మీకిష్టమైన టీ, కొబ్బరి నూనె, సోప్ కోసం కొందరు లైన్లో ఉన్నారు తెలుసా?
పంజాబీలు టీ బాగా తాగుతారు. వాళ్లు నీళ్లకు బదులు పాలు ఎక్కువగా పోసి టీ పెట్టుకుంటారు. అందుకే వాళ్ల కోసం స్ట్రాంగ్ బ్లెండ్ ఉండే టీ ఇవ్వాలి. అదే ఒరిసాలో జనాలు డస్ట్ టీ కంటే, ఆకులు ఎక్కువగా టీ పొడినే ఇష్టపడ్తారు. ఇక ముంబై జనాలు పూర్తిగా వేరు. ఇంతకీ ఏంటీ ఈ టీ గోల అనుకుంటున్నారా ? ఇప్పుడు మీరు ఏం తాగుతారో, ఏం తింటారో, ఎలా ఉంటే ఇష్టపడ్తారో తెలుసుకుని మిమ్మల్ని వాళ్ల వైపునకు తిప్పుకునేందుకు ఎఫ్ ఎం సి జి కంపెనీలు పాపం నానా తంటాలు పడ్తున్నాయి. విపరీతంగా పెరిగిపోతున్న కాంపిటీషన్ నేపధ్యంలో కొత్త మైక్రో మార్కెట్స్ పై దృష్టిపెట్టాయి కంపెనీలు. దీని ప్రకారం ఏ ప్రాంతం వారికి ఏది ఇష్టమో అదే సరఫరా చేస్తున్నాయి. అంటే హిందుస్తాన్ లివర్ తయారు చేసే టీ పొడి.. దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండదు. ఒక్కో ప్రాంత అభిరుచిని బట్టి లోపల్ ఇంగ్రెడియెంట్స్ మారిపోతున్నాయి. ప్యాక్ ఒక్కటే.. రేట్లలో కొద్దిగా మార్పులు ఉన్నా.. రుచి, రంగు మాత్రం పూర్తిగా వేరు. ఈ తరహా మైక్రో మేనేజ్మెంట్ ఇప్పుడు ఎప్ ఎం సి జి కంపెనీలు వరంగా మారింది.
FMCG వృద్ధి మందగమనం, గ్రామాల్లో తగ్గిన కొనుగోళ్లు
మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందో లేదో కానీ..
మీ టూత్ పేస్ట్లో ఉప్పు ఉందో లేదో తెలీదు కానీ.. ఒక వేళ ఓ ప్రాంతం వారికి అది బాగా నచ్చితే.. ఉప్పేం ఖర్మ.. ఇంకా ఏదైనా వేసి ఇవ్వడానికి కంపెనీలు రెడీ అయిపోతున్నాయి. ఆ స్థాయిలో కంపెనీలు క్షేత్ర స్థాయికి వెళ్లి్ మీకు కావాల్సినవి అందజేసేందుకు తంటాలు పడ్తున్నాయి. ఒకప్పటి మాదిరి ఒకటే ప్యాకింగ్, ఒకటే కలర్, ఒకటే స్టైల్ ఇప్పుడు ఉండడం లేదు. దేశ అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సంస్థ హిందుస్తాన్ యునిలివర్ ప్రత్యేకంగా ఈ మధ్య విన్నింగ్ ఇన్ మెనీ ఇండియన్స్ (WIMI) పేరుతో ప్రత్యేక వ్యవస్థను ప్రారంభించింది. ఇదే సమయంలో కాంక్వరింగ్ మైక్రో మార్కెట్స్ (సిఎంఎం) పేరుతో గోద్రెజ్, రైజ్ (రీజనల్ ఇన్ సైట్స్ అండ్ స్పీడ్ ఇన్ ఎగ్జిక్యూషన్) పేరుతో డాబర్ కూడా ఇలాంటి వ్యవస్థలనే రూపొందించాయి. వీళ్ల టార్గెట్ అంతా మిమ్మల్ని చేరడమే.
కొబ్బరి నూనె కూడా వేరే
వీళ్ల లెక్కల ప్రకారం దక్షిణాది వాళ్లకు చిక్కగా ఉండే కొబ్బరి నూనె ఇష్టమైతే, అదే తూర్పు రాష్ట్రాల్లోని వాళ్లకు పల్చగా, ఉత్తరాది రాష్ట్రాల వాళ్లకు సువాసనతో కూడిన నూనె ఇష్టం. ఇలా ఒక్కో ప్రాంతానికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. అందుకే చిన్న కంపెనీలకు పోటీగా పెద్ద సంస్థలే రంగంలోకి దిగుతున్నాయి. దీనివల్ల స్థానిక సంస్థలకు ఉన్న పట్టును తప్పించి తామే మార్కెట్ను గుప్పిట్లో పెట్టుకోవాలనేది ఈ బడా ఎఫ్ఎంసిజిల టార్గెట్.
ఈ డిటర్జెంట్తో తక్కువ నురగ
ఇదే కాదు ఇంకో ఆసక్తికరమైన విషయం డిటర్జెంట్ది. విదర్భ ప్రాంతాల్లో నీటి కొరత ఎక్కువ. అందుకే అక్కడ రిన్ స్మార్ట్ ఫోం ఫేరుతో ఓ సబ్బును సరఫరా చేస్తోంది. ఇందులో తక్కువ నురగ వస్తుంది కాబట్టి రెండు బకెట్ల నీళ్లు తక్కువగా పడ్తాయి. ఇవన్నీ ఎందుకు చెబ్తున్నామంటే.. కంపెనీలు మీ గురించి ఎంతగా ఆలోచిస్తున్నాయి, మిమ్మల్ని వాళ్ల కస్టమర్గా మార్చుకునేందుకు ఎంతగా తాపత్రయపడ్తున్నాయో తెలియజెప్పే ప్రయత్నమే ఇది. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర మాదిరి జిల్లాకు తగ్గట్టు ప్రోడక్ట్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఎందుకంటే... మీకు నచ్చింది ఇచ్చినప్పుడే కంపెనీ మనుగడ. వాళ్లకు నచ్చింది మీరు కొనుగోలు చేసే రోజులు పోయాయని పెద్ద కంపెనీలకూ తెలిసొస్తోంది. ఎప్పటికైనా కస్టమరే కింగ్ !