బంగారం కొనగలవా ఓ నరహరి?
చెట్టులెక్కగలవా ఓ నరహరి.. పుట్టలెక్కగలవా.. చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా ఓ నరహరి చిగురు కోయగలవా అంటూ సున్నితంగా సవాలు విసిరే పాట చాలా మందికి తెలిసిందే. అయితే రానున్న కాలంలో బంగారం కొనగలవా ఓ నరహరి.. కనీసం ఒక్క తులం బంగారం కొనగలవా అంటూ భార్యామణి సవాలు విసిరే రోజులు రాబోతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే బంగారం ధర జోరుగా పెరుగుతోంది. ఈ దూకుడు చూస్తుంటే త్వరలోనే రూ. 40,000 స్థాయికి చేరి బంగారం అంటేనే భయ పడే పరిస్థితి వస్తుందేమోనని చాలా మంది కంగారు పడిపోతున్నారు.
లోన్స్ చాలా ఈజీ... ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే ప్రయోజనాలెన్నో
రూ. 35 వేలకు దరిదాపుల్లో...
బంగారం ధర పెరిగే కొద్దీ కొనుగోలుదారుల్లో ముఖ్యంగా పెళ్లి లాంటివి ఉన్న వాళ్లలో ఆందోళన పెరుగుతోంది. అయ్యో ధర ఇంతలా పెరిగిపోతోంది ఇంతకు ముందే కొనేసుకుంటే బాగుండేదేమో అని నిట్టూర్పు విడుస్తున్నారు చాలా మంది. ధర ఇంకా పెరుగుతుందేమోనని పరుగు పరుగున వెళ్లి బంగారం కొనేస్తున్నారు. అయితే కొంత మంది మాత్రం ధర తగ్గక పోతుందా అన్న ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుతం ముంబై బులియన్ మార్కెట్లో పది గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర రూ. 34,750 స్థాయిలో ఉంది. త్వరలోనే ధర రూ. 35,000 స్థాయికి చేరుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నెలన్నర లో ఎంత ధర పెరిగిందంటే..
బంగారం ధర ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది.గత జూన్ 3వ తేదీన ముంబై మార్కెట్లో పది గ్రాముల ధర రూ. 32,305 గా ఉంది. అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది. జులై 17వ తేదీ నాటికీ రూ. 34,750కి ఎగబాకింది. అంటే కేవలం నెలన్నర కాలంలోనే దాదాపు రూ.2,500 వరకు పెరిగిపోయింది. ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నా పసిడి అడుగులు ముందుకే పడుతున్నాయి.
ఇవీ కారణాలు..
*బంగారం ధరలు పెరిగిపోవడానికి దేశీయ మార్కెట్లలో ఉండే డిమాండ్ తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోని ధర ప్రధానంగా కారణమవుతుందన్న విషయం తెలిసిందే.
* అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు రక్షణ కల్పించే బంగారంలోకి మళ్లిస్తున్నారు. ఇది ధరల పెరుగుదలకు దారితీస్తోంది.
* పలు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకోవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు కారణం అవుతోంది.
* ఇటీవలి బడ్జెట్లో ప్రభుత్వం బంగారం దిగుమతిపై సుంకాన్ని 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచింది. ఫలితంగా ధరలు ఒక్క సరిగా పెరిగిపోయాయి.
* బడ్జెట్లో ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలవల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు దిగజారి పోయాయి. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు బంగారాన్ని నమ్ముకుంటున్నారు.
* మన దేశంలో బంగారానికి పెట్టుబడిదారులకన్నా వినియోగదారుల నుంచే ఎక్కువగా డిమాండ్ ఉంటుంది కాబట్టి పండగలు, పెళ్ళిళ్ల సందర్బంగా ధరలు ఇంకా పెరిగిపోవడానికి అవకాశం ఏర్పడుతోంది.
ధరల పెరుగుదలకు దారితీసే అంశాలు..
* రానున్న కాలంలో అంతర్జాతీయ మార్కెట్లోనూ ధరలు ఇంకా పెరగవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి.
* దేశీయంగా వర్షాలు మంచిగా కురిసి పంటలు పండితే బంగారం కొనుగోళ్ళకు రైతులు అధికంగా ప్రాధాన్యం ఇస్తారు.
* పెళ్లిళ్లు, పండగల డిమాండ్ ఎలాగూ ఉంటుంది.
* స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ ఆకర్షణీయంగా లేకపోతే ఆ పెట్టుబడులు బంగారంలోకే మళ్ళవచ్చు. ఫలితంగా ధరలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
* అయితే ధరలు ఇంకా పెరిగితే బంగారం అందని ద్రాక్షలా మారవచ్చని, సాధారణ ప్రజలు బంగారం కొనలేని పరిస్థితి ఎదురుకావచ్చని కూడా విశ్లేషకులు చెబుతున్నారు.