కెపిఎంజిపై నిషేధం? స్టాక్ మార్కెట్లో కలకలం
తెలిసి తెలిసి మనం దొంగను నమ్మం. కానీ.. మనకంటే తెలివైనోళ్లు ఎవరైనా.. ఒకరిని మంచివాడు అని సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత కాస్త నమ్మడానికి ప్రయత్నిస్తాం. కానీ సదరు తెలివైనోడు కూడా మనల్ని మోసం చేస్తే.. ఇక మనం ఎవరిని నమ్మాలి! ఇదే జరిగింది ఐఎల్ఎఫ్ఎస్ స్కాంలో. ఈ కంపెనీకి కొన్నేళ్లుగా క్లీన్ చిట్ ఇస్తూ ఇన్వెస్టర్లను, చట్టబద్ధ సంస్థలను, ప్రభుత్వాలను బకరా చేశాయి రెండు ఆడిటింగ్ సంస్థలు. వీటిని రద్దు చేయడం ప్రధానమైన విషయమైతే.. ఆ తర్వాత పరిణామాలే ఇప్పుడు ఇబ్బందికరంగా మారేట్టు కనిపిస్తున్నాయి.
ఐఎల్ఎఫ్ఎస్ స్కామ్లో డెలాయిట్ హాస్కిన్స్, బిఎస్ఎర్ ఆడిటింగ్ సంస్థల పాత్ర ఉందని జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ కేంద్రానికి నివేదించింది. వీటిపై కొన్నేళ్లపాటు నిషేధం విధించాలని, వీళ్లు రిపోర్టులు ఇచ్చే సంస్థల రిపోర్ట్స్ను ఆమోదించకుండా చేయాలంటూ కేంద్రాన్ని కోరింది. దీంతో ఇప్పుడు అనేక లిస్టెడ్ సంస్థలు ఆందోళనలోపడ్డాయి. ఎందుకంటే కెపిఎంజి నెట్వర్క్కు చెందిన డెలాయిట్, బిఎస్ఆర్ సంస్థలపై ఒకవేళ నిషేధం విధిస్తే 342 సంస్థలపై ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ కంపెనీలన్నింటికీ వీళ్లు ఆడిటర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పాటికే ప్రైస్ వాటర్ కూపర్స్ సంస్థ సత్యం కేసు దెబ్బకు నిషేధాన్ని ఎదుర్కొంటోంది. వచ్చే ఏడాది వరకూ వాళ్లపై నిషేధం ఉంటుంది. ఇప్పుడు కేవలం ఎర్న్స్ట్ అండ్ యంగ్ (ఈ అండ్ వై) మాత్రమే ప్రధాన ఆడిటింగ్ సంస్థగా మిగిలిపోతుంది. అందుకే ఇప్పుడు అనేక లిస్టెడ్ సంస్థల్లో టెన్షన్ పెరిగింది.
చిన్న సంస్థలు ఆడిట్ చేయలేవా
కెపిఎంజి, ఈవై, ప్రైస్ వాటర్ కూపర్స్ సంస్థలు దేశంలో ప్రధాన ఆడిటింగ్ సంస్థలుగా ఉన్నాయి. అనేక లిస్టెడ్ సంస్థలతో పాటు పెద్దకార్పొరేట్ సంస్థలు వీళ్ల క్లైంట్లుగా ఉన్నారు. ఒకవేళ కేంద్రం కెపిఎంజిపై ఏదైనా చర్యలు తీసుకుంటే అప్పుడు చిన్న సంస్థలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పుడు గ్రాండ్ థార్టన్, బిడిఏ, బేకర్ టిల్లీ, మజార్స్ వంటి చిన్న మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నా అవి ఇంత పెద్ద మార్కెట్ను నిలుపుకోగలవా లేదా అనే అంశమే ప్రధానం.
ఉన్న లెక్కల ప్రకారం ఒక్క డెలాయిట్ సంస్థే సుమారు 167 లిస్టెడ్ కంపెనీల ఖాతాలను చూస్తోంది. ఇక కెపిఎంజి సంస్థ 175 కంపెనీలను ఖాతాలను పరిశీలిస్తోంది. దీంతో ఈ గ్రూప్ పై ఎఫెక్ట్ పడితే మూడు, నాలుగు వందల కంపెనీల భవితవ్యం తక్షణం ఇబ్బందుల్లో పడ్తుంది. అలా అని ఇలా స్కాంలో భాగమైన కంపెనీని వదిలిస్తే.. రేపు పొద్దున మరో స్కాంకు కారణం కావొచ్చు. అందుకే కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం కూడా సిద్ధం కావొచ్చు. అయితే ఎలాంటి స్టాండ్ బై వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది అనేది చూడాలి.