ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును తగ్గించిన ఎస్బీఐ
ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించింది. అన్ని కాలపరిమితులపై వీటిని తగ్గించింది. 45 రోజుల కాల వ్యవధి నుంచి పదేళ్ల కాల పరిమితిపై ఈ నిర్ణయం తీసుకుంది. జూలై నెలలో వివిధ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై తమ వడ్డీ రేట్లను తగ్గించాయి. తాజాగా, ఎస్బీఐ తగ్గించిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి. మిగులు ద్రవ్యం, తగ్గుతున్న వడ్డీ రేట్ల నేపథ్యంలో దీనిని కూడా తగ్గించినట్లు పేర్కొంది.
HDFC, Axix, PNB, BOB, కొటక్ సవరించిన వడ్డీ రేట్లు
డిపాజిట్స్పై ఇలా బేసిస్ పాయింట్స్ తగ్గించింది
తక్కువ కాలపరిమితి కలిగిన డిపాజిట్స్ పైన 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు, ఎక్కువ కాలపరిమితి కలిగిన వాటిపై 20 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. రూ.2 కోట్లు ఆపై బల్క్ డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది. అంతకుముందు ఎస్బీఐ మే నెల 9వ తేదీన సెలెక్టివ్ మెచ్యూరిటీస్ పైన వడ్డీ రేటును సవరించింది.
ఏ కాలపరిమితికి ఎంత తగ్గించిందంటే?
7 రోజుల నుంచి 45 రోజుల FD మెట్యూరింగ్ డిపాజిట్స్ పైన 5.75 శాతం ఉన్న వడ్డీ రేటును 5 శాతానికి తగ్గించింది. 46 రోజుల నుంచి 179 రోజుల వరకు డిపాజిట్స్ పైన 5.75 శాతానికి, 180 నుంచి 210 రోజుల వరకు డిపాజిట్స్ పైన 6.25 శాతానికి, 211 రోజుల నుంచి ఏడాది డిపాజిట్స్పై 6.25 శాతానికి తగ్గించింది.
సంవత్సరానికి పైగా ఉంటే...
ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల కాలపరిమితిపై 6.80 శాతానికి, రెండేళ్ల నుంచి మూడేళ్ల కాలపరిమితిపై 5 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. ఇది 6.70 శాతంగా ఉంటుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కాలపరిమితిపై ఇప్పటి వరకు 6.70 శాతం ఉండగా, ఇప్పుడు 6.60 శాతానికి తగ్గించింది. అయిదేళ్ల నుంచి పదేళ్ల కాల పరిమితి డిపాజిట్స్ పైన 6.60 శాతం నుంచి 6.50 శాతానికి తగ్గించింది.చివరిసారిగా ఈ ఏడాది మే నెలలో ఎస్బీఐ వడ్డీరేట్లను సవరించింది.