గుడ్న్యూస్: మూడోసారి రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ, పావు శాతం కట్
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గురువారం రెపో రేటును తగ్గించింది. రెపో రేటును 25 బేసిక్ పాయింట్లు.. అంటే పావు శాతం తగ్గించింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెండు రోజుల పాటు భేటీ అయి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ రోజు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఈ నిర్ణయాలను వెల్లడించారు.
ఇందులో భాగంగా ఆర్బీఐ రెపో రేటుపై కీలక నిర్ణయం తీసుకుంది. కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. రెపో రేటును 25 బేసిక్ పాయింట్ల (పావు శాతం) తగ్గించడంతో గృహ, వాహన రుణాలపై వడ్డీ భారం తగ్గనుంది. అలాగే, ద్రవ్యోల్భణాన్ని 3.1 శాతంగా అంచనా వేసింది. జీడీపీ రేటును 7 శాతంగా అంచనా వేసింది. ఆన్లైన్ లావాదేవీలపై కూడా ఛార్జీలను ఎత్తివేసింది. ఇది అందరికీ ఎంతో ఊరట కలిగించే విషయం. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ట్రాన్సాక్షన్ ఛార్జీల ఎత్తివేత ప్రయోజనాలు బ్యాంకులు కస్టమర్లకు అందించాలని ఆదేశించింది.
ఆరు శాతంగా ఉన్న రెపో రేటు తాజా నిర్ణయంతో 5.75 శాతానికి చేరుకుంది. రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటును వరుసగా 5.50శాతం, ఆరు శాతానికి సవరించింది. ఆర్థికవృద్ధి నెమ్మదించడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో వడ్డీరేట్లను తగ్గించాలని ఆర్బీఐ నిర్ణయించింది. అంతకుముందు జీడీపీని 7.2 శాతంగా అంచనా వేసిన ఆర్బీఐ, ఈసారి దానిని 7 శాతానికి సవరించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆర్ధభాగంలో ద్రవ్యోల్భణం 3.0 నుంచి 3.1 శాతంగా, రెండో అర్ధభాగంలో 3.4 నుంచి 3.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
ఆర్బీఐ ఈ క్యాలెండర్ ఇయర్లో రెపో రేటు తగ్గించడం ఇది మూడోసారి. గతంలో పావు శాతం చొప్పున రెండుసార్లు తగ్గించింది. దీంతో రెపో రేటు 6.5 శాతం నుంచి 6కు తగ్గింది. ఇప్పుడు మరో పావు శాతం తగ్గడంతో 5.75 శాతానికి దిగి వచ్చింది. దీంతో వివిధ రకాల రుణాలు తీసుకునే వారికి వడ్డీ రేటు తగ్గనుంది.