గవర్నర్తో విభేదాలు?: ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిప్యూటీ గవర్నర్లలో ఒకరైన విరల్ ఆచార్య తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవీ కాలం మరో ఆరు నెలలు ఉంది. అయినప్పటికీ బాధ్యతల నుంచి వైదొలిగారు. ఆయన జనవరి 23, 2017న ఆర్బీఐలో చేరారు. ఆర్థిక సరళీకరణ విధానాల అమలు అనంతరం ఆర్బీఐలో చేరిన డిప్యూటీ గవర్నర్లలో అతి పిన్న వయస్కుడు.
ఈ నెల ఆరంభంలో జరిగిన పరపతి సమీక్ష సమావేశానికి కొన్ని రోజుల ముందే ఆయన తన రాజీనామాను సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఆయ గతంలో న్యూయార్క్ యూనివర్సిటీ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో పని చేశారు. రాజీనామా అనంతరం ఇప్పుడు తిరిగి అక్కడికే అర్థశాస్త్రం ప్రొఫెసర్గా వెళ్లనున్నారు.
ఊర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్గా రాజీనామా చేసిన తర్వాత నుంచి ఆచార్య ఆర్బీఐలో అసౌకర్యంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. గత రెండు మానిటరీ పాలసీల్లో గవర్నర్ నిర్ణయాలతో ఆచార్య విబేధించినట్లుగా తెలుస్తోంది. ఇటీవలి మానిటరీ పాలసీలో ఆర్థిక లోటు స్థితి, దానిని లెక్కింపు అంశంపై గవర్నర్ శక్తికాంత దాస్తో ఆచార్య విబేధించారని తెలుస్తోంది.
ప్రభుత్వ రంగ సంస్థల రుణాలు ప్రభుత్వ ఆర్థిక లోటు కింద లెక్కించడం సరికాదని శక్తికాంత దాస్ చెప్పగా, రుణాలు పీఎస్యూల ఓవరాల్ డెఫిసిట్కు సంబంధించిన అంశమని ఆచార్య చెప్పారని తెలుస్తోంది. కాగా, వచ్చే నెలలో రిటైర్ కానున్న సీనియర్ డిప్యూటీ గవర్నర్ ఎన్ విశ్వనాథన్ను మరికొన్నాళ్లు కొనసాగించే అవకాశముందని తెలుస్తోంది.
ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఆర్బీఐకి స్వతంత్రత ఉండాల్సిందేనని విరాల్ ఆచార్య భావించారు. ఆర్బీఐ నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయంగా పెద్ద దుమారం రేపాయి.
గుడ్న్యూస్: రూ.3లక్షల లోపు ఆదాయం ఉంటే నగరంలో అద్దె ఇళ్లు