కూతుళ్ల కోసం షేర్లు తనఖా, పతనమైన యస్ బ్యంక్ షేర్లు
న్యూఢిల్లీ: ప్రమోటర్ రానా కపూర్ తన కూతుళ్ల వెంచర్ల కోసం సెక్యూరిటీగా యస్ బ్యాంకు షేర్లను తనఖా పెట్టారు. ఈ విషయం తెలియడంతో మంగళవారం యస్ బ్యాంకు షేర్లు 4 శాతం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. రానా కపూర్ 4.31 శాతం కలిగిన10 కోట్ల షేర్లను తనఖా పెట్టాడు. యస్ బ్యాంకులో గల తమ వాటాలోని కొంత భాగాన్ని మోర్గాన్ క్రెడిట్స్ ప్రైవేటు లిమిటెడ్ కూడా తాకట్టు పెట్టింది. దీంతో బ్యాంకు షేర్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి.
యెస్ బ్యాంక్లో స్టాక్లో రూ.7000 కోట్లు కోల్పోయిన ఓ వ్యక్తి
బ్యాంక్ షేర్లు తనఖా
తమ కూతుళ్ల వ్యవస్థాపక ప్రయత్నాల కోసం యస్ బ్యాంకులో ఉన్న తన సొంత వాటాలను తనఖా పెట్టానని రానా కపూర్ వెల్లడించాడు. మోర్గాన్ క్రెడిట్స్ సంస్థకు అసురక్షిత రుణాలు ఉన్నట్లు తెలిపాడు. ఈ కంపెనీ రానా కపూర్ కుమార్తెలు రాధా కన్నా, రాఖీ టాండన్, రోష్నీ కపూర్ ఆధ్వర్యంలో నడుస్తోంది.
సెక్యూరిటీ డిపాజిట్గా..
రానా కపూర్ 4.31 శాతం వాటాను సెక్యూరిటీ డిపాజిట్గా తనఖా పెట్టగా, మోర్గాన్ క్రెడిట్స్ కూడా తమ వాటాలో 3.03 శాతం (7.02 కోట్ల షేర్లు) తాకట్టు పెట్టారు. జూలై 18-22 మధ్య కాలంలో వీటిని తనఖా పెట్టారు. ఈ విషయాన్ని బీఎస్ఈ ఫైలింగ్లో యస్ బ్యాంక్ తెలిపింది. ఇద్దరు ప్రమోటర్లు కలిపి యస్ బ్యాంకుకు చెందిన 7.34 శాతం షేర్లు తనఖా పెట్టారు.
ప్రమోటర్ 19.78 వాటా
ప్రమోటర్ సంస్థ అయిన మోర్గాన్ క్రెడిట్స్ (MPCL) జారీ చేసిన డిబెంచర్ల కోసం సెక్యూరిటీగా తాకట్టు పెట్టారు. MPCL జారీ చేసిన డిబెంచర్లను కలిగి ఉన్నవారి ప్రయోజనం కోసం డిబెంచర్ ట్రస్టీ మైల్స్టోన్ ట్ర్సస్టీషిప్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్కు ఫేవర్గా ఈ ఇద్దరు ప్రమోటర్స్ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2019 చివరి నాటికి ఈ బ్యాంకులో ప్రమోటర్ వాటా 19.78 శాతంగా ఉంది. ఇందులో రానా కపూర్, అతని సతీమణి వాటా 11.88 శాతం.
నష్టాల నుంచి కాస్త లాభాల్లోకి...
షేర్ల తనఖా వార్తల నేపథ్యంలో యస్ బ్యాంకు షేర్లు ఇంట్రాడేలో మంగళవారం ఉదయం 4.4 శాతం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఆ తర్వాత కోలుకొని, 2 శాతం వరకు లాభపడింది. మధ్యాహ్నం ఒకటింపావుకు 0.70 శాతం వద్ద లాభంతో ట్రేడ్ అయింది. రూ.92కు అటు ఇటుగా ట్రేడ్ అవుతోంది.