ఆ స్టాక్లో ఒక్క గంటలో రూ.15వేల కోట్లు ఎగిరిపోయింది
టైటన్ స్టాక్ కుప్పకూలింది. గత పదకొండేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు సుమారు పదిహేను శాతం పతనమై ఏకంగా రూ.15వేల కోట్లు ఒక్క గంటలో ఎగిరిపోయింది. అవును నిజం.. గంటలో రూ.15 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయింది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ కూడా పడింది.
ఇంతకీ ఏమైంది
బంగారం ధరలు గత కొద్ది రోజుల నుంచి భారీగా పెరిగాయి. రిటైల్ మార్కెట్లో రూ.32 వేల నుంచి రూ.35 వేల వరకూ ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఔన్స్ బంగారం ధర 1300 నుంచి 1400 డాలర్ల పైకి వెళ్లింది. వీటన్నింటి కారణంగా గోల్డ్ సేల్స్ గత కొద్దికాలం నుంచి నీరసిస్తూ వచ్చాయి. సోమవారం కంపెనీ ప్రకటించిన ఫలితాల్లో కూడా ఇదే స్పష్టంగా కనిపించింది. ఏప్రిల్ - జూన్ క్వార్టర్లో వృద్ధి అంతంతమాత్రంగా ఉండడం టైటాన్ స్టాక్పై ప్రభావం చూపింది.

సాధారణంగా మొదటి క్వార్టర్లో వృద్ధి 25 శాతం వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. కానీ ఇది 13 శాతానికే పరిమితమైంది. స్టాక్ పతనానికి ఇదో కారణం. వీటికితోడు రాబోయే కొద్దికాలం కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుందని, వృద్ధిలో అద్భుతాలు ఊహించలేము అనే విధంగా టైటన్ యాజమాన్యం సంకేతాలిచ్చింది.
బ్రోకరేజ్ సంస్థలదీ అదే మాట
మాక్వెరీ, రిలయన్స్ సెక్యూరిటీస్ వంటి సంస్థలన్నీ టైటన్ను డౌన్ గ్రేడ్ చేసి తమ టార్గెట్లను తగ్గించాయి. కొద్దిగా ఓవర్ ప్రైస్డ్గా కనిపిస్తున్న ఈ స్టాక్లో ఆ స్థాయిలో వృద్ధి ఉండకపోవచ్చని తన నివేదికల్లో చెప్పాయి. ఇవి కూడా ఈ రోజు స్టాక్ పతనం కావడానికి కారణమయ్యాయి.
ప్రస్తుతం టైటన్లో ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలాకు 5.72 శాతం వాటా ఉంది. తన భార్య రేఖకు కూడా 1.2 శాతం వాటా ఉంది.ఆయన చాలాకాలం నుంచి ఈ స్టాక్ను హోల్డ్ చేస్తూ వస్తున్నారు. ఇంట్రాడేలో స్టాక్ రూ.1073 వరకూ వెళ్లింది. ప్రస్తుతానికి 13 శాతం నష్టాలతో స్టాక్ రూ.1097 దగ్గర ట్రేడవుతోంది. ఏడాదికాలంలో స్టాక్ రూ.732 స్థాయిల నుంచి రూ.1340 వరకూ వెళ్లింది.


Click it and Unblock the Notifications