ముచ్చటగా మూడో రోజూ లాభాలు ! ఈ రోజు బ్యాంకుల వంతు
స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు కూడా లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఈ రోజు మళ్లీ 12 వేల పాయింట్లను, సెన్సెక్స్ 40 వేల పాయింట్ల మార్కునూ అధిగమించింది. దాదాపు అన్ని రంగాల సూచీలూ లాభాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రోత్సాహక సంకేతాలు వచ్చిన నేపధ్యంలో మన మార్కెట్లు కూడా దౌడుతీశాయి. అయితే ఆఖర్లో కొద్దిగా అమ్మకాల ఒత్తిడి రావడంతో తడబడినప్పటికీ సూచీలు పాజిటివ్గానే క్లోజయ్యాయి. చివరకు సెన్సెక్స్ 166 పాయింట్లు పెరిగి 39950 దగ్గర, నిఫ్టీ 43 పాయింట్ల పెరిగి 11966 దగ్గర, బ్యాంక్ నిఫ్టీ 232 పాయింట్లు పెరిగి 31265 పాయింట్ల దగ్గర ముగిశాయి.
జీ ఎంటర్టైన్మెంట్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, యెస్ బ్యాంక్, వేదాంతా టాప్ ఫైవ్ గెయినర్స్గా నిలిచాయి. ఇండియాబుల్స్ హౌసింగ్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా షేర్లు లూజర్స్ జాబితాలో చేరాయి.
డిహెచ్ఎఫ్ఎల్ నో డ్యూస్
గతవారంలో చెల్లించాల్సిన రూ.1000 కోట్ల వడ్డీ బకాయిలను దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ చెల్లించేసింది. బ్లాక్ స్టోన్, ఆధార్ సంస్థలకు వాటాల అమ్మకం ద్వారా దివాన్ యాజమాన్యం ఈ నిధులను సమీకరించింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఈ సమాచారం బయటకు పొక్కినా.. ఈ స్టాక్లో మాత్రం ఉదయం నుంచే సందడి కనిపించింది. ఇంట్రాడేలో రూ.86 వరకూ పడిన స్టాక్ చివర్లో కోలుకుని రూ.90.15 దగ్గర అర శాతం లాభాలతో పాజిటివ్గా క్లోజైంది.
యెస్ బ్యాంక్కు మళ్లీ టెన్షన్
యెస్ బ్యాంక్కు చెందిన విదేశీ కరెన్సీ రేటింగ్ను డౌన్ గ్రేడ్ చేసే అంశంపై పరిశీలనకు కంపెనీని పర్యవేక్షణలో ఉంచినట్టు మూడీస్ ప్రకటించింది. బ్యాంక్ లిక్విడిటీ సమస్యలను ఎదుర్కొంటున్న నేపధ్యంలో యెస్ బ్యాంక్ తీసుకున్న రుణాలను పరిశీలిస్తున్నట్టు సదరు రీసెర్చ్ సంస్థ తెలిపింది. దీంతో బ్యాంక్ ఆస్తుల నాణ్యతపై మరోసారి అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ వార్తలు వచ్చినప్పటికీ స్టాక్ మాత్రం పాజిటివ్గానే ముగిసింది. 2.5 శాతం పెరిగి రూ.139.30 దగ్గర క్లోజైంది.
స్టెరిలైట్ హైక్
ప్రమోటర్ అనిల్ అగర్వాల్కు చెందిన ఈ కంపెనీ తన సహ సంస్థల ద్వారా 20.74 కోట్ల తనఖా షేర్లను విడిపించుకున్నారు. దీంతో ఈ స్టాక్లో జోరు మొదలైంది. వాల్యూమ్స్తో సహా జంప్ చేసిన స్టాక్ 11 శాతం పెరిగి రూ.191.55 దగ్గర క్లోజైంది.
భారత్ డైనమిక్స్
ఓ కంపెనీకి అవసరమైన అతిబరువైన టోర్పెడోలను తయారు చేసేందుకు భారత్ డైనమిక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు రూ.1200 కోట్ల విలువైన ఈ కాంట్రాక్ట్ను 42 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. ఈ వార్తల నేపధ్యంలో స్టాక్ వాల్యూతో సహా పెరిగింది. ఇంట్రాడేలో రూ.304 వరకూ వెళ్లిన స్టాక్ చివరకు ప్రాఫిట్ బుకింగ్తో రూ.292 దగ్గర క్లోజైంది.
మళ్లీ సన్కు స్ట్రోక్
గోల్డ్మాన్ శాక్స్ సంస్థ సన్ ఫార్మాను మళ్లీ డౌన్ గ్రేడ్ చేసి టార్గెట్ లెవెల్స్ను తగ్గించింది. రూ.437 ఉన్న టార్గెట్ను రూ.355కి దించడంతో స్టాక్ పడింది. మూడు శాతం వరకూ నష్టపోయి రూ.390 దగ్గర క్లోజైంది.