PNBకి మరో మరో షాక్, రూ.3,800 కోట్ల భారీ మోసం
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకుకు (PNB) వేల కోట్ల రూపాయలు మోసం చేసిన నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు విదేశాల్లో తలదాచుకుంటున్నారు. దీనిపై విచారణ జరుగుతుండగానే PNBలో మరో భారీ మోసం వెలుగు చూసింది. భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ (BPSL) రూ.3,805.15 కోట్ల మేర ఫ్రాడ్ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కి తెలిపింది.
భూషణ్ కంపెనీకి ఇచ్చిన రుణాలను ఆ కంపెనీ దుర్వినియోగం చేసిందని, ఖాతా పుస్తకాల్లో అవకతవకలకు పాల్పడి బ్యాంకుల కన్సార్టియం నుంచి నిధులు పొందిందని PNB పేర్కొంది. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.3,805 కోట్ల నిధులను మళ్లించిందని తెలిపింది. దీనిపై బ్యాంకు ప్రతినిధులు మాట్లాడారు.
టారిఫ్ ఎఫెక్ట్: ఇండియాను WTOకు లాగిన అమెరికా
ఈ కేసు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)లో ఉందని, అయితే ఈ ఖాతాకు సంబంధించి అధిక మొత్తం రికవరీకి అవకాశముందన్న ఆశాభావంతో ఉన్నట్టు బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. భూషణ్ కంపెనీపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్ అనంతరం అవకతనకల విషయం వెల్లడైందన్నారు. సుమోటోగా స్వీకరించి సీబీఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసిందని పేర్కొన్నారు.
రూ.3,805.15 కోట్ల నిధులు మళ్లించినందుకుగానూ ఆ భూషణ్ పవర్ అండ్ స్టీల్, ఆ సంస్థ డైరెక్టర్లపై ఎఫ్ఐఆర్ నమోదైందని, నిధులను దారి మళ్లిస్తోందని తమకు అందిన సమాచారం మేరకు విచారణ చేపట్టామని తెలిపారు. ఆ మొత్తంలో భూషణ్ కంపెనీ భారత్లో రూ.3,191.51 కోట్లను తీసుకోగా, దుబాయ్లో రూ.345 కోట్లు, హాంగ్కాంగ్లో రూ.267 కోట్లు అప్పుగా తీసుకుందని తెలిపారు. నిబంధనల మేరకు ఈ కంపెనీ ఖాతాకు సంబంధించి ఇప్పటికే రూ.1,932 కోట్ల కేటాయింపులు జరిపినట్లు తెలిపారు.