ఆ సొమ్ము వారిదే.. దర్యాఫ్తు సంస్థల కన్నుపడే అవకాశముంది...
ఇప్పుడున్న విధానం ప్రకారం ఎవరి బ్యాంకు ఖాతాలోనైనా ఎవరైనా నగదు డిపాజిట్ చేయవచ్చన్న విషయం తెలిసిందే. నిర్ణీత పరిమితి మేరకు ఇలా చాలా మంది డిపాజిట్లు చేస్తున్నారు. ఈ విధానాన్ని కొంతమంది సద్వినియోగం చేసుకుంటుంటే మరికొందరు మాత్రం దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖాతాదారు తన అనుమతి లేకుండా వేరొకరు తన ఖాతాలో నగదు డిపాజిట్ చేయకుండా చూసుకునే దిశగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమిస్తోంది. ఈ మేరకు బడ్జెట్ లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు.
ఎందుకు ఈ ప్రతిపాదన వచ్చింది?
* సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు ఇంటికి డబ్బు పంపాల్సి వచ్చినప్పుడు తమ వారి ఖాతా నెంబర్ తీసుకొని అందులో నగదు డిపాజిట్ చేస్తుంటారు. ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నవారు కూడా ఇదే పని చేస్తుంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అవసరం కోసం వేరొకరి ఖాతాలో బ్యాంకు శాఖ లేదా నగదు డిపాజిట్ మిషన్ ద్వారా నగదును డిపాజిట్ చేస్తుంటారు. డిపాజిట్ చేయడానికి ఖాతా నెంబర్ తెలిస్తే చాలు ఆ ఖాతాదారు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాంకుకు వెళ్లి నగదు డిపాజిట్ స్లిప్ తీసుకొని ఖాతా నెంబర్, నగదు రాసి బ్యాంకు సిబ్బందికి ఇవ్వగానే నగదు డిపాజిట్ చేస్తారు. కొన్ని సందర్భాల్లో కొంత ఫీజు అడిగితే అది చెల్లిస్తే సరిపోతుంది. నగదు డిపాజిట్ మిషన్ అయితే ఖాతా నెంబర్ ఎంటర్ చేసి నగదు డిపాజిట్ చేయవచ్చు.
నగదు జమ కాగానే సంబంధిత వ్యక్తి మొబైల్ నెంబర్ కు మెసేజ్ వస్తుంది. అప్పటితో ఆ లావాదేవీ వ్యవహారం ముగుస్తుంది. అంతా బాగానే ఉందికదా మరి డిపాజిట్ దారు తన ఖాతాలో వేరొకరు సొమ్ము జమచేయడానికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఏముంది. ఈ వ్యవహారంలో నియంత్రణ ఎందుకు అన్న సందేహం కలుగుతుంది. అసలు ఈ ప్రతిపాదన రావడానికి కారణం తెలుసుకోవాలంటే పెద్దనోట్ల రద్దు నాటి కాలానికి వెళ్లాల్సిందే.

* పెద్ద నోట్ల రద్దు కాలంలో చాలామంది తమ వద్ద ఉన్న పాత రూ.500, రూ.1,000 నోట్లను మార్చుకోవడానికి ఇతరుల ఖాతాలను వినియోగించుకున్నారన్న వార్తలు వచ్చాయి. కొంతమంది జన్ ధన్ ఖాతాల్లోనూ నగదు డిపాజిట్ చేసారు. తర్వాత ఖాతాదారు వద్దకు వెళ్లి వారి సొమ్ము వారు తీసుకున్నారు. ఈ ఖాతాల్లో నగదు డిపాజిట్ లపై నియంత్రణ ఉంది. అలాంటివి ఏవి పట్టించుకోకుండా డిపాజిట్లు జరిగాయి. కొంత మంది తమ ఖాతాలో సొమ్ము ఎవరు డిపాజిట్ చేశారో తెలియక ఆందోళన చెందిన సందర్భాలు ఉన్నాయి.
* కొంత మంది సంపన్నులు తమ వద్ద ఉన్న సొమ్మును వారి ఖాతాల్లో జమ చేసుకుంటే ఆదాయ పన్ను శాఖకు అందుకు సంబందించిన వివరాలు తెలియజేయాల్సి వస్తుందని ఇతరుల ఖాతాలు వినియోగిచుకుంటున్నారు. ఇలా చాలా మంది నల్లధనం... తెల్ల ధనంగా మారిపోతోంది. పన్ను నుంచి తప్పించుకుంటున్నారు.
* అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే ఖాతాలో జమ అయ్యే సొమ్ము వారి ఆదాయంగానే పరిగణిస్తారు. బ్యాంకు ఖాతాకు ఆధార్, పాన్ నెంబర్ అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు జరిగిన సందర్బంలో లేదా ఎక్కువ సొమ్ము ఖాతాలో ఉన్నా, నిర్ణీత పరిమితికన్నా ఎక్కువ వడ్డీ జమైన సందర్భాల్లో పన్ను ప్రస్తావన వస్తుంది. ఎక్కువ లావాదేవీలు జరిగిన సందర్భాల్లో ఎన్ఫోర్స్మెంట్ లేదా దర్యాప్తు ఏజెన్సీల కన్ను పడే అవకాశం ఉంటుంది.
* ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొనే ఖాతాలో డిపాజిట్లపై ఆ ఖాతాదారుకు నియంత్రణ ఉండే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్టు బ్యాంకింగ్ రంగ విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications