ICC క్రికెట్ వరల్డ్ కప్ ఎఫెక్ట్: 100% పెరిగిన బిగ్ స్క్రీన్ టీవీల విక్రయాలు
న్యూఢిల్లీ: ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో పెద్ద స్క్రీన్ టీవీల (55 అంగుళాల, అంతకుమించిన స్క్రీన్లు) అమ్మకాలు బాగా పెరిగాయి. గత ఏడాది మే నెలతో పోల్చితే ఏకంగా వంద శాతం పెరిగాయి. అన్ని కంపెనీలకు చెందిన లార్జ్ స్క్రీన్ టీవీల అమ్మకాలు భారీగానే పెరిగాయి. సోనీ, శాంసంగ్, ఎల్జీ, పానాసోనిక్తో పాటు ఇతర కంపెనీల టీవీల విక్రయాలు కూడా పెరిగాయి. మెట్రో నగరాలతో పాటు పట్టణాల్లోను వీటికి గిరాకీ ఉంది. క్రికెట్కు తోటు క్యాష్బ్యాక్, డిస్కౌంట్స్, సులభతర ఫైనాన్సింగ్ సదుపాయాల నేపథ్యంలో విక్రయాలు పెరిగాయి.
నిమిషాల్లో... పేటీఎం మనీ యాప్ ద్వారా NPSలో ఇన్వెస్ట్
100 శాతం పెరుగుదల
ప్రపంచకప్ ప్రారంభమైన తర్వాత 55 అంగుళాలు, అంతకంటే పెద్ద టీవీల విక్రయాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 100శాతం పెరిగాయని సోనీ ఇండియా బ్రావియా బిజినెస్ హెడ్ సచిన్ రాయ్ అన్నారు. ప్రపంచకప్లో భారతజట్టు ప్రదర్శన బాగుంటే.. ఫైనల్ వరకు మరిన్ని విక్రయాలు పెరుగుతాయని శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ భుటానీ తెలిపారు. కస్టమర్లకు చేరువయ్యేందుకు ఇలాంటివి (ఐసీసీ వరల్డ్ కప్ తరహా) అనువుగా ఉంటాయని పానాసోనిక్ ఇండియా బిజినెస్ హెడ్ శరత్ నాయర్ అన్నారు. ఏటా సుమారు 12.5 మిలియన్ సెట్ల టీవీలు అమ్ముడవుతాయి. ఇందులో 15 శాతం వాటా లార్జ్ స్క్రీన్ టీవీలదే. ఇంగ్లాండ్లో మే 30వ తేదీన ప్రారంభమైన వరల్డ్ కప్ దాదాపు మరో నెల రోజులు ఉంది.
టీమిండియా ప్రదర్శనపై టీవీల అమ్మకాలు!
ప్రముఖ బ్రాండ్స్ లార్జ్ టీవీల ధరలు రూ.50వేల నుంచి రూ.1.75 లక్షల వరకు ఉంటాయి. కొన్ని మోడల్స్ అంతకంటే ఎక్కువగా కూడా ఉంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వ్యాపారులు పెద్ద ఎత్తున ఆఫర్లు ప్రకటిస్తున్నారు. సులభ వాయిదాలు, క్యాష్ బ్యాక్, ఫ్రీ గిఫ్ట్స్, ధరల తగ్గింపు, డీటీహెచ్ రీచార్జ్ వంటి ఆఫర్లు ఇస్తున్నారు. ఈ ఆఫర్లకు తోడు క్రికెట్ ఫీవర్ కావడంతో విక్రయాలు పెరిగాయి. వరల్డ్ కప్లో భారత్ ఇలాగే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ముందుకెళ్తే లార్జ్ టీవీల అమ్మకాలు మరింత పెరిగే అవకాశముంటుందని, తాము జీరో డౌన్పేమెంట్ ఫైనాన్స్తో పాటు క్యూఎల్ఈడీ టీవీలపై పదేళ్ల నో స్క్రీన్ బర్న్-ఇన్, ప్యానెల్స్పై రెండేళ్ల వారంటీ, 15 శాతం దాకా క్యాష్ బ్యాక్ ఇస్తున్నామని, ప్రీమియం క్యూఎల్ఈడీ టీవీల కొనుగోలుపై ఉచిత అమెజాన్ ఎకో ప్లస్, 4కే యూహెచ్డీ టీవీతో అమెజాన్ ఎకో డాట్ ఫ్రీగా ఇస్తున్నామని శాంసంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భుటానీ (కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్) చెప్పారు.
వరల్డ్ కప్ కారణంగా 25 శాతం వృద్ధి లక్ష్యం
వరల్డ్ కప్ కారణంగా లార్జ్ స్క్రీన్ టీవీల కొనుగోళ్లు పెరిగిన నేపథ్యంలో తమ టార్గెట్ 25 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని పానాసోనికి ఇండియా బిజినెస్ హెడ్ (కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్) శరత్ నాయర్ చెప్పారు. ప్రముఖ కంపెనీల లార్జ్ స్క్రీన్ టీవీల ధరలు రూ.50వేల నుంచి రూ.1.75 లక్షల మధ్య ఉన్నప్పటికీ ఇటీవలే శాంసంగ్ రూ.10.99 లక్షల నుంచి రూ.59.99 లక్షల మధ్య ఉండే విలువ కలిగిన 8K UHD టీవీలను లాంచ్ చేసింది.