ఏటీఎంలు గోడలకు బిగించండి .. నగదు లేకుంటే బ్యాంకులకు జరిమానా వెయ్యండి .. ఆర్బీఐ నిర్ణయం
నగదు కొరతతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు గాను ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఏటీఎంలు నగదు లేకుండా ఖాళీగా ఉంటే ఆ బ్యాంకులపై భారీగా జరిమానా విధించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ సిద్ధం అవుతుంది . ఇక ఈ నేపధ్యంలోనే నగదు లేకుండా ఏటీఎంలను మూడు గంటల పాటు ఖాళీగా ఉంచితే బ్యాంకులపై ఈ జరిమానా విధించాలని ఆర్బీఐ భావిస్తోంది. అంతేకాకుండా ప్రాంతాల వారీగా ఈ జరిమానాను విధించాలని యోచిస్తోంది.
ఏటీఎంలు నగదు లేకుండా ఖాళీగా ఉంటే ఆ బ్యాంకులపై భారీగా జరిమానా విధించనున్న రిజర్వ్ బ్యాంక్
పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావా దేవాలను ప్రోత్సహిస్తున్న వంకతో బ్యాంకులు ఏటీఎంలలో చాలా వరకు డబ్బు లేకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనితో నగదు కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక ఈ నేపధ్యంలోనే రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఏం కేంద్రాలు గత కొద్ది రోజులుగా గంటల కొద్దీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి . దీంతో నగదు కోసం వినియోగదారులు.. బ్యాంకుల్లో బారులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఏటీఎంలలో ఎంత మొత్తం నగదు ఉందనేది బ్యాంకులకు తెలిసే విధంగా సెన్సార్లున్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఏటీఎంల్లో నగదు నింపటంలో బ్యాంకులు అంతగా ఆసక్తి చూపించటం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకు ఖాతాదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఏటీఎం సెంటర్ల వద్ద భద్రత పెంచాలని కూడా రిజర్వ్ బ్యాంక్ సూచన
అంతే కాదు ఏటీఎం సెంటర్ల వద్ద భద్రత పెంచాలని కూడా రిజర్వ్ బ్యాంక్ సూచించింది. సీసీటీవీ కవరేజీని పెంచటం సహా రాష్ట్ర, కేంద్ర సెక్యూరిటీ సిబ్బందితో ఏటీఏం కేంద్రాలను పర్యవేక్షించాలని సూచించింది. 2016లో ఆర్బీఐ ఏర్పాటు చేసిన కమిటీ ఆన్ కరెన్సీ మూవ్మెంట్ సూచించిన సిఫారసులకు అనుగుణంగా బ్యాంకులకు ఈ ఆదేశాలను జారీ చేసింది. అంతేకాకుండా ఏటీఏంలను గోడలు, పిల్లర్లు, ఫ్లోర్కు ఎటాచ్ చేసే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ఏటీఎం లను గోడల్లోనూ, స్తంభాల్లోనూ, నేలపైనా బిగించాలని ఆదేశం
ఏటీఎం కేంద్రాల్లో దొంగతనాలు అరికట్టేందుకు, వాటిని సురక్షితంగా ఉంచేందుకు రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏటీఎం లను గోడల్లోనూ, స్తంభాల్లోనూ, నేలపైనా బిగించాలని బ్యాంకులను ఆదేశించింది. ఈ పనులను సెప్టెంబరు 30 కల్లా పూర్తి చేయాలని నిర్దేశించింది. నిత్యం భద్రత ఉండే విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, సీసీటీవీల పర్యవేక్షణ, భద్రతా బలగాలతో కూడిన అధిక భద్రత కలిగిన ప్రాంతాలు మినహా మిగిలిన కేంద్రాల్లోని ఏటీఎంలకు ఈ భద్రత అవసరం అని చెప్పింది. అలర్ట్స్, సత్వరమే స్పందించేందుకు ఏటీఎం కేంద్రాల్లో సమగ్రమైన ఈ-సర్వియలెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని బ్యాంకులు పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ సూచించింది.