పెరిగిన బంగారం ధరలు... మూడునెలల గరిష్టానికి చేరిన పుత్తడి
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత మూడునెలల్లో ఎన్నడూ లేనంతగా పుత్తడి ధరలు పెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక గమనం మందగించడం అమెరికాతో పలు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతుండటమే బంగారు ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఆయాదేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉండటం కూడా బంగారు ధరల పెరుగుదలకు కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఔన్స్ బంగారం ధర స్వల్పంగా అంటే 0.2శాతం పెరిగి 1,322.27 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన అత్యధికంగా పలికిన ధర ఆ తర్వాత ఇప్పుడే పెరుగుతుండటం విశేషం.ఇక అమెరికాలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నట్లు కనిపించాయి. ఇక భారత్ విషయానికొస్తే మంగళవారం రోజున 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.30,810గా ఉండగా.. కోల్కతాలో రూ.21,720గా ఉన్నింది. ముంబైలో 10 గ్రాముల బంగారం ధర రూ.31,460 రూపాయలుగా ఉంది. బంగారు ధరలపై అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపుతాయి. డాలరుతో పోల్చితే రూపాయి బలపడటం వంటి అంశాలు బంగారు ధరలను ప్రభావితం చేస్తాయి.
మరోవైపు అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంతో ఆ ప్రభావం బంగారం ధరలపై పడుతోంది. మరోవైపు మెక్సికో వస్తువులపై అమెరికా సుంకం విధించడం కూడా ఆందోళన కలిగిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో వస్తువులపై అధిక సుంకం విధించినప్పటికీ ఆ దేశంలోకి వలసలు ఆగవని అన్నారు మెక్సికో విదేశాంగశాఖ మంత్రి మార్సెలో ఎబ్రార్డ్. దీనికి తోడు పారిశ్రామికంగా తీసుకుంటున్నచర్యలు కూడా ఏషియా ఐరోపా మార్కెట్లపై గత మేనెలలో ప్రభావం చూపాయి.అమెరికా ఉత్పత్తి రంగానికి సంబంధించి విడుదలైన సమాచారం ప్రకారం ఆ రంగం కాస్త మందగించినట్లు తెలుస్తోంది. ఇక దీన్ని అధిగమించాలంటే రానున్న సమీక్షలో ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించేలా ప్రకటన చేయాలని ఇన్వెస్టర్లు కోరుతున్నారు.