భారీగా తగ్గిన బంగారం ధరలు
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారంపై కస్టమ్ డ్యూటీ 10 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం నాడు బంగారం ధర భారీగా పెరిగింది. అయితే మంగళవారం నాటికి తగ్గుముఖం పట్టింది. ఈ రోజు (జూలై 9) పసిడి దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలతో పాటు దేశీయంగా నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో బులియన్ మార్కెట్లో ధర తగ్గింది.
పది గ్రాముల బంగారం ధర ఈ రోజు 600 తగ్గి రూ.34,870గా ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.48 తగ్గి 38,900గా ఉంది. గ్లోబల్గా ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 1,394.39 డాలర్ల కనిష్టానికి పడిపోయింది. అలాగే, ఔన్స్ వెండి ధర న్యూయార్క్ మార్కెట్లో 15.08 డాలర్లుగా ఉంది.
బంగారం గత వారాంతంలో రూ.35వేల మార్క్ దాటి రూ.35,470కి చేరింది. అయితే సుంకం పెంపు ధరలపై ప్రభావం చూపుతోందని, దీని వల్ల దేశీయ నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా నేడు బంగారం ధర దిగొచ్చింది.
బంగారం ధరలు ఎందుకు పెరిగాయో తెలుసా?: బడ్జెట్ దెబ్బతో 15.5% హైక్
ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర సోమవారం నాటి రూ.35, 470తో పోలిస్తే రూ.600 తగ్గి రూ.34,870కి చేరుకుంది. ఫ్యూచర్స్ మార్కెట్లోనూ 10 గ్రాముల బంగారం ధర రూ.98 క్షీణించి 34,381 వద్ద ఉంది. సావరిన్ గోల్డ్ ధరలు స్థిరంగానే ఉన్నాయి.