ATM ట్రాన్సాక్షన్పై ఇప్పుడిలా... కొద్ది రోజుల్లో మూడో తీపికబురు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం నాడు ఒకేరోజు మూడు శుభవార్తలు చెప్పింది. రెపో రేటును పావు శాతం తగ్గించడం ద్వారా 6 నుంచి 5.75కు చేరింది. అలాగే, RTGS, NEFT ఛార్జీలను మాఫీ చేసింది. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేయనుంది. మరో తీపి కబురు కూడా త్వరలో చెప్పేందుకు సిద్ధమైంది. అదే ఏటీఎం ఛార్జ్. ఈ ఛార్జీలను సమీక్షించేందుకు కమిటీ వేయనుంది.
త్వరలో ATM ఛార్జీలు తగ్గే అవకాశం, కమిటీ వేయనున్న RBI
మారనున్న ఏటీఎం ఫీజు స్ట్రక్చర్
బ్యాంకులు విధించే ఏటీఎం ఛార్జీలు, ఫీజులను సమీక్షించేందుకు కమిటీ ఏర్పాటు నియమించాలని ఆర్బీఐ నిర్ణయించింది. కమిటి నియామకం తర్వాత.. దాని తొలి సమావేశం నుంచి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఏటీఎం ఫీజు స్ట్రక్చర్ మారనుంది. తద్వారా ఏటీఎంలను ఎక్కువగా వినియోగించే వారిపై కాస్త భారం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఏటీఎంల వినియోగం క్రమంగా పెరుగుతోందని, అలాగే, ఛార్జీలు, ఫీజులు తగ్గించాలనే డిమాండ్ ఉందని ఆర్బీఐ గురువారం పేర్కొంది. సేమ్ బ్యాంక్ ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినా, ఇతర బ్యాంకుల ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినా ఛార్జ్ వసూలు చేస్తారు. దీనిని తగ్గించే ఛాన్స్ ఉంది.
ICICI, SBIలలో ఏటీఎం ఛార్జీలు ఇలా
ఏ బ్యాంకు కార్డుదారులైనా ఇతర బ్యాంకు ఏటీఎంలలో ట్రాన్సాక్షన్స్ చేయవచ్చు. కానీ వీటి సంఖ్యపై పరిమితి ఉంది. అంతకుమించి లావాదేవీలు జరిపితే ఛార్జ్ వసూలు చేస్తారు. ఈ లావాదేవీలపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి.
- ప్రస్తుతం ICICI బ్యాంక్ నెలకు మూడు ట్రాన్సాక్షన్ల (ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్) వరకు ఆరు మెట్రో నగరాల్లో ఉచితం. ఇతర ప్రాంతాల్లో 5 ట్రాన్సాక్షన్లు ఉచితం. ఆ తర్వాత ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కు రూ.20, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కు రూ.8.50 వసూలు చేస్తోంది.
- SBI కూడా మూడు ట్రాన్సాక్షన్లను ఉచితంగా ఇస్తోంది. మెట్రో, నాన్ మెట్రో లొకేషన్లలో ఈ సౌకర్యం ఉంది. ఆ తర్వాత ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కు రూ.20+GST, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కు రూ.8+GST వసూలు చేస్తోంది. మిగతా బ్యాంకుల్లోను అటు ఇటుగా ఇలాగే ఉంది. ఈ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, తగ్గించాలని కోరుతున్నారు. అలాగే, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో తీసినా ఛార్జ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ చర్యలకు ఉపక్రమించింది.
ఆర్బీఐ జోక్యం కోసం విజ్ఞప్తి
ఏటీఎం పరిశ్రమ సమాఖ్యం 2018 జూన్ నెలలోనే ఏటీఎంల ఛార్జ్ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆర్బీఐని కోరింది. అలాగే, నష్టాలకు ఆస్కారం లేకుండా ఛార్జీలను సవరించాలని ఏటీఎం ఇండస్ట్రీ కాన్ఫెడరేషన్ కోరింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించినందుకు వేసే ఛార్జ్ను సవరించనున్నారు. ఆర్బీఐ వేసే కమిటీ.. ఒక బ్యాంకు కార్డుతో ేరే బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రాన్ని వాడినందుకు గాను చెల్లించే మొత్తాన్ని నిర్ణయించనుంది. ఈ కమిటీకి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సీఈవో నేతృత్వం వహిస్తారు.