ఆర్బీఐ రెపో రేటు ఎఫెక్ట్, కుప్పకూలిన మార్కెట్లు: తగ్గనున్న హోంలోన్ EMI
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపో రేటును పావు శాతం (25 బేసిక్ పాయింట్స్) తగ్గించడంతో గురువారం మధ్యాహ్నం స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కనిపించాయి. సెన్సెక్స్ 600 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 11,850 పాయింట్లకు దిగువన ట్రేడ్ అయింది. ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గింపుపై మార్కెట్లు ఆసక్తిగా ఎదురు చూశాయి. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. రెపో రేటు తర్వాత కుప్పకూలాయి.
మధ్యాహ్నం గం.12.45 నిమిషాలకు సెన్సెక్స్ 333 పాయింట్లు దిగజారి 39,750 వద్ద, నిఫ్టీ 113 పాయింట్ల నష్టంతో 11,909 వద్ద ట్రేడ్ అయింది. బ్యాంకింగ్, పీఎస్యూ, ఫార్మా, లోహ, ఐటీ, ఆటోమొబైల్, మౌలిక, ఎనర్జీ రంగాల షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రా, ఐసీఐసీఐ తదితర బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఏషియన్ పేయింట్స్, హెచ్యూఎల్, కోల్ ఇండియా, టైటాన్, పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్, ఓఎన్జీసీ లాభాల్లో కొనసాగాయి.

రెపో రేటు తగ్గింపు ద్వారా రియల్ ఎస్టేట్, ఎన్బీఎఫ్సీ, ఆటో సెక్టార్లకు ప్రయోజకరమని భావిస్తున్నారు. బ్యాంకులు కాస్ట్ ఆఫ్ ఫండ్స్ తగ్గించడంతో పాటు వాటిని రుణగ్రహీతలకు పాస్ చేయవచ్చునని, కాబట్టి రెపో రేటు తగ్గుదల బ్యాంకింగ్ సెక్టారుకు కూడా ప్రయోజనకరమని చెబుతున్నారు.
రియల్ ఎస్టేట్ బిజినెస్కు రెపో రేటు తగ్గుదల ఊతమిస్తుందని చెబుతున్నారు. ఆర్బీఐ తాజా నిర్ణయంతో హోమ్ లోన్ వడ్డీ తగ్గుతుందని, అప్పుడు తక్కువ EMI ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి ఇంటి కొనుగోలుకు మరింత మంది ఆసక్తి చూపించడం ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్లస్ అవుతుందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications