాండ్ 12 శాతం పెరిగి 149.9 టన్నుల నుంచి 168.6 టన్నుల పెరిగింది. విలువ పరంగా చూస్తే 17 శాతం వృద్ధితో రూ.42,200 కోట్ల నుంచి రూ.49,380 కోట్లుగా ఉంది. పెట్టుబడుల రీత్యా కొనుగోళ్లు 13 శాతం పెరిగి 39.3 టన్నుల నుంచి 44.5 టన్నులకు చేరుకుంది. విలువ పరంగా ఇది 18 శాతం పెరిగి రూ.11,060 కోట్ల నుంచి రూ.13,040 కోట్లకు చేరుకుంది. బంగారం పునర్వినియోగం కూడా 32 టన్నుల నుంచి 37.9 టన్నులకు పెరిగింది. ఆర్బీఐ కొనుగోళ్లు కూడా 8.1 టన్నుల నుంచి 17.7 టన్నులకు చేరుకుంది.