హైదరాబాద్లో అమెజాన్ అతిపెద్ద డెలివరీ సెంటర్, సిద్దిపేట వంటి నగరాల్లోను సేవలు
ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ ఇండియా బుధవారం నాడు హైదరాబాద్ సమీపంలోని గచ్చిబౌలిలో అతిపెద్ద డెలివరీ సెంటర్ను ప్రారంభించింది. ఇది 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఏర్పాటు చేసింది. దీనిని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అమెజాన్ ఇండియా లాస్ట్ మైల్ ట్రాన్స్పోర్టేషన్ డైరెక్టర్ ప్రకాశ్ రోచ్లాని మాట్లాడారు. గత రెండు నుంచి మూడు నెలల్లో తెలంగాణలో వ్యాపారాన్ని వేగంగా విస్తరించామని, దీంతో డెలివరీ స్టేషన్స్ సంఖ్య 90కి చేరుకుందన్నారు. హైదరాబాదులోనే 12 సొంత డెలివరీ స్టేషన్లు ఉన్నాయన్నారు.
హౌస్వైఫ్స్కు Amazon ఆఫర్: పార్ట్టైం జాబ్ కావాలా, గంటకు రూ.140 సంపాదించొచ్చు!
సంగారెడ్డి, సిద్దిపేట, జగిత్యాలలో డెలివరీ సేవలు
తెలంగాణ రాష్ట్రంలో 2,500 మంది వ్యాపారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. డెలివరీ నెట్ వర్క్ రెట్టింపు కావడం వల్ల తమ ఈ-కామర్స్ సైట్ తెలంగాణ రాష్ట్రంలోని చిన్న పట్టణాలలోకి కూడా చొచ్చుకుపోతుందని ఆయన తెలిపారు. సంగారెడ్డి, కొత్తగూడెం, సిద్దిపేట, జగిత్యాల వంటి చిన్న పట్టణాలకు కూడా తమ డెలివరీ సేవలు విస్తరించినట్లు చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా 500 పిన్కోడ్ నెంబర్లకు సేవలు అందిస్తున్నామన్నారు.
3 ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు
చిన్న వ్యాపారులతో ఒప్పందం ద్వారా కస్టమర్లకు వేగవంతమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. వ్యాపార విస్తరణ కోసం పెట్టుబడులు ఉంటాయని చెప్పారు. టెక్నాలజీ, నైపుణ్యం పెపు, లాజిస్టిక్ సదుపాయాల కోసం భవిష్యత్తులో మరింత ఇన్వెస్ట్ చేస్తామన్నారు. వ్యాపార విస్తరణకు అనుకూలమైన హైదరాబాదులో మరో డెలివరీ స్టేషన్ నెలకొల్పే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాదులో 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన మూడు ఫుల్ఫిల్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఉద్యోగాల కల్పన
ప్రస్తుతం రాష్ట్రంలోని ఏ డెలివరీ పాయింట్కైనా ఒకటి లేదా రెండు రోజుల్లో తమ వస్తువులు అందజేయగలుగుతున్నామని, తమ వస్తువులు, ఉత్పత్తులు అమ్ముకునేందుకు తెలంగాణ నుంచి 17,000 సంస్థలు, వ్యక్తులు అమెజాన్లో తమ పేర్లను నమోదు చేసుకున్నారని చెప్పారు. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన ఈ డెలివరీ కేంద్రం తెలంగాణలోనే అతిపెద్దది అని చెప్పారు. అమెజాన్ విస్తరణతో వేలాది ఉద్యోగాలు కూడా వస్తున్నాయని చెప్పారు. అమెజాన్ ఫ్లెక్స్ (Amazon Flex)తో పార్ట్ టైమ్ ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు.