కిరాణా స్టోర్, రెస్టారెంట్ బిజినెస్ చేయాలనుకుంటే... త్వరలో కేంద్రం గుడ్న్యూస్!
న్యూఢిల్లీ: కిరాణా స్టోర్స్, హోటల్స్ లేదా రెస్టారెంట్స్ పెట్టుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో శుభవార్త చెప్పనుందట. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కిరణా స్టోర్స్, రెస్టారెంట్స్ కోసం ఉన్న నిబంధలను సడలించనుందని తెలుస్తోంది. తద్వారా ఇప్పటి వరకు ఉన్న అప్రూవల్స్ను కుదించేందుకు ప్లాన్ చేస్తోందని సమాచారం.
ఏపీలో ఎన్నికల ఖర్చు వింటే షాకవ్వాల్సిందే: అధిక ఖర్చు ఈ నియోజకవర్గాల్లోనే...
సింగిల్ విండో అనుమతులు...
చిన్న వ్యాపారాలకు సింగిల్ విండో క్లియరెన్స్ ఉండాలనే విజ్ఞప్తుల నేపథ్యంలో కేంద్రం ఆ దిశలో ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం కిరాణా స్టోర్స్ వంటి వాటికి 28 రకాల క్లియరెన్సులు అవసరం. రెస్టారెంట్ కోసం 17 రకాల క్లియరెన్స్లు కావాలి. చిన్న వ్యాపారులను ప్రోత్సహించేందుకు నిబంధనలు తగ్గించి, సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది.
లైసెన్స్ రెన్యూవల్ విధానానికి కూడా...
లైసెన్స్ రెన్యూవల్ విధానానికి కూడా స్వస్తీ పలకాలని DPIIT (డిపార్టుమెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) భావిస్తోంది. రెస్టారెంట్స్ ఏర్పాటు చేయాలంటే పలు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్లు, మ్యూజిక్ ప్లే కోసం లైసెన్స్, ఫుడ్ రెగ్యులేటర్ నుంచి క్లియరెన్స్ వంటివి అవసరం. చైనా, సింగపూర్ వంటి దేశాల్లో రెస్టారెంట్స్ ప్రారంభించాలంటే కేవలం నాలుగు రకాల అనుమతులు మాత్రమే ఉంటాయి. కేంద్రం కూడా ఇక్కడ అదే విధానం అమలు చేయాలని చూస్తోందని తెలుస్తోంది. ఇదే అంశాన్ని ఇండస్ట్రీ ప్రతినిధులు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వద్ద ప్రస్తావించారు. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వేర్వేరు నగరాల్లో వేర్వేరు నిబంధనలు
ఇది ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయమవుతుందని, రెస్టారెంట్లన్నింటికి దేశవ్యాప్తంగా ఒకే రకమైన నిబంధనలు ఉండాలని నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి రాష్ట్రానికే కాదని, నగరానికి నగరానికి మధ్య నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయని చెప్పారు. ఫైర్ క్లియరెన్స్ వంటి వాటిని తప్పనిసరి చేయాలన్నారు.