54 లక్షల రైతు కుటుంబాలకు రూ.8,750 కోట్ల సాయం, ఏం చేస్తున్నామంటే
అమరావతి: వైయస్సార్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ రైతులకు బహిరంగ లేఖ రాశారు. రైతులకు ఏమేం చేస్తున్నామో పేర్కొన్నారు. రైతు భరోసాను అక్టోబర్ 15వ తేదీ నుంచి ప్రారంభిస్తారు. అయితే ఇదే రోజున (జూన్ 8) నవరత్నాల్లో ఒకటైన పెన్షన్ పెంపును కూడా అమలులోకి తేవాలని నిర్ణయించారు. జగన్ జమ్మలమడుగు వేదికగా ప్రారంభిస్తారు.
వారికీ స్కీం: లక్షలమందికి ప్రయోజనం కలిగే గుడ్న్యూస్ చెప్పిన జగన్
ఏం చేస్తున్నామంటే
తుపానులు, ఇతర ప్రకృతి వైపరీత్యాల్లో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధి ఏర్పాటు చేసినట్లు జగన్ రైతులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లు ధరల స్థిరీకరణ నిధి. కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను గుర్తించేందుకు ప్రతి నియోజకవర్గంలో క్వాలిటీ టెస్టింగ్ సెంటర్స్. ప్రతి గ్రామంలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడం. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వానికి అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వ్యవసాయ మిషన్ ఏర్పాటు.
రైతులకు ఈ ప్రయోజనాలు
రైతులకు ఈ సంవత్సరం బ్యాంకుల నుంచి రూ.84 వేల కోట్లు రుణాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.లక్ష వరకు పంట రుణాలు తీసుకున్న రైతులు గడువులోగా రుణాల చెల్లిస్తే వడ్డీ ఉండదు. రైతులు చెల్లించాల్సిన పంట బీమా ప్రీమియాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందుకు రూ.2,163 కోట్లు కేటాయిస్తుంది. భూయజమానుల హక్కులు కాపాడుతూనే కౌలుదారులకు మేలు చేసేలా 11 నెలల సాగు ఒప్పందం ఉండేలా చట్టంలో మార్పులు తేనున్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 200 రిగ్గులతో రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు. సహకార డైరీ రైతులకు రెండో ఏడాది నుంచి ప్రతి లీటరుకు అదనంగా రూ.4 బోనస్. పామాయిల్ రైతులకు రూ.85 కోట్ల ఆర్థిక సాయం. కొబ్బరి కొనుగోలు కేంద్రాలు నాఫెడ్ ద్వారా ఏర్పాటు చేస్తాం.
ఒకే విడతలో రూ.12,500
కాగా, రైతు భరోసా కింద ఏపీలోని 54 లక్షల మంది రైతులకు రూ.8,750 కోట్ల పెట్టుబడి సాయం అందిస్తారు. లక్షలాది మంది కౌలు రైతులకు కూడా లబ్ధి చేకూరుతుంది. అక్టోబర్ 15వ తేదీ నుంచి రైతు కుటుంబానికి రూ.12,500 చొప్పున ఇవ్వనున్నారు. దీనిని బ్యాంకులో జమ చేయకుండా నేరుగా రైతు చేతికి ఇస్తారు. ఈ మొత్తాన్ని ఒకే విడతలో రైతుకు అందిస్తారు. గ్రామ వాలంటీర్లు రైతులకు ఈ మొత్తాన్ని అందించనున్నారు.
9 గంటల ఉచిత విద్యుత్
పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు జగన్ లేఖలో పేర్కొన్నారు. 60 శాతానికి పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటి పూటే విద్యుత్ ఇశ్తున్నామని, వచ్చే ఏడాది జూన్ నాటికి మిగిలిన ఫీడర్లలో కూడా పగటి పూటే కరెంట్ ఇచ్చే సామర్థ్యాన్ని తీసుకు వచ్చేలా రూ.1,700 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ కారణాల వల్ల రైతు చనిపోతే రూ.7 లక్షలు కుటుంబానికి ఇస్తారు. అక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ కరెంట్ అందిస్తున్నారు.
పింఛన్ పెంపు
పెన్షన్ పెంపు అంశం గురించి జగన్ లేఖలో ప్రస్తావించారు. పెన్షన్ను జూలై 8వ తేదీ నుంచి రూ.2,250కి పెంచుతున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతామని, రూ.3,000 అయ్యే వరకు పెంచుతామన్నారు. దివ్యాంగులకు నెలకు రూ.3,000 చొప్పున పంపిణీ చేస్తున్నామని, కిడ్నీ బాధితులకు పెన్షన్ మొత్తాన్ని నెలకు రూ.10,000కు పెంచామన్నారు. గత ప్రభుత్వం కంటే రెండు రెట్లు ఎక్కువగా పెన్షన్ కోసం ఖర్చు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం.