పెన్షన్పై తెలంగాణవాసులకు గుడ్న్యూస్: ఎవరు అర్హులంటే?
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల విషయంలో లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ప్రస్తుతం ఉన్న పింఛన్లు రెట్టింపు చేస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. అయితే ఈ పెరిగిన పింఛన్లు జూన్ నెల నుంచి అమలు కానున్నాయి. పెరిగిన పింఛన్ జూలై నెలలో లబ్ధిదారులకు అందనున్నాయి. పింఛన్లు డబుల్ చేస్తామని టీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పింది. ఆ తర్వాత అమలు చేసే సమయానికి ఎన్నికల కోడ్ వచ్చింది. దీంతో నిలిచిపోయింది. లోకసభ ఎన్నికల అనంతరం ఎన్నికల కోడ్ ముగియడంతో ఇప్పుడు అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
జగన్ ముందు కఠిన ఆర్థిక సవాళ్లు... ఇవే!
పింఛన్ ఎవరికి ఎంత అంటే?
దివ్యాంగులకు నెలకు రూ.3,016, మిగతా వారికి రూ.2,016 పింఛన్ ఇస్తారు. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్ఐవీ (ఎయిడ్స్) బాధితులు, ఒంటరి మహిళలు, బోదకాల బాధితులకు ఇకపై పెరిగిన పింఛన్ల ప్రకారం నెలకు రూ.2,016 అందనుంది. దివ్యాంగులకు రూ.3,016 అందనున్నాయి. ఇప్పటి వరకు మొదటి వారికి రూ.1,000 పింఛన్ ఉండగా, దీనిని రెండింతలు (రూ.2,016) చేశారు. వికలాంగులకు రూ.1,500 ఉండగా రూ.3,016 చేశారు.
వృద్ధాప్య పింఛన్కు వయస్సు కుదింపుపై...
వృద్ధాప్య పింఛన్ వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు కుదిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా బడ్జెట్లో నిధులను చూపించారు. కానీ దీనికి సంబంధించి ఉత్తర్వులు మాత్రం జారీ కాలేదు. పింఛన్ రెట్టింపు కావడం మినహా మిగతా నిబంధనలు పాతవేనని జీవోలో ఉంది. రాష్ట్రంలో పింఛన్లు తీసుకుంటున్న వారి సంఖ్య 39 లక్షలకు పైగా ఉంది. ప్రభుత్వం నిర్ణయంతో వీరందరికి ప్రయోజనం చేకూరనుంది. లబ్ధిదారుల పింఛన్ కోసం బడ్జెట్పై ఏడాదికి మరో రూ.4,950 కోట్ల మేర భారం పడుతుంది. అంటే రూ.9,900 కోట్లు అవసరం.
వయో పరిమితిని 57 ఏళ్లకు కుదిస్తే...
వృద్ధాప్య పించన్ 57 ఏళ్లకు కుదిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అలా కుదిస్తే అందరితో పాటు వీరికి కూడా జూలై నుంచి పింఛన్లు అందేవి. అప్పుడు మరో 7 లక్షల మంది ఆసరా లిస్టులో చేరుతారు. ఈ అంచనాతో ప్రభుత్వం నిధులు కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో వృద్ధాప్య పింఛన్ వయో పరిమితిని 57 ఏళ్లకు కుదిస్తే త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ప్రస్తుతానికి 65 ఏళ్ల వయస్సున్న వృద్ధులు పింఛన్కు అర్హులు. బర్త్ సర్టిఫికెట్ లేదా ఆధార్ లేదా వయసును సూచించే ఏదైనా ఇతర డాక్యుమెంట్లు ఉండాలి. ఆ పత్రాలు లేకపోతే ప్రభుత్వ అధికారి లభ్ధిదారుని కుటుంబ సభ్యుల వయసు తదితర వివరాల ఆధారంగా నిర్ధారించవచ్చు. అప్పుడు కూడా కుదరనిపక్షంలో మెడికల్ బోర్డుకు సూచిస్తారు.
అర్హులు వీరే..
ఏప్రిల్ 1, 2019 నాటికి 65 సంవత్సరాలు నిండిన వారు ఆసరా పింఛన్కు అర్హులు. అలాగే, వికలాంగులు కనీసం నలభై శాతం వైకల్యంతో ఉంటే వారికి వికలాంగుల పింఛన్ వస్తుంది. 18 ఏళ్లు నిండి, భర్త డెత్ సర్టిఫికేట్ కలిగిన వారు వితంతు పింఛన్కు అర్హులు. యాంటీ రిట్రో వైరల్ థెరపీ చేయించుకొని, వ్యాధి హెచ్ఐవీ వ్యాధి నిర్ధారణ అయిన వారు అర్హులు. 50 ఏళ్లు నిండిన గీత, చేనేత కార్మికులు అర్హులు. గీత కార్మికులు కల్లుగీత సహాయ సంఘంలో సభ్యత్వం కలిగి ఉండాలి.